You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టాల్కం పౌడర్తో క్యాన్సర్: రూ.32 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించనున్న జాన్సన్ అండ్ జాన్సన్
22 మంది మహిళల అండాశయ క్యాన్సర్కు కారణమైన జాన్సన్ అండ్ జాన్సన్ వారికి రూ.32 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అమెరికాలోని మిస్సోరి కోర్టు ఆదేశించింది.
తన టాల్కం పౌడర్ ఉత్పాదన విషయంలో జాన్సన్ అండ్ జాన్సన్ సుమారు 9 వేలకు పైగా కేసులను ఎదుర్కొంటోంది.
కొన్ని దశాబ్దాల పాటు బేబీ పౌడర్, ఇతర ఉత్పాదనలను వాడినందువల్లే తమకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఈ కేసులో మహిళలు, వారి కుటుంబాలు వాదించాయి.
జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్లో ఆస్బెస్టాస్ ఉన్న సంగతి 1970ల నుంచి ఆ సంస్థకు తెలుసనీ, అయితే దానిని వాడితే వచ్చే ఫలితాల గురించి ఆ సంస్థ వినియోగదారులకు వివరించడంలో విఫలమైందని బాధితుల తరపు లాయర్లు వాదించారు.
అయితే తమ ఉత్పాదనలలో ఆస్బెస్టాస్ లేదనీ, వాటి వల్ల క్యాన్సర్ రాదనీ జాన్సన్ అండ్ జాన్సన్ అంటోంది. తమ ఉత్పాదనలు సురక్షితమని అనేక పరీక్షల్లో తేలిందని తెలిపింది.
ఈ తీర్పు తమకు తీవ్ర నిరాశ కలిగించిందని, దీనిపై అప్పీలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొంది.
తమ టాల్కం పౌడర్ కారణంగా క్యాన్సర్ వస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్సన్ అండ్ జాన్సన్ చెల్లించనున్న అతి పెద్ద నష్టపరిహారం ఇదే.
గత ఏడాది కాలిఫోర్నియా కోర్టు అండాశయ క్యాన్సర్కు కారణమైన జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పాదనల కేసు విషయంలో రూ.2,850 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే తర్వాత మరో జడ్జి ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లోనూ సబ్స్క్రైబ్ చేయండి.)