You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అలీబాబా అధినేత జాక్ మా సంచలన నిర్ణయం
అలీబాబా ఈ-కామర్స్ సామ్రాజ్యాధినేత జాక్ మా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి వైదొలగనున్నారు.
చైనాలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేయనున్నారని 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.
పదవి నుంచి వైదొలిగాక సంస్థ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటూ విద్యారంగంతో దాతృత్వంపై దృష్టిపెడతారని ఆ పత్రిక తెలిపింది.
జాక్ మా సహ వ్యవస్థాపకుడిగా అలీబాబా సంస్థ 1999లో పురుడు పోసుకుంది.
ఆ తరువాత ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారంలో ఆ సంస్థ ప్రపంచంలోని పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది.
400 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ గల ఆ సంస్థ ఆన్లైన్ విక్రయాలతో పాటు సినీ నిర్మాణం, క్లౌడ్ కంప్యూటింగ్లోనూ ఉంది.
సోమవారంతో 54వ ఏట అడుగుపెడుతున్న జాక్ మా నికర వ్యక్తిగత ఆస్తి 40 బిలియన్ డాలర్లు. చైనాలోని సంపన్నుల్లో ఆయనది మూడో స్థానం.
బిల్గేట్సే ఆదర్శం
బిల్గేట్స్లా తాను ఒక ఫౌండేషన్ ఏర్పాటుచేయదలచుకున్నట్లు ఆయన ఇటీవలే మీడియాతో చెప్పారు.
'బిల్ గేట్స్ నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంద'ని ఆయన బ్లూమ్బర్గ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు.
మళ్లీ బోధన వృత్తి చేపట్టాలని ఉందని ఆయన చెప్పారు. జాక్ మా అలీబాబాను స్థాపించడానికి ముందు హాంగ్జౌ యూనివర్సిటీలో ఇంగ్లిష్ బోధించేవారు.
''రిటైర్మెంట్తో నా శకం ముగిసిపోదు.. అది కొత్త శకానికి నాంది'' అంటూ తనకు చదువంటే ఇష్టమని, ఆ రంగానికి సంబంధించి పనిచేస్తానని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)