పులుల లెక్కింపు: పాద ముద్రలు, మలం, గోళ్లు... అన్నీ ఆధారాలే!

ఫొటో సోర్స్, AP Forest Department
- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ తెలుగు కోసం
అభయారణ్యాల్లో పులులను ఎలా లెక్కిస్తారు? వయసును ఎలా నిర్ధరిస్తారు? ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడతారు? నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోందా, తగ్గుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో...
జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ- ఎన్టీసీఏ) ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా పులులను లెక్కించింది.
16 పెద్దపులి ఆవాస రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని అన్ని అడవుల్లో నాలుగేళ్లకోసారి ఈ గణన జరుగుతుంది.
పులులతోపాటు ఇతర వన్యప్రాణులను కూడా లెక్కిస్తారు.

ఫొటో సోర్స్, AP Forest Department
లెక్కింపు విధానం
వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి, పులులతోపాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు.
ఐదు పద్ధతుల్లో వీటి గణాంకాలను సేకరిస్తారు.
అటవీ సిబ్బంది నడక మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే, వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు.

ఫొటో సోర్స్, DL Narasimha
పగ్ మార్క్ విధానంలో అయితే సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు.
మెుదట ఒక గాజుపలకపై స్కెచ్ పెన్తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు.
నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్ పౌడర్ చల్లుతారు. తర్వాత రింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని వేస్తారు. 15 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డ కట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది.
పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినదీ నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనే దాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, DL Narasimha
అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి, సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్లోని 'సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)'కి పంపుతారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు.
వెంట్రుకలు, గోళ్లకు పరీక్షలు
అడవి జంతువులు చెట్లకు, రాళ్లకు పాదాలను, శరీరాన్ని రుద్దుతుంటాయి.
గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు, శరీరంపై దురదను పోగొట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయి. అప్పుడు వాటి వెంట్రుకలు, గోళ్లు ఊడి పడిపోతుంటాయి.
అటవీ సిబ్బంది చెట్లు, రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సంచరించిన జంతువు ఏదో గుర్తించగలుగుతారు. సేకరించిన వెంట్రుకలు, గోళ్లకు డీఎన్ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధరిస్తారు.
అత్యాధునిక కెమెరాల వినియోగం
2014 నుంచి ఎన్టీసీఏ వన్యప్రాణుల లెక్కింపులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను వాడుతోంది.
వీటిని వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో ఎదురెదురుగా చెట్లకు అమరుస్తారు. ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉంచే ఈ కెమెరాలు 24 గంటలూ వాటంతటవే పనిచేస్తాయి.
చీకట్లో అయితే ఫ్లాష్ ఉపయోగించి ఫొటోలు తీస్తాయి.

ఫొటో సోర్స్, Andhra Pradesh Forest Department
జంతువుల కదలికలు, ఉష్ణోగ్రతల ఆధారంగా కెమెరాలు పని ప్రారంభిస్తాయి. వీటిలో నమోదైన సమాచారాన్ని రోజూ సేకరిస్తారు.
చిత్రాల్లోని జంతువుల ఎత్తు, చారలు, నడకను పరిగణనలోకి తీసుకొని వాటి సంఖ్యను లెక్కగడతారు.
ఇలా వివిధ పద్ధతుల్లో సేకరించిన ఆధారాలను, నివేదికలను ఎన్టీసీఏ అధికారులు ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్లో ఉన్న భారత వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ)కు పంపుతారు.
డబ్ల్యూఐఐ అందించే నివేదిక ఆధారంగా ఎన్టీసీఏ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు పంపుతుంది. ఆ శాఖ దీనిని పార్లమెంటుకు సమర్పిస్తుంది.
దేశవ్యాప్తంగా పులుల సంఖ్యలో పెరుగుదల
2006లో ఏర్పాటైన ఎన్టీసీఏ ఇప్పటికి మూడుసార్లు దేశవ్యాప్తంగా వన్యప్రాణుల గణన నిర్వహించింది. ప్రస్తుతం జరుగుతున్నది నాలుగో గణన.
2006తో పోలిస్తే 2014 నాటికి దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెరిగింది. 2006 సంవత్సరానికి పులుల సంఖ్య 1,411గా ఉండగా, 2010 నాటికి 1,706కు, 2014 నాటికి 2,226కు చేరినట్లు ఎన్టీసీఏ తన నివేదికలో తెలిపింది.

ఫొటో సోర్స్, AP Forest Department
నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలో పరిస్థితి?
దేశంలోని అతిపెద్ద అభయారణ్యాల్లో ఒకటైన నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంలో 2006లో 95 పులులు ఉండేవి. 2010లో వీటి సంఖ్య 72కు, 2014 నాటికి 68కి తగ్గింది.
2009లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అత్యధిక ప్రాంతం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చింది. గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం కూడా ఇందులో విలీనమైంది.
ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది.
నల్లమలలోని గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యంలోని 1,193.68 చదరపు కిలోమీటర్లు విలీనం కావడంవల్ల 2,444.14 చ.కి.మీ. కోర్ ఏరియా, 1,283.36 చ.కి.మీ. బఫర్ ఏరియా కలిపి నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తీర్ణం 3,727.5 చదరపు కిలోమీటర్లకు చేరింది.
పులులు నివాసం ఉండే ప్రధాన ప్రాంతాన్ని కోర్ ఏరియా అని, సంచరించే అవకాశమున్న ప్రాంతాన్ని బఫర్ ఏరియా అని వ్యవహరిస్తారు.
తెలంగాణలో 20 పులులు
ఇక తెలంగాణలో పెద్ద పులులు 20కి పైగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కవ్వాల్, ఆమ్రాబాద్ రెండు అభయారణ్యాలున్నాయి.
ఆమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్ నల్లమలలోనే ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన తరువాత అది తెలంగాణలో భాగమైంది.
ప్రస్తుత గణనలో సేకరించిన పాదముద్రలు, మల విసర్జితాల ఆధారంగా తెలంగాణలో 20కి పైగా పులులు ఉండొచ్చని తెలంగాణ అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, SivaPrasad/DL Narasimha
'పులుల పునరుత్పత్తికి అనుకూలంగా నల్లమల'
2014 తర్వాత నుంచి పులుల పునరుత్పత్తికి నల్లమలలో అనుకూల వాతావరణం ఏర్పడిందని, ఫలితంగా పులుల సంఖ్య పెరుగుతోందని నంద్యాల డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) శివప్రసాద్ తెలిపారు.
నల్లమల ప్రాంతంలోని నంద్యాల, ఆత్మకూరు, మార్కాపురం డివిజన్ల పరిధిలో వంద బేస్ క్యాంపులు ఉన్నాయని, అక్కడ రాత్రింబవళ్లు అటవీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వేటగాళ్ల నుంచి పులులకు రక్షణ దొరుకుతోందని ఆయన చెప్పారు.
జంతువుల వేట, కలప స్మగ్లింగ్ను నియంత్రించేందుకు వివిధ ప్రదేశాల్లో కందకాల తవ్వకం లాంటి చర్యలు చేపడుతున్నామని శివప్రసాద్ తెలిపారు.
గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం కేంద్రంగా పులులు రుద్రవరం, అహోబిలం మీదుగా కడప జిల్లాలోని శేషాచలం కొండలైన ప్రొద్దుటూరు, సిద్దవటం వరకు పులుల సంతతి పెరుగుతోందని ఆయన తెలిపారు. నల్లమలలో గతంతో పోలిస్తే పులుల సంఖ్య పెరిగినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








