1930 తర్వాత ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన ఆర్థిక మాంద్యం ఇదే: ఐఎంఎఫ్

కరోనావైరస్ మహమ్మారి ఈ ఏడాది ప్రపంచాన్ని తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి నెట్టేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ హెచ్చరించింది.

1930లో సంభవించిన మహా మాంద్యం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత గడ్డు పరిస్థితులు ఇవేనని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టియానా జార్జివా అన్నారు.

2021 నాటికి పాక్షికంగా కోలుకునే అవకాశాలున్నాయని ఆమె తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు విధించిన లాక్ డౌన్ వల్ల అనేక సంస్థలు మూతపడుతున్నాయని , ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

బ్రిటన్లో ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన ఓ పరిశోధన ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్ల మంది ఉపాధి అవకాశాలపై కోవిడ్-19 సంక్షోభం పూర్తిగా లేదా పాక్షికంగా ప్రభావం చూపించనున్నట్లు తెేలింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మార్కెట్లకు ఇది శరఘాతంగా మారిందని, లక్షల కోట్ల డాలర్ల విదేశీ సాయం అవసరం ఉంటుందని క్రిస్టియానా అభిప్రాయ పడ్డారు.

“2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మా సభ్య దేశాల్లోని సుమారు 160 దేశాల తలసరి ఆదాయంలో పెరుగుదల ఉంటుందని అంచనా వేసి కేవలం 3 నెలలే అయ్యింది.. కానీ ఇవాళ పరిస్థితి పూర్తిగా తారుమారయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే దాదాపు 170 దేశాల తలసరి ఆదాయంలో కోత పడనుంది. మహా మాంద్యం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత గడ్డు పరిస్థితులు ఇవే.” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి పరిస్థితి కుదుట పడితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాక్షికంగా కోలుకునే అవకాశాలున్నాయన్న ఆమె అలాగని అంతా అనుకున్నట్టే జరుగుతుందని అనుకోవాల్సిన పరిస్థితులు లేవని హెచ్చరించారు.

“ప్రపంచ మార్కెట్లలో తీవ్రమైన అనిశ్చితి నెలకొని ఉంది. వివిధ కారణాల వల్ల మున్ముందు పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం కూడా లేకపోలేదు.“ అని క్రిస్టియానా అన్నారు.

అదే సమయంలో అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మూడోవారం నాటికి ఏకంగా 66 లక్షలకు చేరుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు కోటి 60లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

పేదరికంలోకి సగం మంది జనాభా!

కోవిడ్-19 సృష్టించిన ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది ప్రజల్ని బలవంతంగా పేదరికంలోకి నెట్టేస్తుందని బ్రిటన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫాం అంచనావేస్తోంది.

ఈ మహమ్మారి ప్రభావం పూర్తయ్యేనాటికి ప్రపంచంలో సగం మంది జనాభా పేదరికంలోనే నివసించాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చని ఆ సంస్థ చెప్పుకొచ్చింది.

రెండో ప్రపంచం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభం ఇదేనంటూ ఈ వారం మొదట్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరించింది.

ప్రపంచ మార్కెట్లు కోలుకునేందుకు కొన్నేళ్లు పట్టవచ్చంటూ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) గత నెలలోనే హెచ్చరికలు జారీ చేసింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)