50 ఏళ్లకు పైగా ప్రతి రోజూ కొండపైకి వెళ్లిన ఈ 85 ఏళ్ల తాతను చూసి అంతా ఎగతాళి చేశారు.. ప్రభుత్వం సన్మానం చేసింది. ఎందుకంటే..
హరియాణాలోని అతేలీ కలన్ గ్రామానికి చెందిన కల్లూ రామ్ ఆరావళి పర్వతాలపై ఒక కొలను ఎవరి సహాయం లేకుండా ఒక్కడే తవ్వి తయారు చేశారు.
కల్లూ రామ్ కి ఇప్పుడు 85 ఏళ్లు.
గ్రామస్తులు తనను హేళన చేసేవారని, కానీ దాహంతో ఉండే పశువులను చూసి తాను భరించలేకపోయేవాడినని అన్నారు.
ఈయన తన ఖాళీ సమయాల్లో కొండపైకి వెళ్లి ఈ కొలను తవ్వేవారు.

‘‘గ్రామస్తులు మా నాన్న చేసే దాన్ని చూసి హేళన చేశారు. ఊళ్లో తిరిగే పశువులు పంటల్ని నాశనం చేసేవి. దీంతో వాటిని గ్రామస్తులు కొండలవైపు తరిమేవారు. కానీ ఇక్కడ తాగేందుకు నీళ్లు లేక ఆవులు చనిపోయేవి.
ఒకరోజు మా నాన్న ఇక్కడ కొలను తవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి ఆయనకు పద్దెనిమిది ఇరవై ఏళ్లు ఉండేవి. ఈ కొలను 78 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 35 అడుగుల లోతు ఉంటుంది’’ అని కల్లూరామ్ కుమారుడు వేద ప్రకాశ్ బీబీసీతో చెప్పారు.

‘‘కల్లూరామ్ గొప్ప పని చేశాడు. ఇక్కడికి పెద్ద ఎత్తున పక్షులు, జంతువులు నీరు తాగేందుకు వస్తాయి.
అతను సుత్తి సాయంతో ఈ కొలను తవ్వాడు. ప్రజలు ఆయన్ను మొదట్లో ఎందుకిందంతా అనేవారు. అయినా అతను ఆగలేదు. దీన్ని పూర్తి చేయడానికి అతనికి 50 నుంచి 60 ఏళ్లు పట్టింది. అయినా అతను ఎప్పుడూ దీన్ని వదిలిపెట్టలేదు. ఆయన్ను చూసి అంతా నవ్వేవారే తప్ప ఎవరూ సాయం చేయలేదు’’ అని గ్రామస్తులు చెప్పారు.
కల్లూరామ్ని స్వాతంత్ర్య దినోత్సవం నాడు సన్మానించినట్లు ఛార్ఖి దాద్రి డిప్యూటీ కమిషనర్ ప్రితీ బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



