కర్నూలు బస్సు ప్రమాద తీవ్రత, 9 ఫోటోలలో..

(ఈ కథనంలోని వివరాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బెంగళూరు మధ్య నడిచే ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

కర్నూలు శివారులో, కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద, నేషనల్ హైవే 44పై ఈ ప్రమాదం జరిగింది.

ఒక బైకు బస్సు కిందకు వెళ్లిపోయి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు.

పలువురు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదంలో పదిమందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బీబీసీకి చెప్పారు.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

గాయాలపాలైన కొందరు ప్రయాణికులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్పగాయాలైన కొందరు ప్రయాణికులు ప్రాథమిక చికిత్స అనంతరం తమ సొంత ప్రాంతాలకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)