మను భాకర్: పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకం జస్ట్ మిస్..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్‌కు మూడో పతకం జస్ట్ మిస్సయ్యింది. శనివారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఆమె 4వ స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా షూటర్ యాంగ్ జీన్ స్వర్ణ పతకం సాధించారు.

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు వేర్వేరు షూటింగ్ ఈవెంట్‌లలో మను భాకర్ ఇప్పటికే రెండు కాంస్య పతకాలను సాధించారు. మూడో పతకం కోసం ఇవాళ పోటీపడ్డారు.

అయితే, ఈ ఈవెంట్‌‌లో పతకం రాకపోయినా కూడా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత ప్లేయర్‌గా, భారత తొలి షూటర్‌గా చరిత్ర సృష్టించారు.

మూడింటిలో రెండు..

పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ మూడు కాంస్య పతకాలుసాధించింది. ఆ మూడూ షూటింగ్‌లో వచ్చినవే.

అందులో ఒకటి మను భాకర్ వ్యక్తిగత విభాగంలో సాధించగా, రెండోది మిక్స్‌డ్ విభాగంలో మను భాకర్-సరబ్‌జ్యోత్‌లతో కూడిన భారత జట్టు, ఇక మూడోది షూటర్ స్వప్నిల్ కుసాలె సాధించారు.

మను భాకర్ స్వస్థలం హరియాణాలోని ఝజ్జర్ జిల్లా గొరియా గ్రామం.

BBC ISWOTY ఎమర్జింగ్ ఉమన్ ప్లేయర్‌ అవార్డు

2021లో మను భాకర్ బీబీసీ ‘ఎమర్జింగ్ ఉమన్ ప్లేయర్‌- 2020’ అవార్డును అందుకున్నారు.

దేశం కోసం మరిన్ని పతకాలు సాధించేందుకు బీబీసీ అవార్డు ప్రేరణ ఇస్తుందని అప్పుడు ఆమె చెప్పారు.

గతంలో ఏం జరిగింది?

టోక్యో ఒలింపిక్స్‌లో మను భాకర్ గన్ మొరాయించి ఆమెకు వేదనను మిగిల్చింది. ఎన్నోఅంచనాలతో టోక్యోకు వెళ్లిన ఆమె, కీలక సమయంలో గన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర నిరాశతో పతకం లేకుండా తిరిగొచ్చారు. ఆ తర్వాత మను ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నారు.

కానీ, పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల మను భాకర్ పిస్టల్ గర్జించింది.

తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను భాకర్ గత ఒలింపిక్స్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలను చెరిపేసుకున్నారు.

మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌కు దూసుకెళ్లి, 20 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఒలింపిక్స్‌ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా షూటర్‌గా ఘనత సాధించారు. అంతేకాదు, వరుసగా రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు.

స్ఫూర్తి నింపిన టాటూ

భారత షూటర్ మను భాకర్ మెడ వెనుక భాగంలో ‘‘స్టిల్ ఐ రైజ్’’ అనే టాటూ ఉంటుంది.

ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా, తనలో తాను స్ఫూర్తిని నింపుకునే ఉద్దేశంతో ఆమె ఈ టాటూను వేయించుకున్నారు.

‘‘స్టిల్ ఐ రైజ్’’ అనే కవితను పౌర హక్కుల కార్యకర్త, అమెరికా కవి మాయా ఆంజెలు రాశారు.

‘‘క్రీడాకారుల జీవితంలో విజయాలు, వైఫల్యాలు ఒక భాగం. కానీ, అపజయాలను ఏ విధంగా తీసుకుంటాం? వైఫల్యాల నుంచి తిరిగి ఎలా పుంజుకుంటామనేది చాలా ముఖ్యం’’ అని మను భాకర్ అన్నారు.

‘‘స్టిల్ ఐ రైజ్ అనేవి కేవలం పదాలు కావు. మీరు వైఫల్యాలను ఎదుర్కొంటున్నప్పటికీ మీ విలువను చాటే నినాదం ఇది. ఈ పదాలే నాకు గొప్ప ప్రేరణ, దృఢ సంకల్పాన్ని అందిస్తాయి. ఎన్నికష్టాలు, ఎలాంటి వైఫల్యాలు ఎదురైనా వాటన్నింటినీ దాటి నేను పైకి లేస్తాననే ఆత్మవిశ్వాసాన్ని నాకు కలిగిస్తాయి’’ అని ఛండీగఢ్‌లో ఆర్యన్ మాన్ ఫౌండేషన్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో మను చెప్పారు.

‘‘టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత రోజులు భారంగా గడిచాయి. అక్కడ జరిగిన దాన్నుంచి బయటపడేందుకు చాలా కష్టపడ్డాను. కానీ, మళ్లీ నేను ఫామ్‌లోకి వస్తానని, తిరిగి పుంజుకుంటాననే సంగతి నాకు తెలుసు. ‘స్టిల్ ఐ రైజ్’’ అనే పదాల్లోని సారాంశాన్ని నా షూటింగ్ కెరీర్‌కు ఆపాదించాను. ఆ పదాలు నాకు గొప్ప ప్రేరణగా నిలిచాయి. అందుకే వాటిని టాటూగా వేసుకున్నా’’ అని మను చెప్పారు.

పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు ఏ దేశానికి ఎన్ని పతకాలు వచ్చాయో ఈ పట్టికలో చూడొచ్చు

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)