కరోనావైరస్‌ సమయంలో తట్టు కూడా ప్రబలే ప్రమాదముందా?

మీజిల్స్

ఫొటో సోర్స్, Science Photo Library

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో తట్టు వ్యాధికి వేసే టీకాలు తగిన సమయంలో వేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో తట్టు వ్యాధి ప్రబలే ప్రమాదం ఉంది.

37 దేశాలలో సుమారు 11 .7 కోట్ల మంది పిల్లలకి తగిన సమయానికి టీకా లభించకపోవచ్చని యూనిసెఫ్ తెలిపింది.

మీజిల్స్, మమ్స్, రుబెల్లా (ఎంఎంఆర్) టీకా సరిగ్గా తీసుకోని యూరోపియన్ దేశాలలో తట్టు వ్యాధి విపరీతంగా ప్రబలింది.

దేశంలో పెరుగుతున్న తట్టు కేసుల కారణంగా తట్టు వ్యాధి రహిత దేశంగా బ్రిటన్ తన స్థానాన్ని కోల్పోయింది.

తట్టు వలన వచ్చే దగ్గు, దద్దుర్లు, జ్వరాన్ని రెండు మోతాదుల ఎంఎంఆర్ టీకాతో నివారించవచ్చు. ఇది బ్రిటన్‌లో పిల్లలందరికీ ఉచితంగా వేస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యానికి అనుగుణంగా బ్రిటన్‌లో 95 శాతం మంది పిల్లలకు మొదటి మోతాదు టీకా మందు వేశారు. అయితే 87.4 శాతం మందికి మాత్రమే రెండో మోతాదు లభించింది.

తట్టు వ్యాధికి వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో టీకా మందు మోతాదులో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభావం చూపిస్తుంది.

మీజిల్స్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వ్యాక్సీన్‌తో మీజిల్స్‌ను సులభంగా అరికట్టవచ్చు.

తట్టు వ్యాధి వ్యాప్తి చెందని దేశాలు తాత్కాలికంగా ఈ టీకా వేయడం వాయిదా వేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇప్పటికే అనేక దేశాలు కరోనావైరస్ మహమ్మారి వలన టీకా వేయడం వాయిదా వేశాయి.

వీటిలో బంగ్లాదేశ్, బ్రెజిల్, బొలీవియా, కంబోడియా, చాడ్, చిలీ, కొలంబియా, డిజిబౌటీ, డొమినికన్ రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, హోండూరస్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, లెబనాన్, మాల్దీవులు, మెక్సికో, నేపాల్, నైజీరియా, పరాగ్వే, సోమాలియా, దక్షిణ సుడాన్, యుక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి.

మరిన్ని దేశాలు ఈ సమస్య ఎదుర్కొనే అవకాశం ఉందని యూనిసెఫ్ చెబుతోంది.

"కరోనావైరస్ కారణంగా టీకాలు అందించడం ఆలస్యం అయితే, ప్రభుత్వాలు టీకాలు అందని పిల్లలని గుర్తించాలి. సులభంగా ఈ సమస్య బారిన పడేందుకు అవకాశం ఉన్నవారికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టీకాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. ఇదొక్కటే మన ముందున్న మార్గం" అని యూనిసెఫ్ చెప్పింది.

టీకాలు వేయడంలో అవాంతరాలు కొనసాగితే పిల్లలు మరిన్ని ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని యూనిసెఫ్ ప్రతినిధి జోవన రీ అన్నారు. ఇలా జరిగితే ఇప్పటికే ఆరోగ్య సేవల మీద ఉన్న ఒత్తిడి మరింత పెరుగుతుంది, మరోసారి మహమ్మారులు ప్రబలే పరిస్థితికి ఇది దారి తీయవచ్చని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)