You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వరద విలయం నుంచి తేరుకుంటున్న విజయవాడ ఇప్పుడు ఎలా ఉందో చూపే చిత్రాలు..
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పెరుగుతోందని వార్తలు వస్తుండటంతో స్థానికుల్లో మళ్లీ ఆందోళన కనిపిస్తోంది.
ఇవాళ (సెప్టెంబర్ 7) ఉదయం నుంచి మళ్లీ వర్షం పడుతుండటంతో వరద ప్రభావిత కాలనీలలో ఉంటున్నవారు భయపడుతున్నారని అజిత్ సింగ్ నగర్కు చెందిన సునీల్ చెప్పారు.
ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. అజిత్ సింగ్ నగర్లో వరద నీరు ఇంకా కొంత ఉంది. కొన్ని చోట్ల మోకాలు లోతు దాకా నీరుంది. మరికొన్ని చోట్ల తక్కువ ఉంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది.
సింగ్ నగర్లో వరద మొదలైన రోజు భుజాల దాకా మునిగిపోయేంతగా ప్రవహించిన నీరు, ఇప్పుడు బాగా తగ్గింది.
కొన్ని ప్రాంతాల్లో నీరు పూర్తిగా పోయి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని సునీల్ చెప్పారు.
మరోవైపు బుడమేరు డైవర్షన్ ఛానల్కు పడ్డ గండ్లన్నీ పూడ్చివేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
“ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 60 వేల క్యూసెక్యుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు మూడు గండ్లు పడ్డాయి. ఆర్మీ సహకారంతో అత్యంత వేగంగా ఆ గండ్లను పూడ్చివేశాం” అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఇంటి చుట్టూ వరద నీరు ఉండటంతో ఇబ్బందులు పడుతూనే కొందరు వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారు.
ప్రకాశం బరాజ్ 67, 69 పిల్లర్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల స్థానంలో కొత్త వాటిని పెట్టే పనులు జరుగుతున్నాయి.
ఆ తర్వాత బరాజ్ కు కొట్టుకుని వచ్చిన పడవలను తొలగించే పనులు చేపడతామని అధికారులు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)