కోటా వ్యతిరేక 'భారత్ బంద్' సందర్భంగా బిహార్లో హింస

ఫొటో సోర్స్, Prashant/BBC
పై చిత్రం బిహార్లోని ఆరా పట్టణానిది. కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం 'సవర్ణులు' ఇచ్చిన 'భారత్ బంద్' సందర్భంగా బిహార్లో పలు చోట్ల హింస జరిగింది.
బిహార్లోని ఆరా, భోజ్పూర్, ముజఫర్పూర్ జిల్లాల్లో రోడ్లపై దహనకాండ, హింసాత్మక ఘర్షణలు జరిగినట్టు సమాచారం.

ఫొటో సోర్స్, Prashant/BBC
బిహార్ నుంచి సీటూ తివారీ అందించిన రిపోర్టు ప్రకారం..
- కులం ఆధారంగా ఇస్తున్న రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మంగళవారం నాడు నిర్వహించిన భారత్ బంద్ ప్రభావం బిహార్లో ఆరా, గయా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించింది.
- ఆరా పట్టణంలో బస్టాండ్ వద్ద బంద్ నిర్వాహకులకూ, బంద్ వ్యతిరేకులకూ మధ్య వాగ్వాదం జరిగింది.
- భోజ్పూర్ ఎస్పీ అవకాశ్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, "పరిస్థితి ఇప్పుడు మామూలుగా ఉంది. మొత్తం 56 మందిని అరెస్ట్ చేశాం. ఎవరూ గాయపడ్డట్టు సమాచారం లేదు. బంద్ను వ్యతిరేకిస్తున్న వారు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్టు వార్త వచ్చింది కానీ దానిని ఇంకా నిర్ధరించాల్సి ఉంది. పట్టణంలో గస్తీ నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ మామూలుగా ఉంది" అని చెప్పారు.
- ఆరా, గయాల్లోని అత్యధిక జిల్లాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. గత ఏప్రిల్ 2న జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని దుకాణాలను ముందే మూసేశారు.
- రోహ్తాస్కు చెందిన పాత్రికేయుడు బ్రజేశ్ మాట్లాడుతూ, "సాసారామ్లో మార్కెట్లన్నీ మూతపడ్డాయి. బస్ సర్వీసులు నిలిచిపోయాయి. అయితే బంద్ శాంతియుతంగానే నడుస్తోంది. ఎలాంటి హింసా జరుగలేదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Prashant/BBC
భారత్ బంద్ సందర్భంగా హింస జరిగే అవకాశం ఉన్నందున రాజస్థాన్లోని జయ్పూర్, మధ్యప్రదేశ్లోని భోపాల్లలో సెక్షన్ 144 విధించారు.
రాజస్థాన్లోని ఝాలావాడ్ జిల్లాలో మార్కెట్లు బంద్ అయ్యాయి. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఫొటో సోర్స్, Prashant/BBC
భారత్ బంద్ సందర్భంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఎలాంటి హింస జరిగినా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హోంశాఖ ముందస్తుగా హెచ్చరించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
అంతకు ముందు, ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఏప్రిల్ 2న భారత్ బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుతో దళితులపై, ఆదివాసులపై జరిగే అత్యాచారాలను నిరోధించే చట్టం బలహీనపడుతుందని ఆ సంఘాలు ఆరోపించాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








