You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా వైరస్: ముగిసిన 13 రోజుల నిరీక్షణ.. డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి తమ పౌరుల్ని స్వదేశానికి తరలించిన అమెరికా
జపాన్లో చిక్కుకుపోయిన భారీ నౌక డైమండ్ ప్రిన్సెస్ నుంచి కరోనావైరస్ సోకిన తమ దేశస్థుల్ని రెండు విమానాల్లో తీసుకెళ్లింది అమెరికా. ఇవి సోమవారం తెల్లవారుజామున టోక్యో విమానాశ్రయం నుంచి బయల్దేరినట్టు జపాన్కి చెందిన క్యోడో న్యూస్ వెల్లడించింది. నౌకలో సుమారు 400 మంది అమెరికన్లు చిక్కుకుపోయారు.
చైనాలో కరోనావైరస్ బయటపడటంతో నౌకను ఫిబ్రవరి 3 నుంచి జపాన్ తీరంలోనే నిలిపేశారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన సుమారు 40 మంది అమెరికన్లకు వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. నౌకలో సిబ్బందితో సహా సుమారు 3700 మంది ప్రయాణికులున్నారు.
70 నుంచి 355కి పెరిగిన బాధితుల సంఖ్య
హాంకాంగ్లో దిగిన ఓ వ్యక్తికి వైరస్ ఉన్నట్టు గుర్తించడంతో నౌకను నిలిపేశారు. చైనా బయట అత్యధిక కరోనావైరస్ కేసులు బయట పడ్డది ఈ నౌకలోనే. ఆదివారం నాటికి కరోనావైరస్ బాధితుల సంఖ్య 70 నుంచి 355కి పెరిగిందని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.
వైరస్ బారిన పడిన అమెరికన్లకు జపాన్ ప్రభుత్వమే చికిత్స అందిస్తున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ డిసీజెస్ డైరక్టర్ డాక్టర్ ఆంథోని ఫౌచీ సీబీఎస్ న్యూస్కి చెందిన 'ఫేస్ ది నేషన్' కార్యక్రమంలో చెప్పారు.
అయితే టోక్యోలోని ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి బయల్దేరిన రెండు విమానాల్లో ఎంత మంది అమెరికన్లు వెళ్లారన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఒకవేళ ప్రయాణ సమయంలో కొత్తగా ఎవరికైనా వైరస్ సోకినట్లు గుర్తిస్తే వారిని విమానాల్లోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశాల్లో ఉంచుతారని డాక్టర్ ఫౌచి అన్నారు.
అమెరికా చేరుకున్న అనంతరం వారిని 14 రోజుల పాటు ప్రత్యేక పరిశీలనలో ఉంచుతారు. అయితే ఇప్పటికే చాలా మంది ఇచ్చిన గడువులో అధిక సమయాన్ని నౌకలోనే గడిపేశారు. నిజానికి ఇలా ఉంచడానికి ప్రధాన కారణం కరోనావైరస్కి హాట్ స్పాట్గా మారిన ఆ నౌక నుంచి రావడమేనని డాక్టర్ ఫౌచి చెప్పుకొచ్చారు.
స్వదేశానికి వెళ్లేందుకు నిరాకరించిన కొంత మంది అమెరికన్లు
మరోవైపు నౌకలో ఉన్న కొంత మంది ఆరోగ్యంగా ఉన్న అమెరికన్లు వైరస్ సోకిన వారితో కలిసి విమానాల్లో బయల్దేరేందుకు నిరాకరించారు.
వైరస్ సోకిన వారితో కలిసి బస్సులో ప్రయాణించడం వల్ల ఆ వ్యాధి తమకు సంక్రమించే ప్రమాదం ఉన్నందునే ప్రయాణించేందుకు నిరాకరించానని ప్రయాణికుల్లో ఒకరైన న్యాయవాది స్మిత్ అన్నారు. ప్రత్యేక పరిశీలనలో ఉండాల్సిన 14 రోజుల గడువు ఈ నెల 19 నాటికి ముగిసిపోతుండటం కూడా మరో కారణం.
నౌకలో చిక్కుకున్న వారికి ఐఫోన్లు
ఇజ్రాయెల్, హాంకాంగ్, కెనడా దేశాలు కూడా నౌకలో చిక్కుకున్న తమ దేశస్థుల్ని తమ తమ స్వదేశాలకు తరలిస్తున్నాయి. ఈ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం జపాన్ ప్రభుత్వం నౌకలో ఒక్కో క్యాబిన్కి ఒక్కొక్కటి చొప్పున 2వేల ఐఫోన్లను అందించింది.
దానిలో ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఓ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేశారు. నౌకలో ఉన్న రోగుల పరిస్థితిపై అవగాహన కల్గిన వైద్యులు, ఫార్మసిస్టులు, మానసిక నిపుణుల వివరాలు ఆ యాప్లో ఉంటాయి. అవసరం వచ్చిన వెంటనే వారిని సంప్రదించవచ్చు. అయితే జపాన్ బయట రిజిస్టర్ అయిన ఫోన్లలో మాత్రం ఈ అప్లికేషన్ పని చేయదు.
ఇవి కూడా చదవండి
- "ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి
- జామియా హింసపై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజీ
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- హిమాలయాలపై భారీగా చెత్త, శవాలు... శుభ్రత బాధ్యతను ఆర్మీకి ఇవ్వడంపై అభ్యంతరాలు
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- కరోనావైరస్: వుహాన్ వాసులకు భోజనం ఎలా అందుతోంది
- కరోనావైరస్ పశ్చిమ బెంగాల్లోని ఈ పల్లెపై ఎలాంటి ప్రభావం చూపించింది
- కరోనావైరస్ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)