పక్షులు ఢీకొని ఎగిరిన కాసేపటికే మొక్కజొన్న పొలంలో దిగిన విమానం

ఫొటో సోర్స్, Reuters
రష్యాకు చెందిన ప్రయాణికుల విమానాన్ని పక్షుల గుంపు ఢీకొనడంతో మాస్కో సమీపంలోని మొక్కజొన్న పొలంల్లో అత్యవసరంగా దిగింది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి.
క్రీమియాలోని సింఫరోపోల్కు వెళ్తున్న ది యూరల్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ 321 విమానాన్ని టేకాఫ్ అయిన కాసేపటికే సముద్ర పక్షులు ఢీకొనడంతో విమానం ఇంజిన్లు పాడయ్యాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని కిందికి దించాల్సి వచ్చింది.
విమానం సురక్షితంగా కిందికి దిగడం నిజంగా ఓ అద్భుతం అని స్థానిక మీడియా వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, EPA
విమానం తీవ్రంగా పాడైందని, అది ఇక ప్రయాణానికి పనికిరాదని ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 233మంది ఉన్నారు. ఉన్నట్లుండి పక్షుల గుంపు ఇంజిన్ల చిక్కుకుని, అడ్డుపడటంతో మరో మార్గం లేని సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేశారు.

ఫొటో సోర్స్, EPA
టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం ఉన్నట్లుండి తీవ్రంగా ఊగడం ప్రారంభమైందని పేరు వెల్లడించని ఓ ప్రయాణికుడు స్థానికి టీవీతో చెప్పారు.
"ఐదు సెకన్ల తరువాత కుడివైపు ఉన్న లైట్లు ఫ్లాష్ అవ్వడం ప్రారంభమైంది. ఏదో కాలుతున్న వాసన మొదలైంది. అంతలోనే కిందికి దిగాం. అందరూ భయంతో బయటకు పరుగులు తీశారు" అని అతడు తెలిపాడు.
జుకోవ్స్కీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేకు కిలోమీటర్ దూరంలో ఉన్న మొక్క జొన్న తోటల్లో విమానం ల్యాండ్ అయిందని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ రోసావియాట్సియా వెల్లడించింది. ఇంజిన్లు ఆగిపోయాయి, ల్యాండింగ్ గేర్ వెనక్కి వచ్చేసిందని రోసావియాట్సియా తెలిపింది.

ప్రయాణికులందరినీ విమానం నుంచి బయటకు పంపించారు, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మిగిలినవారిని విమానాశ్రయానికి తీసుకెళ్లారు.
గాయపడినవారిలో ఐదుగురు పిల్లలున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. వారంతా కోలుకుంటున్నారని వెల్లడించింది.
వైద్య పరీక్షల అనంతరం తమ ప్రయాణాన్ని కొనసాగించాలనుకునేవారికి ఇతర విమానాల్లో ఏర్పాట్లు చేస్తామని యూరల్ ఎయిర్లైన్స్ డైరెక్టర్ జనరల్ కిరిల్ స్కురటోవ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
2009లో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే హడ్సన్ నదిలో ల్యాండ్ అయిన యూఎస్ ఎయిర్వేస్ విమానం ఘటనతో రష్యన్ మీడియా దీన్ని పోల్చింది.
విమానాలను పక్షులు ఢీకొనడం సాధారణమే. అయితే, అరుదుగా మాత్రమే అవి తీవ్ర ప్రమాదాలకు దారితీస్తాయి.
ఇవి కూడా చదవండి.
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- ఆంధ్రప్రదేశ్లోని పాత ఫొటోతో కశ్మీర్లో మహిళలపై పోలీసుల దాడి అంటూ ప్రచారం
- ఆర్టికల్ 370 రద్దుపై అరెస్టుకు ముందు షా ఫైజల్ ఏమన్నారు
- ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను నియమిస్తాం’
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తకు తగిన గుర్తింపు దక్కలేదా
- విజయవాడ గోశాలలో ఆవుల మృతి పట్ల ఎవరేమంటున్నారు?
- ‘హత్తుకొని పడుకునే ఆ పిల్లలు... అలాగే ప్రాణాలొదిలారు’
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- గిరుల మీది గంగను ఊరికి తరలించిన జనులు!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








