'ది క్వింట్' కార్యాలయాల్లో ఐటీ సోదాలు, 'ఎడిటర్స్ గిల్డ్‌'ను ఆశ్రయించిన రాఘవ్ బహల్

మీడియా సంస్థ 'క్వింటిలియన్ మీడియా'కు చెందిన వెబ్‌సైట్ 'ది క్వింట్' కార్యాలయంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ మేరకు వార్తావెబ్‌సైట్ 'దిక్వింట్.కామ్' వెల్లడించింది.

ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం దిల్లీ సమీపంలోని నోయిడాలోని తమ కార్యాలయానికి వచ్చారని 'ది క్వింట్' తెలిపింది.

క్వింట్ 'ఎడిటర్ ఇన్ చీఫ్' రాఘవ్ బహల్, సీఈవో రీతూ కపూర్‌ల నివాసాలకు.. అదే గ్రూప్‌నకు చెందిన క్వింట్‌టైప్ కార్యాలయాల్లోనూ సోదాల కోసం ఐటీ అధికారులు వెళ్లారు. క్వింటిలియన్ మీడియాకు వాటాలున్న 'ది న్యూస్ మినిట్' కార్యాలయంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.

'ఆర్థికాంశాలకు సంబంధించని ఏ సమాచారమూ తీసుకెళ్లొద్దు'

తాజా పరిణామాలను 'ది క్వింట్' ఎడిటర్ ఇన్ చీఫ్ రాఘవ్ బహల్ ఎడిటర్స్ గిల్డ్ దృష్టికి తీసుకెళ్లారు.

''ఈ రోజు ఉదయం నేను ముంబయిలో ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో ఐటీ అధికారులు మా ఇంటికి, ది క్వింట్ కార్యాలయానికి సర్వే కోసమంటూ వచ్చారు. మాది పూర్తిగా పన్నులు చెల్లించే సంస్థ. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని పత్రాలనూ అధికారులకు ఇస్తాం. అయితే.. ఆర్థికేతర అంశాలకు సంబంధించిన, మా పాత్రికేయానికి సంబంధించిన పత్రాలు, సున్నితమైన సమాచారం లేదా మెయిల్స్ చూడవద్దని, తీసుకువెళ్ళకూడదని అధికారులను కోరాను. వారు కనుక అలా చేస్తే మేం తప్పకుండా తీవ్రస్థాయిలో ప్రతిస్పందిస్తాం.

ఈ విషయంలో ఎడిటర్స్ గిల్డ్ మాకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.

అధికారులు తమ మొబైల్ ఫోన్ల సహాయంతో అనుమతి లేకుండా ఎలాంటి పత్రాల నకళ్లు తమతో తీసుకెళ్లకూడదు'' అంటూ ప్రకటన విడుదల చేశారు.

ఇది బీజేపీ పనే: రాహుల్ గాంధీ

కాగా క్వింట్‌పై ఐటీ దాడుల వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ''వారు(బీజేపీ) మీడియాను అణగదొక్కాలని చూస్తున్నారు. అందుకోసం సోదాలు, దాడులు జరపడం.. వేధింపులు, అణచివేతకు పాల్పడడమే వారి అజెండా'' అన్నారు.

మరోవైపు పాత్రికేయ రంగానికీ చెందినవారూ దీనిపై స్పందిస్తున్నారు.

ఈ దాడులు ఆందోళనకర పరిణామమని 'ది ప్రింట్' వ్యవస్థాపకుడు శేఖర్ గుప్తా ట్వీట్ చేశారు.

''ప్రశ్నించడానికి, వివరాలు తెలుసుకోవడానికి ఆదాయ పన్ను శాఖ అధికారులకు హక్కుంది. కానీ, ఈ దాడులు బెదిరింపు చర్యల్లా కనిపిస్తున్నాయి. వారు చేసే పనికి కారణముంటే ప్రభుత్వ వెంటనే అదేంటో వివరించాలి. లేకుంటే తమను విమర్శించే మీడియాను వారు లక్ష్యం చేసుకున్నారనే అనుకోవాల్సి ఉంటుంది'' అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)