ఎన్నికల కోసమే భారత్ యుద్ధ వాతావరణం సృష్టించింది : ఇమ్రాన్ ఖాన్

పాక్ పార్లమెంటులో మాట్లాడిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు బుధవారం సాయంత్రం భారత ప్రధాని మోదీతో మాట్లాడాలని ప్రయత్నించినట్లు చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

నేను జులై 26న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయక ముందే "చర్చల దిశగా భారత్ ఒక అడుగు వేస్తే మేం రెండడుగులు వేస్తాం" అని చెప్పాం,

రెండు దేశాల్లో ఉన్న పేదరిక నిర్మూలనే మా లక్ష్యం. చైనా 70 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది. పొరుగు దేశాలతో ఉన్న పరిష్కారాలను వివేకంతో పరిష్కరించుకుంది.

అఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదులపై యుద్ధ కోసం అమెరికా ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే, చైనా తనకు ఎన్నో సమస్యలు ఉన్నా మౌలిక సదుపాయాలు నిర్మించుకుంది.

రెండు దేశాలు ముందుకు వెళ్లడానికి శాంతి చాలా అవసరం. చర్చల ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవాలి.

మేం ప్రతిపాదన చేశాం, మోదీకి లేఖ కూడా రాశాం. ఐక్యరాజ్యసమితిలో విదేశాంగ మంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేయమన్నాం.

కానీ ఆ వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఎన్నికల వల్లే వారు స్పందించడం లేదని మాకు తర్వాత అర్థమైంది. వారు తమ ప్రచారం కోసం పాకిస్తాన్‌తో మంచి సంబంధాలను కోరుకోవడం లేదు.

ఎన్నికల కోసం ఏదో ఒకటి చేస్తారనే అనుకున్నాం

తర్వాత మేం వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాం. కర్తార్‌పూర్ తెరుద్దామని, చర్చలను మరింత ముందుకు తీసుకుళ్లి, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని అనుకున్నాం.

కానీ అక్కడ నుంచి చర్చలను ముందుకు కొనసాగించడం ఉండదని ప్రకటనలు వచ్చాయి.

కానీ మాకో భయం వేసింది. ఎన్నికల కోసం ఏదో ఒక చర్యకు దిగుతారని అనుకున్నాం.

ఎన్నికల ప్రచారం కోసం ఏదో ఒకటి చేస్తారని అనుకున్నాం. ఇంతలోనే పుల్వామా దాడి జరిగింది. దీని వెనుక ఆయన హస్తం ఉందని నేను అనడం లేదు.

కానీ పుల్వానా ఘటన జరిగినపుడు అరగంటలోనే పాకిస్తాన్ వైపు వేలు చూపించడం మొదలెట్టారు. అలా ఎలా జరుగుతుంది.

అప్పుడు దేశంలో సౌదీ ప్రిన్స్ పర్యటన ఉంది, ఆ సమయంలో మేం అలా ఎందుకు చేస్తాం. ఉగ్రవాద చర్యలకు ఎందుకు పాల్పడతాం

ఉగ్రవాద దాడుల వల్ల మాకేం లభిస్తుందో అర్థం కావడం లేదు. పుల్వామా వల్ల మాకు ఒరిగేదేముంది.

మీరు దానిపై ఎలాంటి సమాచారం ఇచ్చినా మేం సాయం చేస్తామని నేను భారత్‌కు చెప్పాను.

పాకిస్తాన్‌లోని పార్టీలన్నీ నేషనల్ యాక్షన్ ప్లాన్‌పై సంతకం చేశాయి. పాక్ లోపల ఎలాంటి మిలీషియాకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించాయి.

పుల్వామా దాడి వివరాలు ఈరోజే అందాయి

సాయుధ దళాలకు మా భూబాగంపై చోటు ఇవ్వకూడదని మేం భావిస్తున్నాం.

మీరు మాకు ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటాం అని మేం చెప్పాం. కానీ వార్ హిస్టీరియా పెరుగుతూ వెళ్లింది.

యుద్ధాలు, తీవ్రవాదం వల్ల పాకిస్తాన్‌లో జరిగిన నష్టం తెలుసు కాబట్టి పాక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. కానీ భారత మీడియాలో వార్ హిస్టీరియా కనిపించింది.

దాంతో, ఏదో ఒకటి జరుగుతుందని మేం భయపడ్డాం. అందుకే మీరు ఉల్లంఘనలు చేస్తే జవాబు ఇస్తాం అని ప్రకటించాం.

ఏ దేశమైనా అందుకు అనుమతించదు.

సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని మేం అప్పుడు చెబితే, ఈరోజు మాకు పుల్వామా దాడి గురించి వివరాలు ఇచ్చారు.

కానీ రెండ్రోజుల ముందు పాక్‌పై దాడి చేశారు. అంతర్జాతీయ నిబంధనలు, యుఎన్ చార్టర్ ఉల్లంఘించారు.

ముందే పుల్వామా వివరాలు ఇచ్చుంటే, పాకిస్తాన్‌పై యాక్షన్ లేకుంటే మేం చర్యలు తీసుకునేవాళ్లం.

ఎన్నికల కోసమే ఇలాంటి వాతావరణం సృష్టించారని మాకు అనిపించింది.

మాకు పక్కనే ఉన్న అప్గానిస్తాన్‌తో కూడా సమస్యలు ఉన్నాయి. దాని పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నాం.

భారత్ నుంచి ఏదో ఒక ముప్పు వస్తుందని మాకు తెలుసు. అప్పుడే వాళ్లు దాడి చేశారు.

నాకు ఉదయం మూడున్నరకు తెలిసింది. దీనికి జవాబివ్వాలా అని మా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌తో మాట్లాడాను.

మోదీతో మాట్లాడాలని ప్రయత్నించా

మాకు ప్రాణనష్టం జరగకపోతే, మేం దాడులు చేసి ఏదైనా నష్టం జరిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తం అవుతుందని అనుకున్నాం.

మీరు దాడి చేస్తే మేమూ దాడి చేయగలం అని చెప్పడానికే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా, టార్గెట్ హిట్ చేయకుండా లోపలికి వెళ్లి వచ్చాం.

కానీ మా విమానాలు తిరిగి వస్తున్నప్పుడు భారత ఫైటర్లు వాటిని కూల్చాలని చూశాయి. దాంతో మేం వాటిని కూల్చేశాం.

నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని ప్రయత్నించాను. మేం పరిస్థితిని మరింత పెంచవద్దనే విషయాన్ని ఆయనకు చెప్పాలనుకున్నాం.

దీనిపై ముందుకెళ్లడం మాకు, భారత్‌కు అంత మంచిది కాదు.

మేం ఆయనతో మాట్లాడాలని అనుకున్నది, మా మంత్రులు ప్రపంచ దేశాల నేతలతో మాట్లడానికి కారణం ఒకటే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలి.

ఒక బాధ్యతాయుతమైన దేశం వేరే దేశాలకు అణిగిమణిగి ఉండడాన్నిఇష్టపడదు.

నేను పార్లమెంటు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను.

మిసైల్ దాడి జరుగుతుందని అనుకున్నా

ఇది ఇంకా ముందుకెళ్తోంది, మా సైన్యం ప్రిపరేషన్స్ ఉన్నాయి. పాక్ సైన్యం ఎంత ప్రిపేర్ గా ఉందో, ఎక్కడ ఉందో నాకు తెలుసు.

రాత్రి నేను పాకిస్తాన్‌పై మిసైల్ దాడి జరుగుతుందని కూడా అనుకున్నాను. తర్వాత అది డిఫ్యూజ్ అయ్యింది.

దాన్ని తిప్పికొట్టడానికి మా సైన్యం ఎక్కడుందో కూడా నాకు తెలుసు.

అందుకే నేనీరోజు చెబుతున్నా. నేను భారత్‌కు ఈ వేదిక నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.

విషయాన్ని ఇంతకంటే ముందుకు తీసుకెళ్లకండి.. ఎందుకంటే మీరు ఏం చేసినా పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో దానికి బదులిస్తుంది.

రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. వాటి గురించి మనం అసలు ఆలోచించకూడదు.

ఎందుకంటే ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే మిసైల్ క్రైసిస్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరింత ముందుకు వెళ్లకుండా అంతర్జాతీయ సమాజం కూడా తమ పాత్ర పోషిస్తుందని నేను ఆశిస్తున్నాను

సారీ, చివర్లో ఒ మాట చెప్పడం మర్చిపోయాను, మేం పట్టుకున్న భారత్ పైలెట్‌ను రెండు దేశాల మధ్య శాంతిని దృష్టిలో ఉంచుకుని రేపు విడుదల చేస్తున్నాం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)