ఆస్ట్రాజెనెకా: మళ్లీ ప్రారంభమైన కరోనావైరస్ వ్యాక్సీన్ ట్రయల్స్‌

ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందిస్తున్న కరోనావైరస్‌ వ్యాక్సీన్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌ మళ్లీ మొదలయ్యాయి.

మెడిసన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ఈ ట్రయల్స్ సురక్షితమేనని తేల్చడంతో పునఃప్రారంభించినట్లు సంస్థ శనివారం వెల్లడించింది.

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి రాగానే భారత్‌లోనూ తాము కూడా వ్యాక్సీన్ ట్రయల్స్ పునఃప్రారంభిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చెప్పింది

నాలుగు రోజుల కిందట ఇండియాలో ఆగిన ప్రయోగాలు

కొద్దిరోజుల కిందట బ్రిటన్‌లో జరుగుతున్న ఈ టీకా ప్రయోగాలలో పాల్గొంటున్న ఒక వలంటీరుకు తీవ్రమైన అస్వస్థత ఏర్పడటంతో పరీక్షలను తాత్కాలికంగా ఆపేశారు.

దాంతో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ భారతదేశంలో నిర్వహిస్తున్న ప్రయోగాత్మక పరీక్షలనూ నిలిపివేసినట్లు నాలుగు రోజుల కిందట సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వెల్లడించింది.

''పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించే వరకూ ఇండియాలోనూ ట్రయల్స్‌ను ఆపివేస్తున్నాం'' అని సీరమ్ గురువారం నాడు ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

ట్రయల్స్ గురించి అంతకుమించి చెప్పలేమని.. మరిన్ని వివరాల కోసం డీసీజీఐని సంప్రదించవచ్చునని పేర్కొంది.

అయితే ఇలాంటి సమస్యలు సాధారణంగా వస్తూనే ఉంటాయని, అలాంటి సందర్భాలలో పరీక్షలు నిలిపేయడం సహజమేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న దాదాపు డజనుకుపైగా వ్యాక్సిన్‌లలో ఆస్ట్రా జెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ అన్నింటిలో ప్రభావవంతమైంది అన్న అంచనాలున్నాయి.

ఇప్పటికే రెండు దశల ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్‌, మిగతావాటికంటే ముందుగా మార్కెట్‌లోకి రావడానికి అవకాశముందని అంతా భావిస్తున్నారు.

యూకే, బ్రెజిల్‌, అమెరికా, దక్షిణాఫ్రికాలలో కలిపి దాదాపు 30,000 మందిపై మూడో దశ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. సాధారణంగా వ్యాక్సిన్‌ల మూడో దశ ట్రయల్స్‌ వేలమందిపై నిర్వహించాల్సి ఉంటుంది. ఇవి పూర్తి కావడానికి ఏళ్లు కూడా పట్టొచ్చు.

భారతదేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా వీటిని కూడా నిలిపివేశారు.

అసలు ఏం జరిగింది?

ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ట్రయల్స్‌ను నిలిపేశారని, భద్రత ప్రమాణాలను స్వతంత్ర సంస్థలు పర్యవేక్షిస్తున్నాయని, పరిస్థితులనుబట్టే ట్రయల్స్‌ ముందుకు సాగుతాయని బీబీసీ మెడికల్ ఎడిటర్‌ ఫెర్గస్‌ వాల్ష్‌ తెలిపారు.

“పెద్ద ఎత్తున జరిగే ట్రయల్స్‌‌లో కొందరికి అనారోగ్యం ఏర్పడటం సహజమే. కానీ ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం’’ అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఇలా నిలిపేయాల్సి రావడం ఇది రెండోసారని బీబీసీ ప్రతినిధి గుర్తు చేశారు. ఎందుకు అనారోగ్యం ఏర్పడిందో వెంటనే చెప్పలేకపోయినా, ఇలాంటి టెస్టుల్లో వాలంటీర్లు అనారోగ్యం పాలుకావడం సహజమేనని చెబుతున్నారు.

మరికొన్ని రోజుల్లో ట్రయల్స్‌ యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు.

వలంటీర్లు తీవ్ర అనారోగ్యం పాలయ్యారన్న విషయాన్ని తొలిసారి బయటపెట్టిన స్టాట్‌న్యూస్‌ అనే హెల్త్‌ వెబ్‌సైట్‌, వారికి కలిగిన అనారోగ్యం వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే వలంటీర్లు త్వరగానే కోలుకుంటారని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నట్లు ఆ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

వ్యాక్సిన్‌ తయారీ ఎంత వరకు వచ్చింది?

అమెరికా ఎన్నికల తేదీ నవంబర్ 3 కంటే ముందుగానే వ్యాక్సిన్‌ వస్తుందని తాను భావిస్తున్నానని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

అయితే ఆయన ప్రకటన, వ్యాక్సిన్‌ రేసులో రాజకీయాల కారణంగా ప్రజల భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.

వ్యాక్సిన్‌ తయారీ విషయంలో అన్నిరకాల నైతిక, శాస్త్రీయ ప్రమాణాలను పాటిస్తామని టీకాలను తయారు చేస్తున్న 9 కంపెనీలు మంగళవారం ప్రతిజ్జ చేశాయి.

ఈ ప్రతిజ్జ చేసిన తొమ్మిది కంపెనీలలో ఆస్ట్రాజెనెకా కూడా ఉంది. మూడు దశల ట్రయల్స్‌ పూర్తయ్యాక అనుమతి కోసం రెగ్యులేటరీ అథారిటీకి పంపిస్తామని ఈ ప్రతిజ్ఞలో కంపెనీలు పేర్కొన్నాయి.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, బయోఎన్‌-టెక్‌, గ్లాక్సో స్మిత్‌క్లైన్‌, ఫైజర్‌, మెర్క్‌, మోడెర్నా, సనోఫీ, నోవావ్యాక్స్‌ ఈ ప్రతిజ్జ చేసిన మిగిలిన కంపెనీలు.

ట్రయల్స్‌లో పాల్గొంటున్నవారి ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఈ కంపెనీలు స్పష్టం చేశాయి.

ఇప్పటి వరకు 180మంది టెస్టింగ్‌ వాలంటీర్లను పరిశీలించామని, వారిలో ఇంకా ఎవరిపైనా క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

ఈ ఏడాదిలో ఈ వ్యాక్సిన్‌లన్నీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ట్రయల్స్‌ పూర్తి చేస్తాయని తాము భావించడంలేదని WHO అన్నది. ఇవన్నీ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందని అది పేర్కొంది.

దాదాపు ఇదే అభిప్రాయాన్ని థామస్‌ క్యూనీ వ్యక్తం చేశారు. ఆయన ఇంటర్నేషనల్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ డైరక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భద్రతాప్రమాణాల ప్రతిజ్జ పై సంతకం చేఏసి తొమ్మిది కంపెనీలకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది.

కాగా, చైనా, రష్యాలు దేశీయంగా సిద్ధం చేసిన టీకాలను తమ దేశంలో ఎంపిక చేసిన కొందరు వలంటీర్లకు, వ్యక్తులకు ఇవ్వడం ప్రారంభించాయి. ఇవన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌గానే WHO దగ్గర నమోదయ్యాయి.

అయితే మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ పూర్తికాక ముందే వ్యాక్సిన్‌కు ఆమోదం లభించవచ్చని అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) వ్యాఖ్యానించింది.

ఎన్నికకు రెండు రోజులు ముందే అంటే నవంబర్‌ 1 నాటికి వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని గత వారం అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ రాష్ట్రాలకు సమాచారం పంపింది.

ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ వస్తుందని ఒకపక్క అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతుండగా, ఆయన ప్రత్యర్ధి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్‌ మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు.

శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను వినాలని, వ్యాక్సిన్‌ తయారీలో పారదర్శకత ఉండేలా చూడాలని బైడెన్‌ ట్రంప్‌కు సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)