You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
ఇటలీలోని ఫ్లోరెన్స్కు చెందిన కళాకారుడు చీమాబూయ్ గీసిన అత్యంత పురాతన కళాఖండం.. ఫ్రాన్స్లో ఓ వృద్ధురాలి ఇంటిలో గోడకు వేలాడుతూ కనిపించిందని నిపుణులు చెబుతున్నారు
13వ శతాబ్దంలో క్రైస్ట్ మాక్డ్ పేరుతో వరుస పెయింటింగ్లను చీమాబూయ్ గీశారు. ఫ్రాన్స్ నగరం కాంపియేన్లో తాజాగా బయటపడిన కళాఖండం వీటిలో ఒకటి.
వచ్చే నెలలో నిర్వహించబోతున్న వేలంలో ఇది రూ. 46.39 కోట్లు ( సుమారు ఆరు మిలియన్ల యూరోలు) పలుకుతుందని అంచనా.
దీని మూలాలను ధ్రువీకరించడంలో ఎలాంటి వివాదమూ లేదని నిపుణులు తెలిపారు.
ఈ కళాఖండానికి ఇన్ఫ్రారెడ్ కాంతితో పరీక్షలు నిర్వహించారు. చీమాబూయ్ గీసిన ఇతర కళాఖండాలతో దీన్ని పోల్చిచూశారు. చీమాబుయ్నే.. చెనీ డీ పెపో అని కూడా పిలుస్తుంటారు.
''వీటన్నింటినీ గీసిన చేయి ఒక్కటే'' అని కళాఖండాల నిపుణుడు ఎరిక్ టర్కిన్ చెప్పినట్లు ఫ్రాన్స్ పత్రిక లె ఫిగారో తెలిపింది.
చివరగా క్రీస్తు జెరూసలేంలో అడుగుపెట్టినప్పటి నుంచి శిలువ వేసేవరకు మధ్య జరిగిన పరిణామాలను వివరించే పెయింటింగ్ల సిరీస్లో ఇదీ కూడా ఒకటని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని 1280ల్లో గీసినట్లు వారు అంచనా వేస్తున్నారు.
చీమాబూయ్పై బైజాంటైన్ పెయింటింగ్ శైలి ప్రభావం కనిపిస్తుంది. బైజాంటైన్లో పాప్లర్ చెక్కలపై గోల్డ్ పెయింట్ బ్యాగ్రౌండ్తో పెయింటింగ్ వేస్తుంటారు.
తాజా పెయింటింగ్ మూలాలను గుర్తుపట్టేందుకు ఉపయోగపడిన కీలక ఆధారాల్లో ఈ ప్యానెల్ కూడా ఒకటని ద ఆర్ట్ పత్రికకు టర్కిన్ తెలిపారు.
''ప్యానెల్పై పురుగులు చేసిన చిన్న సొరంగాలు కనిపిస్తున్నాయి'' అని పెయింటింగ్ చెక్క ప్యానెల్పై పురుగులు చేసిన రంధ్రాల గురించి ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. చీమాబూయ్ ఇతర కళాఖండాలపైనా ఇలాంటి ఆనవాళ్లే కనిపించాయని చెప్పారు. ''ఇది అలాంటి పాప్లర్ చెక్కతో తయారుచేసిన ప్యానెలే''అని ఆయన వివరించారు.
వంటగదిలోని పొయ్యికి దగ్గర్లోని గోడపై వృద్ధురాలు దీన్ని వేలాడదీశారు. దీన్ని అక్టోబరు 27న వేలం వేయనున్నారు.
చీమాబూయ్ పెయింటింగ్ సిరీస్లో దీనికి సంబంధించిన మరో రెండు పెయింటింగ్ను లండన్ నేషనల్ గ్యాలరీ, న్యూయార్క్లోని ఫ్రిక్ కలెక్షన్లలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి
- సంప్రదాయాన్ని ఎదిరించి వరుడి ఇంటికే వెళ్లి పెళ్లి చేసుకున్న వధువు
- హాంగోవర్ కూడా ఒక జబ్బే: జర్మనీ కోర్టు తీర్పు
- సౌర విద్యుత్ చరిత్ర: 3000 ఏళ్ల క్రితమే చైనాలో సౌరశక్తి వినియోగం
- భారతదేశంలో నమోదైన మాతృ భాషలు 19,569 - హిందీ కింద వర్గీకరించిన మాతృభాషలు ఎన్ని?
- గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)