జిందాబాద్ ఇస్లాం, జిందాబాద్ హిందుస్తాన్, జిందాబాద్ ఇరాన్: రౌహానీ

ఫొటో సోర్స్, BBC/SANGEETHAM PRABHAKAR
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్, ఇరాన్ల మధ్య సహకారం మరింత బలపడేందుకు కృషి చేస్తామని ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ తెలిపారు.
భారత పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం హైదరాబాద్లోని చారిత్రక మక్కా మసీదును సందర్శించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇరు దేశాల సంబంధాలతో పాటు, పలు విషయాలనూ ప్రస్తావించారు.
"చమురు, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్న దేశం ఇరాన్. భారత పురోభివృద్ధి కోసం వాటిన్నింటినీ పంచుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం" అని రౌహానీ స్పష్టం చేశారు.
చాబహార్ పోర్టు ద్వారా ఇరు దేశాల మధ్య సహకారం మరింత మెరుగవుతుందని ఆయన అన్నారు.
సముద్ర మార్గం ద్వారా భారత్, ఇరాన్ల మధ్య దూరాన్ని ఈ పోర్టు తగ్గిస్తుంది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఇరాన్లో నిర్మించిన ఈ పోర్టు అభివృద్ధికి భారత్ సాయం చేస్తోంది.
దీని ద్వారా అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు, భారత్ మధ్య కూడా సరకుల రవాణా సులభతరం అవుతుంది. రవాణా కోసం పాకిస్తాన్ భూభాగంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా వ్యూహాత్మకంగా నిర్మించిన పోర్టు ఇది.

ఫొటో సోర్స్, BBC/SANGEETHAM PRABHAKAR
హైదరాబాద్ ముస్లింలు, ఇరాన్ ముస్లింల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న అనుబంధం మరింత బలోపేతం అవ్వాలని రౌహానీ ఆకాంక్షించారు. అందుకోసం భారతీయుల కోసం వీసా నిబంధనలను సులభతరం చేస్తామని ఆయన ప్రకటించారు. భారత్ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తుందని కోరుకుంటున్నట్టు తెలిపారు.
భారత్, ఇరాన్ల మధ్య భాషా, సంస్కృతి పరమైన సంబంధాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి.
కానీ, కొన్నేళ్ల క్రితం ఆ బంధానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. 2009లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకించిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు భారత్ మద్దతిచ్చింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను కూడా తగ్గించుకుంది. అది ఇరాన్కు అసంతృప్తి కలిగించింది.
అయితే, గతేడాది ఇరాన్పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు తొలగిపోవడంతో ఇప్పుడు భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆ దేశాన్నే ఎంచుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
"జిందాబాద్ ఇస్లాం, జిందాబాద్ హిందుస్తాన్"
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఐక్యతను పెంపొందించడమే మా ధ్యేయం" అని రౌహానీ వ్యాఖ్యానించారు.
ముస్లింలు ఐక్యంగా ఉంటే పాలస్తీనా ముస్లింలను గాయపరిచేందుకు ఎవరూ ధైర్యం చేసుండేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లింలందరూ సహనంతో పరస్పరం గౌరవించుకోవాలన్న సందేశాన్ని ఇచ్చేందుకు మక్కా మసీదులో షియా, సున్నీ ముస్లింలతో కలిసి రౌహానీ ప్రార్థనలో పాల్గొన్నారు.
అమెరికాలోని పాఠశాలలో తాజాగా జరిగిన కాల్పుల ఘటన గురించి ప్రస్తావిస్తూ.. "అమెరికా సహా పశ్చిమ దేశాల్లోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అనేకమంది హత్యలకు గురవుతున్నారు. దీన్నిబట్టి మానవజాతికి దిక్సూచిగా, మానవజాతి సంక్షేమాన్ని పెంపొందించే మార్గదర్శిగా అమెరికాను చూడలేం" అని రౌహానీ వ్యాఖ్యానించారు.
"జిందాబాద్ ఇస్లాం, జిందాబాద్ హిందుస్తాన్, జిందాబాద్ ఇరాన్" అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఫొటో సోర్స్, BBC/SANGEETHAM PRABHAKAR
అంతకు ముందు హైదరాబాద్లోని శుక్రవారం ఉదయం చారిత్రక కూలీ కుతుబ్ షా సమాధి కాంప్లెక్స్ను సందర్శించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నాయకులతో దిల్లీలో ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ శనివారం సమావేశం కానున్నారు. పారిశ్రామిక వేత్తలు, పార్సీలతోనూ ఆయన భేటీ కానున్నారు.
ఇవి కూడా చదవండి:
- పంజాబ్ నేషనల్ బ్యాంకు: 11,360 కోట్ల కుంభకోణం అసలెలా జరిగింది!
- అభిప్రాయం: మోహన్ భాగవత్ ఎదురుచూపులు ఏ యుద్ధం కోసం?
- ఒక్కసారి కన్ను గీటి కోట్ల హృదయాలను దోచేసిన అమ్మాయి కథ ఇదీ!
- 'మా చాయ్ ఇరానీ.. మేం మాత్రం పక్కా హైదరాబాదీ!'
- చిత్తూరు: సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృతి
- 'ఆరోగ్య శ్రీ' కేంద్ర ఆరోగ్య బీమా పథకంలో కలిసిపోతుందా?
- గో-కార్ట్ చక్రంలో జుట్టు చిక్కుకుని మహిళ మృతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








