భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా మీడియా ఆరోపణలు ఏంటి?

    • రచయిత, బీబీసీ మానిటరింగ్‌
    • హోదా, .

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయంటూ చైనా మీడియాలో విస్తృతమైన కథనాలు వెలువడుతున్నాయి. లద్దాక్‌లోని గాల్వాన్‌ లోయ ప్రాంతంలో భారత్‌ తన సరిహద్దుల వెంబడి నిబంధనలకు విరుద్ధంగా అనేక సైనిక పోస్టులను ఏర్పాటు చేస్తోందని అవి ఆరోపిస్తున్నాయి.

ఏకపక్ష నిర్ణయాలతో పరిస్థితులను చేయిదాటకుండా సంయమనం పాటించాలంటూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావ్‌ లిజియన్‌ భారత్‌కు విజ్జప్తి చేయడంతో ఇది మరింత వేడెక్కింది.

ఇరుదేశాలు రాయబార మార్గాల ద్వారా చర్చలు జరపుతున్నాయంటూ లిజియన్‌ మే 21న ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నట్లు ప్రభుత్వ మీడియా పీపుల్స్‌ డైలీ వెల్లడించింది.

ఒకపక్క భారత్‌ నేపాల్‌ల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగానే, భారత్‌ చైనాల మధ్య వివాదం మొదలైంది. అయితే ఇది సమస్యను పక్కదోవ పట్టించడానికి, కీలకమైన అంశాల నుంచి పక్కకు తప్పించడానికి వేస్తున్న ఎత్తుగడగా భారత్‌లోని కొన్ని మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఇది భారత్‌ వ్యూహాత్మక ఎత్తుగడ: చైనా మీడియా

''రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఏదో యాదృచ్ఛికంగా జరిగగింది కాదు, ఒక వ్యూహాత్మక ఎత్తుగడ'' అని చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ పత్రిక అభివర్ణించింది.

''చైనా సైనికులను భారత సైనికులు ఉద్దేశపూర్వకంగా కవ్విస్తున్నారు'' అని ఆ పత్రిక రాసింది. భారత్‌ ఈ విధానాలను ఆపకపోత రెండు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

ఒకపక్క చైనా ఆర్ధికరంగం వెనకబడటం, కరోనా విషయంలో చైనాను ఏకాకిని చేసే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో సరిహద్దు వివాదాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది'' అని చైనా ప్రభుత్వ అనుకూల పత్రిక 'ది డైలీ' రాసింది.

ఇది చైనా సామ్రాజ్యవాదం: భారత మీడియా

ఇటు భారతీయ మీడియా ఇరుదేశాల సరిహద్దు వివాదంపై విస్తృతమైన కవరేజ్‌ ఇచ్చింది. సరిహద్దుల్లో చైనా ఒత్తిళ్లకు భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గ వద్దన్న అభిప్రాయాన్ని వివిధ పత్రికలు రాశాయి.

సరిహద్దుల్లోని ఒక వివాదాస్పద ప్రాంతం విషయంలో మొదలైన ఘర్షణలో ఇరుదేశాల సైనికులు గాయపడటం, వైద్యం కోసం వారిని అక్కడి నుంచి తరలించాల్సింనంత పరిస్థితి ఏర్పడటంతో సరిహద్దు వివాదంపై చర్చ మొదలైంది.

''సరిహద్దుల్లో చైనా దుందుడుకు పోకడలు భారత్‌పై ఒత్తిడి తీసుకురావడం కోసం వేస్తున్న ఎత్తుగడ'' అని హిందీ దినపత్రిక జాగరణ్‌ రాసింది.

కరోనావ్యాప్తి విషయంలో తనకు ఎదురవుతున్న సవాళ్లు, ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వస్తున్న ప్రశ్నల నుంచి భారత్‌ను దూరంగా పెట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నంగా జాగరణ్‌ ఈ వ్యవహారాన్ని అభివర్ణించింది.

''రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఇవాళ కొత్తది కాదు. చైనా తన సామ్రాజ్యవాద విధానాలను ఎప్పుడూ దాచుకోదు. ఇండియాపై పట్టు సాధించేందుకు దాని సరిహద్దుల్లో ఉన్న దేశాలను ఉసిగొల్పుతుంది'' అని మరో హిందీ డైలీ 'జన్‌సత్తా' వ్యాఖ్యానించింది.

''చైనా ఒత్తిడిని భారత్‌ సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది'' అని 25వ తేదీన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ''ది టైమ్స్‌ ఆఫ్ ఇండియా'' రాసింది. ''చైనా ఆధిపత్యం ఉన్న ఆసియా విధానాలు పెనుముప్పులాంటివి. అందుకే తైవాన్‌ సహా తనతో భావసారూప్యం ఉన్న దేశాలతో కలిసి భారత్‌ బహుళపక్ష విధానాల కోసం పని చేయాలి'' అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

''కోవిడ్‌ సమస్య నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో వివాదాలను కొనసాగించకుండా చైనా తన తాజా వైఖరిని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అని ఆంగ్ల దినపత్రిక ''ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'' రాసింది. ''కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ తరహాలో ఆలోచించడం అత్యంత ముఖ్యం '' అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)