You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ హిందీ
మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆదివారం ఇంఫాల్లోని రాజ్భవన్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.
బీరేన్ సింగ్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పించారని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ దిలీప్ కుమార్ శర్మ ధ్రువీకరించారు.
ఏఎన్ఐ వార్తా సంస్థ కూడా బీరెన్ సింగ్ రాజ్భవన్కు వెళ్లి రాజీనామా సమర్పించినట్టుగా కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది.
బీరేన్ సింగ్ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. న్యూదిల్లీ నుంచి తిరిగి వచ్చిన బీరేన్ సింగ్ సాయంత్రం తన ఎమ్మెల్యేలతో రాజ్భవన్కు చేరుకుని గవర్నర్కు రాజీనామా సమర్పించారు.
ఇప్పటివరకు మణిపూర్ ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి తన రాజీనామా లేఖలో తెలిపారు.
వాస్తవానికి, బీరెన్ సింగ్పై అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు బీరెన్ సింగ్తో పాటు బీజేపీ, ఎన్పీఎఫ్ (నాగా పీపుల్స్ ఫ్రంట్)కు చెందిన మరో 14 మంది ఎమ్మెల్యేలు రాజ్భవన్లో ఉన్నారని అధికారులను ఉటంకిస్తూ వార్తాసంస్థ పీటీఐ పేర్కొంది.
ఎన్ బీరెన్ సింగ్ 2017లో తొలిసారిగా మణిపుర్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతోంది.
అయితే గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింస ఆయన్ను గద్దె దింపినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా.
వాస్తవానికి 2023 మే 3 నుంచి మణిపూర్లో మైతీ, కుకీ తెగల మధ్య ప్రారంభమైన జాతి హింసపై విమర్శలొచ్చాయి.
హింసను అదుపు చేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ప్రతిపక్షం పదే పదే ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
ఒకట్రెండు రోజుల్లో కొత్త ముఖ్యమంత్రిపై నిర్ణయం వెలువడుతుందని సమాచారం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)