ఇరాక్ కోవిడ్ ఆసుపత్రిలో మంటలు.. ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది మృతి

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది ప్రాణాలు కోల్పోయారు.

శనివారం రాత్రి ఖాతిబ్ హాస్పిటల్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మరో 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఆసుపత్రిలోని ఒక ఫ్లోర్‌లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల వల్ల ఆక్సిజన్ ట్యాంక్‌లు పేలడంతో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది.

ప్రజలు ప్రాణభయంతో ఆ ఆసుపత్రి భవనం నుంచి పారిపోతున్న దృశ్యాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఈ ప్రమాదంపై సత్వర విచారణకు ఆ దేశ ప్రధాన మంత్రి ముస్తఫా అల్ ఖదిమీ ఆదేశించారు.

ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో తొలుత మంటలు వ్యాపించాయని ఇరాక్ సివిల్ డిఫెన్స్ హెడ్ జనరల్ కదీమ్ బోహాన్ చెప్పారు.

ఆదివారం ఉదయానికి మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు.

పరిస్థితి అత్యంత విషమంగా మారిన కరోనా రోగులకు చికిత్స చేయడానికి ఉద్దేశించిన ఆ ఐసీయూలో మంటలు వ్యాపించేటప్పటికి 30 మంది రోగులు ఉన్నారని.. వారందరినీ ఇతర ఆసుపత్రులకు తరలించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇరాక్‌లోనూ ఫిబ్రవరి నుంచి కోవిడ్ కేసులుపెరుగుతున్నాయి. అక్కడి మొత్తం కేసుల సంఖ్య ఈ వారం పది లక్షలు దాటింది.

ఇప్పటి వరకు ఆ దేశంలో 10,25,288 మందికి కోవిడ్ సోకగా 15,217 మంది మరణించారు.

గత నెలలో ఇరాక్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఇప్పటివరకు అక్కడ 6,50,000 మందికి వ్యాక్సిన్ వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)