బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు క్షేమం.. NZvsBAN మూడో టెస్టు రద్దు : ‘ఆ అల్లానే మమ్మల్ని కాపాడాడు’ - బంగ్లాదేశ్ క్రికెటర్లు

న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో రెండు మసీదులపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందారు.

కాల్పులు జరిగిన రెండు మసీదుల్లో ఒకటైన అల్ నూర్ మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు వెళ్లారు. కాల్పులు జరుగుతున్నప్పుడు కూడా వారు అక్కడే ఉన్నారని న్యూజీలాండ్ క్రికెట్ తెలిపింది.

అయితే, బంగ్లాదేశ్ క్రికెటర్లంతా క్షేమంగానే ఉన్నారని న్యూజీలాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది.

పలువురు బంగ్లాదేశ్ క్రికెటర్లు సైతం ట్వీట్లు చేస్తూ.. తాము చాలా అదృష్టవంతులమని తెలిపారు.

బంగ్లాదేశ్ జట్టు న్యూజీలాండ్ దేశంలో పర్యటిస్తోంది. క్రైస్ట్‌చర్చ్ నగరంలో శనివారం నుంచి ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది.

అంతకుముందు జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లు, వన్డే సిరీస్‌లో మూడు వన్డేలనూ న్యూజీలాండ్ గెల్చుకుంది.

‘‘క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదులో కాల్పుల సందర్బంగా ఈరోజు అల్లా మమ్మల్ని కాపాడాడు. మేం చాలా అదృష్టవంతులం. మళ్లీ ఇలాంటివి చూడాలనుకోవట్లేదు. మా కోసం ప్రార్థించండి’’ అని బంగ్లా టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ తెలిపారు.

‘‘కాల్పులు జరుపుతున్న షూటర్ల నుంచి మొత్తం జట్టు తప్పించుకుంది. భయంకరమైన అనుభవం. దయచేసి మా కోసం ప్రార్థనలు కొనసాగించండి’’ అని బంగ్లా బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశారు.

న్యూజీలాండ్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల సభ్యులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని న్యూజీలాండ్ క్రికెట్ తెలిపింది.

క్రైస్ట్‌చర్చ్‌ కాల్పుల నేపథ్యంలో 16వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడో టెస్టు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)