ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు రోడ్‌ షోలో విషాదం, తొక్కిసలాటలో 8 మంది మృతి

నెల్లూరు జిల్లాలోని కందుకూరులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రోడ్ షోలో విషాదం చోటు చేసుకుంది.

'ఇదేం ఖర్మ' కార్యక్రమంలో భాగంగా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు మాట్లాడుతుండగా జరిగిన తోపులాటలో మురుగు కాల్వలో పడి 8 మందిమృతి చెందారు.

మరి కొందరు తీవ్రంగా గాయపడగా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబునాయుడు తన కార్యక్రామన్ని నిలిపివేసి వెంటనే ఆస్పత్రికి వెళ్ళారు.

గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. బాధితుల గురించి తెలుసుకున్నాకే ప్రసంగం చేస్తానంటూ కార్యక్రమాన్ని నిలిపేసిన బాబు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలతో మాట్లాడారు.

మృతులు వీరే..

బహిరంగ సభ దగ్గర తొక్కిసలాట జరగడంతో 8మంది మృతి చెందారు.

1) కాకుమాని రాజా (50) కందుకూరు పట్టణం

2) ఈదుమూడి రాజేశ్వరి, (40) కందుకూరు పట్టణం

3) యాకసిరి విజయ, వరిగచేను సంఘం, ఉలవపాడు మండలం

4) దేవినేని రవీంద్రబాబు, ఆత్మకూరు గ్రామం, ఉలవపాడు మండలం

5) మర్లపాటి చినమాలకొండయ్య, అమ్మవారిపాలెం గ్రామం, గుడ్లూరు మండలం

6) కలవకూరి యానాది, కొండముడుసు పాలెం గ్రామం, కందుకూరు మండలం

7) ఉచ్చులూరి పురుషోత్తం, గుండ్లపాలెం గ్రామం, గుడ్లూరు మండలం

8) గడ్డం మధు, ఓగూరు గ్రామం, కందుకూరు మండలం

చంద్రబాబు కందుకూరు పర్యటనలో తొక్కిసలాట జరగడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

"మా కుటుంబ సభ్యులైన టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం. వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది" అని లోకేశ్ అన్నారు.

రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన టీడీపీ

కందుకూరు సభకు వేల మంది ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.

తోపులాటలో జరగడంతో ఒక్కసారిగా పెద్ద కాలువలో సుమారు పది మంది కార్యకర్తలు పడి పోయారు.

క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చంద్రబాబు కూడా హాస్పిటల్‌కు వెళ్లారు, అక్కడ పరిస్థితిని ఆయన సమీక్షించారు.

చనిపోయిన కుటుంబాలకు పార్టీ తరుపున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

గాయపడిన వారిని ఆదుకుంటామని, వారి పిల్లలని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్‌లో చదివిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఘటనపై వైసీపీ కూడా సానుభూతి ప్రకటిస్తూ ఒక ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)