జార్జియా: రెస్టారెంట్‌లో కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 12 మంది భారతీయుల మృతి

జార్జియాలో 12 మంది భారతీయులు చనిపోయినట్లు ఆ దేశ రాజధాని తబ్లీసీలోని భారతీయ రాయబార కార్యాలయం తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

జార్జియాలోని గుడోరీలో మరణించినవారిలో భారతీయులు ఉన్నట్లు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తన ప్రకటనలో ధ్రువీకరించింది.

మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపిన అక్కడి భారత రాయబార కార్యాలయం మృతుల వివరాల కోసం స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నట్లు తెలిపింది.

అన్నిరకాల సహాయం అందిస్తామని రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.

జార్జియాలోని ఒక ఇండియన్ స్కీ రిసార్టులో కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 10 మందికి పైగా మృత్యువాత పడినట్లు అక్కడి పోలీసులు పోలీసులు తెలిపారు.

గుడోరీలోని ఒక రెస్టారెంట్‌లోని నిద్రించే ప్రాంతంలో 11 మంది విదేశీయులు, ఒక జార్జియా పౌరుడి మృతదేహాలు లభ్యమయ్యాయని స్థానిక అధికారులు మొదట ప్రకటించారు.

అయితే.. అక్కడి భారతీయ రాయబార కార్యాలయం మాత్రం చనిపోయినవారిలో 12 మంది భారతీయులు ఉన్నారని చెప్తోంది.

గుడోరీ అనేది ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో అత్యంత ఎత్తైన, అతిపెద్ద స్కీ రిసార్టు.

ప్రాథమిక దర్యాప్తులో మృతదేహాలపై హింస తాలూకూ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని, ఇదొక ప్రమాద ఘటనగా అనిపిస్తోందని పోలీసులు వెల్లడించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయిల్‌తో నడిచే జనరేటర్‌ను నడిపినట్లు అధికారులు తెలిపారు.

జనరేటర్ కారణంగా కార్బన్ మోనాక్సైడ్ వ్యాపించినట్లు భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)