గణేశుడి బొమ్మతో రాజకీయ ప్రకటనపై రిపబ్లికన్ల క్షమాపణ

హిందువులను ఆకర్షించేందుకు ఇచ్చిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ క్షమాపణలు తెలిపింది.

వినాయక చవితి సందర్భంగా ఇచ్చిన ఈ ప్రకటనలో.. ‘‘మీరు ఒక గాడిదను పూజిస్తారా? ఏనుగును పూజిస్తారా? మీరే ఎంచుకోండి’’ అంటూ రాజకీయ సందేశాన్ని కూడా పేర్కొంది.

డెమొక్రాట్ల రాజకీయ చిహ్నం గాడిద కాగా, రిపబ్లికన్ల రాజకీయ చిహ్నం ఏనుగు.

ఈ ప్రకటన సమస్యాత్మకమైనదని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) తెలిపింది.

టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీలో ఉన్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయం దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ కార్యాలయమే స్థానిక పత్రికలో ఈ ప్రకటన ఇచ్చింది.

‘‘ముఖ్యమైన హిందూ పండుగ సందర్భంగా హిందువులను దగ్గర చేసుకునేందుకు రిపబ్లికన్ పార్టీ చేసిన ప్రయత్నం అభినందనీయమే కానీ, ఈ ప్రకటన హిందూ దైవం వినాయకుడిని.. ఒక రాజకీయ పార్టీ గుర్తు అయిన జంతువు చిహ్నంతో పోల్చడం సమస్యాత్మకం, అభ్యంతరకరం’’ అని హెచ్ఏఎఫ్ బోర్డు సభ్యుడు రిషి భుటాడ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

చాలామంది హిందువులు ఈ అభ్యంతరకర ప్రకటనను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. రిపబ్లికన్ పార్టీ స్పందన కోరారు.

విమర్శలు, ఆగ్రహాల నేపథ్యంలో పార్టీ స్పందిస్తూ.. ఈ ప్రకటన ఇచ్చింది హిందూ సంప్రదాయాలను, పద్ధతులను అప్రతిష్టపాలు చేయటానికి కాదని తెలిపింది.

‘‘ప్రకటన వల్ల ఎవరైనా మనస్తాపానికి గురైనట్లైతే మేం క్షమాపణలు చెబుతున్నాం. మా ఉద్దేశమైతే కచ్చితంగా అది కాదు’’ అని ఫోర్ట్ బెండ్ కౌంటీ రిపబ్లికన్ పార్టీ ఛైర్మన్ జాసీ జెట్టన్ స్థానిక విలేకరులకు తెలిపారు.

పార్టీ క్షమాపణలు చెప్పిన వెంటనే.. క్షమాపణల్ని ఆమోదిస్తున్నామని హెచ్ఏఎఫ్ తన ప్రకటనను సవరించింది.

‘‘మున్ముందు ఫోర్ట్ బెండ్‌లోని హిందువులు, ఇతర మతస్థులకు దగ్గరయ్యేందుకు ఇలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది బహిరంగ ప్రశ్న’’ అని భుటాడ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)