You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ఒక వైపు వైరస్, మరో వైపు భూకంపం... పెళ్లిళ్లకూ నో పర్మిషన్
సార్స్(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వ్యాధి ఉద్ధృతంగా ఉన్న 2003లో చైనాలో బస్సులు, రైళ్లలో అంటువ్యాధి నివారణ మందులను పిచికారీ చేసేవారు.
సార్స్ వైరస్ను ఎదుర్కోవడంతో పాటు అప్పటికి కొత్త వ్యాధయిన దీన్ని నివారించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ప్రజలకు చెప్పడమూ వారి లక్ష్యం.
బస్సులు, రైళ్లలో ప్రయాణికులు కూర్చోవడానికి వెళ్లేటప్పటికి సీట్లు శుభ్రం చేసి ఉండేవి.. బండి దిగగానే వారిపై బ్లీచింగ్ చల్లడంతో ప్యాంట్లకు బ్లీచింగ్ అంటుకుండేది.
పదిహేడేళ్ల తరువాత ఇప్పుడు మరోసారి చైనా ఇప్పుడు అలాంటి భయానక వైరస్ బారిపడింది. ఇప్పుడు కరోనా వైరస్ చైనానే కాదు ప్రపంచాన్నీ భయపెడుతోంది.
ఇప్పుడు పరిస్థితులు అప్పటి కంటే భిన్నంగా ఉన్నాయి. 1.1 కోట్ల జనాభా ఉన్న వుహాన్ నగరాన్ని అధికారులు దాదాపుగా స్తంభింపజేశారు.
అక్కడి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని సూచించడంతో వారంతా ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంపైనే ఆలోచనలు చేస్తున్నారు.
రక్షణ ఎలా
మాస్కులకు చైనాలో ఎప్పుడూ డిమాండే. కాలుష్యం నుంచి రక్షణ, రద్దీ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు క్రిముల నుంచి రక్షణ కల్పించడంతో పాటు మేకప్ చెక్కుచెదరకుండా కూడా మాస్కులు వాడుతుంటారు.
అలాంటిది ఇప్పుడు కరోనా వైరస్ ప్రబలిందన్న మాట వినగానే చైనాయే కాదు చుట్టుపక్కల దేశాల్లోనూ మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడింది.
కరోనా వైరస్ మొదట ప్రబలిన వుహాన్ నగరం నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న జియామెన్ నగరంలో మాస్కుల కొరత తీవ్రంగా ఉంది.. అది ఏ స్థాయిలో ఉందంటే అక్కడ మాస్కుల కోసం జనాలు బారులు తీరుతుండడంతో అధికారులు ఆ పరిస్థితి నివారించడానికి ఆన్లైన్లో లాటరీ తీసి మాస్కులు కేటాయిస్తున్నారు.
''ఒక మాస్కు కోసం లాటరీ ఆడుతానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇల్లో, కారో, క్రీడా పోటీలు చూడ్డానికి టిక్కెట్ల కోసమో కాదు.. ఫేస్ మాస్క్ కోసం లాటరీలో పాల్గొన్నాను'' అని చైనావాసి ఒకరు అక్కడి సోషల్ మీడియా వీబోలో రాసుకొచ్చారు.
మాస్కులు ధరిస్తే సరిపోతుందా?
మాస్కులు హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నప్పటికీ కరోనా వైరస్ రాకుండా అడ్డుకోవడంలో అవి ఎంతవరకు పనిచేస్తాయన్న విషయం మాత్రం ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
అయితే.. మాస్కులు ధరించడం ఒక్కటే చాలదు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అంతకంటే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
కుటుంబానికి ఒక్కరే..
వ్యాధి ప్రబలిన వుహాన్ నగరంలో ప్రజలందరినీ ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. నిత్యవసరాల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతి ఉంది. అలా బయటకు వచ్చే కుటుంబ సభ్యుడి వివరాలు కూడా అధికారులు నమోదు చేసుకుంటారు.
ఇలా బయటకు వచ్చే మనుషులు కూడా ఎక్కువ మంది ఒకరికొకరు ఎదురుకాకుండా వస్తువల పికప్, డ్రాపింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
'పెళ్లి చేసుకోవద్దు.. చేసుకున్నా రిజిస్టర్ చేయబోం'
కరోనా వైరస్ ప్రభావం చైనా ప్రజల జీవితాలపై తీవ్రంగా ఉంది. ఫిబ్రవరి 2 మంచి రోజుగా భావిస్తూ చాలా చైనా జంటలు ఆ తేదీన వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాయి.
కానీ, ప్రజలు ఎక్కడా గుమిగూడకుండా చూసే ఉద్దేశంతో అధికారులు ఇవన్నీ వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జరిగే ఏ పెళ్లినీ రిజిస్టర్ చేయబోమని ప్రకటించారు.
ముందు నుయ్యి వెనుక గొయ్యి
మరోవైపు ఫిబ్రవరి 2నే వుహాన్ నగరానికి 1000 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ రాష్ట్రంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది.
సాధారణంగా భూకంపం వస్తే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ, ఆ రోజు సిచువాన్ ప్రజల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది.
ఇళ్లలో ఉంటే భూకంపం వల్ల భవనాలు కూలి వాటికిందే సమాధైపోతామన్న భయం.. అలా అని బయటకు వస్తే కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటామన్న భయం ప్రజలను వెంటాడింది.
అయితే, భూకంపం వచ్చినా ప్రజలు ఇళ్లలోనే ఉన్నప్పటికీ ఎక్కడా ప్రాణ నష్టం సంభవించలేదు.
ఆన్లైన్ తరగతుల్లో పాఠాలు వింటున్నారు
మరోవైపు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడడంతో విద్యా వ్యవస్థపైనా ప్రభావం పడింది. అయితే, చాలామంది ఆన్ లైన్ తరగతుల్లో పాఠాలు వింటున్నారు. ఫిబ్రవరి 1 వరకు ఉన్న లెక్కల ప్రకారం 1.2 కోట్ల మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుంచి ఆన్లైన్లో పాఠాలు వింటూ చదువుపై కరోనా వైరస్ ప్రభావం పడకుండా చూసుకుంటున్నారని అక్కడి వార్తాపత్రిక 'గ్లోబల్ టైమ్స్' తెలిపింది.
సార్స్ కంటే తక్కువ మరణాలు: శాస్త్రవేత్తలు
కాగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉన్నప్పటికీ సార్స్తో పోల్చితే మరణాలు తక్కువగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పరిశోధకులు కరోనా నిరోధానికి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నిస్తుండగా చైనాలో గృహనిర్బంధంలోనే ఉంటున్న ప్రజలు మాత్రం దీనిబారి నుంచి తప్పించుకోవడానికి తోచిన చిట్కాలు అనుసరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతోందా... ఆ సంస్థ ప్రతినిధి బీబీసీతో ఏమన్నారు?
- దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: కేజ్రీవాల్ భవిష్యత్తు బడి పిల్లల చేతిలో ఉందా...
- పోలవరం ముందుకు వెళ్తోందా, లేదా? అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?
- డోనల్డ్ ట్రంప్: అధ్యక్షుడిపై అభిశంసన ఆరోపణలను తోసిపుచ్చిన సెనేట్
- కరోనావైరస్ లక్షణాలను మొదట ఈ వైద్యుడు గుర్తించారు.. అసత్య ప్రచారం ఆపాలంటూ పోలీసులు బెదిరించారు
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)