శ్రీలంకలో మళ్లీ పేలుళ్లు: ‘ఆరుగురు సూసైడ్ బాంబర్లు సహా 15 మంది మృతి’

శ్రీలంకలో శుక్రవారం సాయంత్రం మరో మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. తూర్పు ప్రాంతమైన అంపరాయి జిల్లాలో ఈ పేలుళ్లు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

సైంథమరుతు ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో మొత్తం 15 మంది మృతదేహాలు లభించాయని కూడా పోలీసులు చెప్పారు. ఇందులో చిన్నారుల మృతదేహాలు కూడా ఉన్నాయి.

మొత్తం 15 మందిలో ఆరుగురు సూసైడ్ బాంబర్లు కావొచ్చునని అనుమానిస్తున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి వెల్లడించారు.

అలాగే, అంపరాయిలోని సైంథమరుతు వద్ద పోలీసు బలగాలపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసు అధికార ప్రతినిధి కార్యాలయం వెల్లడించింది.

ఒక భవనంలో సోదాలు జరుపుతుండగా ఒక అనుమానితుడు బాంబును పేల్చాడని పోలీసులు తెలిపారు.

అయితే, అది ఆత్మాహుతి బాంబు పేలుడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనల్లో ఎవరైనా చనిపోయారా? అన్న వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

ఈ ఘటనలతో పట్టణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలను స్థానిక పాఠశాలలకు తరలించారు.

సైంథమరుతు, కల్మునై‌లో భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు చేస్తున్నాయని, భద్రతా బలగాలకు, మరో బృందానికి మధ్య కాల్పులు జరిగాయని బీబీసీ సింహళ ప్రతినిధి అజ్జామ్ అమీన్ తెలిపారు. పేలుడు శబ్దం కూడా వినిపించిందని చెప్పారు.

సమ్మందురై పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అంపరాయి జిల్లాలోని సెన్నెల్ అనే మరో గ్రామంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, ఇస్లామిక్ స్టేట్ నినాదాలు రాసిన బ్యానర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.

ఈ ఇంటిని కట్టంకుడికి చెందిన ఒక వ్యక్తి అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

కట్టంకుడి శ్రీలంక పేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్‌గా పోలీసులు భావిస్తున్న జహ్రాన్ హషీమ్ స్వస్థలం.

శుక్రవారం స్థానిక కాలమానం రాత్రి పది గంటల నుంచి శ్రీలంక అంతటా కర్ప్యూ విధించారు.

శుక్రవారం రాత్రి పది గంటల నుంచి శనివారం ఉదయం 4 గంటల వరకూ ఇది అమలైంది.

కల్మునై‌, సైంథమరుతు, చవలకడై పోలీస్ స్టేషన్ల పరిధిలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కర్ఫ్యూ అమలవుతుందని పోలీసు అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)