సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ)...

మొన్నటి వరకు చాలా మందికి పెద్దగా ఈ పేరు తెలిసి ఉండదు. కానీ, ఇప్పుడు ఈ పేరు రోజూ వార్తల్లో కనిపిస్తోంది.

అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడింది. ఎక్కువగా టెక్ స్టార్టప్‌లకు రుణాలిచ్చే ఈ బ్యాంకు దివాలా తీసే పరిస్థితి రావడంతో అమెరికాలోని నియంత్రణ సంస్థలు దీన్ని మూసివేశాయి. బ్యాంకు ఖాతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి.

2008 ఆర్థిక సంక్షోభం తరువాత అమెరికాలో దివాలా తీసిన అతిపెద్ద బ్యాంకు ఇదే.

కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉంది. అమెరికావ్యాప్తంగా 17 శాఖలు, ఇతర దేశాలలో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి.

2022 డిసెంబర్ 31నాటికి, ఈ బ్యాంకు మొత్తం ఆస్తుల విలువ 209 బిలియన్ డాలర్లు. దీని ఖాతాల్లో 1743.4 బిలియన్ డాలర్లు జమ అయ్యాయి.

ఒక నివేదిక ప్రకారం, ఈ బ్యాంక్ 2,500 కంటే ఎక్కువ వెంచర్ క్యాపిటల్ సంస్థలకు బ్యాంకింగ్ సేవలను అందించింది.

బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం, వాతావరణ సాంకేతికత, సుస్థిరత (సస్టయినబిలిటీ) రంగాలలో 1,550 కంటే ఎక్కువ కీలక ఖాతదారులు ఉన్నారు.

అమెరికాకు చెందిన ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) సాధారణంగా 2,50,000 డాలర్ల వరకు డిపాజిట్‌లను కాపాడుతుంది. అంతకన్నా ఎక్కువ సొమ్ము ఖాతాల్లో ఉన్నవారి కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను కేటాయించినట్టు ఎఫ్‌డీఐసీ ప్రకటించింది.

ఈ బ్యాంక్ మూతపడటం టెక్ ఇండస్ట్రీలో కలకలాన్ని రేపింది.

బ్యాంకు దివాలా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారిలో భారతీయ స్టార్టప్ కంపెనీలు కూడా ఉన్నాయి. కంపెనీ ఖర్చులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం మీద అవి ఆందోళన చెందుతున్నాయి.

"ఎస్వీబీ మూతపడడం ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లకు చిక్కే. స్టార్టప్‌లు భారత ఆర్థికవ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఈవారం భారతీయ స్టార్టప్‌లను కలిసి సమస్య ఎంత పెద్దదో తెలుసుకుని, కేంద్ర ప్రభుత్వం వారికి ఎలా సహాయం అందించగలదో పరిశీలిస్తాను" అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.

ఎస్వీబీ ఎలా దివాలా తీసింది?

ఇతర బ్యాంకుల మాదిరిగానే ఎస్వీబీ కూడా యూఎస్ ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నంతకాలం లాభాలు వచ్చాయి. కానీ, ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు పెరగడంతో కష్టాల్లో పడింది.

2.25 బిలియన్ డాలర్ల నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తెలిపింది. యూఎస్ ప్రభుత్వ బాండ్స్ విక్రయం వల్ల వచ్చిన నష్టాలను పూడ్చడానికి షేర్ల అమ్మకం మొదలెట్టామని అది వెల్లడించింది.

ఆ వార్తతో ఖాతాదారులు, పెట్టుబడిదారులు భయపడ్డారు. ఫలితంగా గురువారం బ్యాంకు షేర్లు 60 శాతానికి పైగా పడిపోయాయి. దాంతో ట్రేడింగ్ ఆపేశారు.

మరోవైపు, వడ్డీ రేట్లు బాగా పెరగడంతో, స్టార్టప్‌లకు ప్రైవేటు రంగం నుంచి నిధులు పోగుచేసుకోవడం కష్టమైంది. చాలామంది ఖాతాదారులు బ్యాంకు నుంచి డబ్బు వాపస్ తీసుకోవడం మొదలెట్టారు. దాంతో, బ్యాంకు మరిన్ని చిక్కుల్లో పడింది.

"తగినంతగా ఆదాయం లేకపోవడం, అప్పులు తీర్చే సామర్థ్యం తగ్గిపోవడం" కారణంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను నియంత్రణలోకి తీసుకున్నట్లు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ తెలిపింది.

షేర్ల అమ్మకంలో 1.8 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు మార్చి 8న బ్యాంకు తెలిపింది.

మార్చి 9 ముందు వరకు బ్యాంకు పరిస్థితి స్థిరంగానే ఉన్నట్టు ప్రభుత్వ దస్తావేజులు తెలుపుతున్నాయి.

అయితే, బ్యాంకుకు నష్టాలు వస్తున్నాయన్న వార్త గుప్పుమనడంతో పెట్టుబడిదారులు, ఖాతాదారులు బ్యాంకు నుంచి డబ్బు వెనక్కి తీసుకునేందుకు బారులు తీరారు. ఇది ఎస్వీబీని ఇక్కట్ల పాలుచేసింది.

మార్చి 9 సాయంత్రానికి బ్యాంకు నగదు నిల్వ సుమారు 958 మిలియన్ డాలర్లు నెగటివ్‌గా ఉందని ప్రభుత్వ పత్రాలు చెబుతున్నాయి.

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి బ్యాంకు ప్రయత్నించింది, కానీ విజయవంతం కాలేదు.

అమెరికాలోని కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు భయాందోళనలకు గురికావడం వల్లే బ్యాంకుకు ఈ పరిస్థితి వచ్చిందని, చివరికి మూతబడిందని ఎవెటార్ వెంచర్స్ వ్యవస్థాపకుడు మోహన్ కుమార్ అన్నారు.

"ఈ సమస్యకు మూలం 'ఫెడ్' (యుఎస్ బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించే సంస్థ). బ్యాంకు కాదు. ఫెడ్ తొమ్మిది నెలల్లో వడ్డీ రేటును ఆరు, ఏడుకు తగ్గిస్తుందని ఎవరు ఊహిస్తారు?" అన్నారాయన.

భారతీయ స్టార్టప్‌లు ఈ బ్యాంకును ఎంచుకోవడానికి కారణమేంటి?

ఎన్ని భారతీయ స్టార్టప్‌లు ఈ బ్యాంకుతో అనుబంధం కలిగి ఉన్నాయో, ఎంత డబ్బు ఇక్కడ డిపాజిట్ చేశారో ఇప్పటికి స్పష్టంగా తెలీదు.

ఎస్వీబీ సేవలను వినియోగించుకుంటున్న భారతీయ స్టార్టప్‌ల సంఖ్య 20-25 కంటే ఎక్కువ ఉండదని 'హార్వెస్టింగ్ ఫార్మర్ నెట్‌వర్క్' హెడ్ రుచిర్ గార్గ్ అంటున్నారు. ఇది రైతులకు సహకారం అందించే స్టార్టప్.

అసలు ప్రశ్న ఏంటంటే.. భారతీయ స్టార్టప్‌లు అమెరికన్ బ్యాంక్‌లో ఎందుకు ఖాతాలు తెరవాలి?

వాస్తవానికి, భారతదేశంలోని చాలా స్టార్టప్‌లకు దేశం వెలుపల జపాన్, సింగపూర్, అమెరికా వంటి దేశాల నుంచి ఫండింగ్ వస్తుంది. పెట్టుబడిదారు ఖాతా ఎస్వీబీలో ఉంటే స్టార్టప్ ఖాతా కూడా అదే బ్యాంకులో ఉండడం వలన పని సులువు అవుతుందని స్టార్టప్ అధినేతలు చెబుతున్నారు.

"పెద్ద పెద్ద స్టార్టప్‌లు, అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో 50-60 శాతం ఖాతాలు ఈ బ్యాంకులోనే ఉన్నాయి" అని రుచిర్ గార్గ్ వివరించారు.

ఇది కాకుండా, మీ మార్కెట్ అమెరికాలో ఉంటే, అక్కడ లైసెన్స్ తీసుకోవాలి. అక్కడ బ్యాంక్ ఖాతా తెరవాలి.

ఎస్వీబీ ఒక బ్యాంకుగానే కాకుండా వెల్త్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, నెట్‌వర్కర్‌గా కూడా సేవలు అందించిందని నిపుణులు చెబుతున్నారు.

"బ్యాంకింగ్ సేవలతో పాటు ఎస్వీబీ.. స్టార్టప్‌లలో పెట్టుబడి పెడుతుంది. వాటికి రుణాలు ఇస్తుంది" అని రుచి చెప్పారు.

"ఎస్వీబీ.. స్టార్టప్, బిజినెస్ ఫ్రెండ్లీ బ్యాంకు అని" బైట్రిడ్జ్ స్టార్టప్ వ్యవస్థాపకుడు వినాయక్ శర్మ అన్నారు.

భారత్‌లోనే ఉంటూ కేవలం పాస్‌పోర్ట్ ఆధారంగా అక్కడ ఖాతా తెరవచ్చని ఆయన వివరించారు.

ఎస్వీబీ కుప్పకూలిందని సన్నిహితుల ద్వారా తెలిసిందని, ఆ సమయానికి బ్యాంకు ఖాతాలో కంపెనీ సొమ్ము రెండున్నర మిలియన్ డాలర్ల కన్నా తక్కువ ఉందని, అది కూడా బీమా చేసిన డబ్బని ఆయన చెప్పారు.

వినాయక్ శర్మ 2014-15 నుంచి ఎస్వీబీ ఖాతాదారుగా ఉన్నారు.

"మాకు ఎస్వీబీతో మంచి అనుబంధం ఉంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని విషయాల్లో బ్యాంకు మాకు తోడుగా నిలిచింది. ఈ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. కంపెనీ వ్యవస్థాపకులను పరిచయం చేస్తుంది. పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మంచి గైడెన్స్ ఇస్తుంది" అని వినాయక్ చెప్పారు.

ముందున్న మార్గం ఏమిటి?

భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఇక్కడి స్టార్టప్‌లు నమ్మకం ఉంచాలనే విషయాన్ని ఈ సంక్షోభం తెలియజేస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

అయితే, ఇది అంత సులభం కాదని స్టార్టప్‌ వ్యవస్థాపకులు అంటున్నారు. ముఖ్యంగా స్టార్టప్ ఫండింగ్ చేస్తున్న వెంచర్ క్యాపిటల్ కంపెనీలు దేశానికి వెలుపల ఉంటే ఇది మరింత కష్టమవుతుందని అంటున్నారు.

భారతీయ కంపెనీలు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలలో డబ్బును ఉంచడం చాలా ముఖ్యమని ఎవెటార్ వెంచర్స్ వ్యవస్థాపకుడు మోహన్ కుమార్ అభిప్రాయపడ్దారు.

డిపాజిటర్లకు డబ్బు పూర్తిగా వాపసు వస్తుందని ప్రకటించారు కాబట్టి ప్రస్తుతానికి ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టేనని 3one4 క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ పాయ్ అన్నారు. అయితే, ఈ నష్టం నుంచి కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)