నన్ను వ్యతిరేకించాలనుకుని కొందరు నేతలు దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు: విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Bjpandhra/fb
ప్రపంచ దేశాలు పాకిస్తాన్ను ఏకాకిని చేస్తే మన నాయకులు కొందరు పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, వారి వల్ల మన సైనికుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
విశాఖ రైల్వే మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో ఆయన తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
‘‘అందమైన విశాఖను చూస్తే నా మనసు పులకరిస్తుంది. లక్ష్మీనరసింహ స్వామి వెలసిన పుణ్యభూమిలో, తెన్నేటి విశ్వనాథం ప్రాతినిథ్యం వహించిన నేలపై, అల్లూరి సీతారామ రాజు పోరాడిన ప్రాంతంలో, పారిశ్రామికంగా, పర్యాటకంగా అభవృద్ధి చెందిన విశాఖకు రావడం ఆనందంగా ఉంది‘‘ అని తెలుగులో చెప్పారు.

ఫొటో సోర్స్, Bjpandhra/fb
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ పేరుతో రైల్వే జోన్ను అందించామని తెలిపారు.
పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా అనేక కేంద్ర సంస్థలను ఏపీలో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
తమ అవినీతి సంపదను కాపాడుకునేందుకు కొందరు కేంద్రంపై పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
‘‘మేం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామంటే దానికి కారణం మాకు ఎలాంటి భయాలు లేకపోవడం. ఏపీని పాలిస్తున్న నాయకులే భయపడాలి. వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని వారికి ఆందోళన. యూటర్న్ తీసుకునే నాయకులు వారి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు నాపై విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ కొందరితో కూటమి కడుతున్నారు. వారికి నన్ను పదవి నుంచి దింపడం తప్పితే ఎలాంటి అజెండా లేదు.’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Bjpandra/fb
ప్రపంచ దేశాలు పాక్ను ఏకాకిని చేస్తే మన నాయకులు కొందరు పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, వారి వల్ల మన సైనికుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని అన్నారు. మోదీని వ్యతిరేకించాలనే పేరుతో వారు దేశాన్నే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వారి మాటలను పాక్ పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారని చెప్పారు. దేశాన్ని కించపరిచే అలాంటి నేతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఫొటో సోర్స్, Bjpandhra/fb
‘ప్రత్యేక హోదా మాటేది’?
ఆంధ్రలో పర్యటిస్తున్నపుడు ప్రధాని మోదీ చాలా అమలు కాని హామీలకు సమాధానాలు చెప్పాలని, అవన్నీ వదిలేసి ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని హడావిడిగా ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించారని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు జింకా నాగరాజు అన్నారు.
మోదీ సభ గురించి ఆయన బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ... ‘‘పాక్ సమస్యను ప్రస్తావించి తనను వ్యతిరేకించడమంటే దేశాన్ని వ్యతిరేకించడమనే విధంగా మోదీ మాట్లాడారు. ఆయన ప్రస్తావించాల్సిన అసలు విషయం అది కాదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఏమయిందనేది చెప్పాలి. ఆయన 2014 ఎన్నికలపుడు ఈ హామీ ఇచ్చారు. తిరుమలేశునిగా సాక్షిగా ఇచ్చారు.ఈ విషయంలో వాస్తవం చెప్పాలి. అదే విధంగా వెనకబడిన ప్రాంతాలకు గత నాలుగేళ్లలో ఏంచేశారో చెప్పాలి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఏమయిందో చెప్పాలి. ఇలాంటి వేమీ లేకుండా ఆయన ఆంధ్ర పర్యటనలను చంద్రబాబును ప్రత్యక్షంగానో, పరోక్షంగా విమర్శించేందుకు వాడుకుంటున్నారు’’ అని ఆయన విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి
- కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- పాకిస్తాన్పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- కొండవీడు రైతు కోటయ్య మృతి... సమాధానాల్లేని ప్రశ్నలు
- #WhyModi: మళ్లీ ప్రధానిగా మోదీనే ఎందుకు?
- ‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్ల ఫొటో నిజమేనా’
- వర్జినిటీ ట్రీ: ఆ చెట్టుకు కండోమ్స్ కట్టి పూజలు చేస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








