-60 డిగ్రీల్లోనూ హాయిగా బతికేస్తున్నారు

ఉష్ణోగ్రతలు ఓ పది డిగ్రీలకు పడిపోతేనే వణికిపోతాం. అలాంటిది ఓ గ్రామంలో ఏకంగా -60 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ ప్రజలు బతుకుతున్నారు. భూమ్మీద మనుషులు జీవిస్తోన్న అత్యంత చల్లనైన గ్రామం అదే. సైబీరియాలో ఉన్న ఆ ఊరి పేరు వోమ్యకాన్.

సాధారణంగా చలికాలంలో అక్కడి ఉష్ణోగ్రతల సగటు -50 డిగ్రీలు ఉంటుంది. 1933లో అయితే అది రికార్డు స్థాయిలో ఏకంగా -68డిగ్రీలకు చేరింది.

దాదాపు -50 డిగ్రీల చలిలోనూ అక్కడి పిల్లలు స్కూళ్లకు వెళ్తారు. -52 డిగ్రీలకంటే దిగువకు పడిపోయినప్పుడు మాత్రమే పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు.

స్థానికులకు ఆ వాతావరణం అలవాటైనా, బయటివాళ్లు వెళ్తే మాత్రం కొన్ని నిమిషాల్లోనే శరీరం మొద్దుబారిపోయే ప్రమాదం ఉంది.

గ్రామంలోని పైపులు గడ్డకట్టకుండా ఉండేందుకు నిత్యం వాటిలో వేడి నీళ్లను సరఫరా చేస్తారు. కానీ ఆ నీళ్లు తాగడానికి పనికిరావు.

తాగునీటి కోసం అక్కడి వారు స్థానికంగా ఉండే ఓ నదిలో నుంచి ఐసు గడ్డల్ని కోసుకొచ్చి ఇంటిముందు పెట్టుకుంటారు. అవసరమైనప్పుడు ఇంటి లోపల వాటిని కరిగించి వాడుకుంటారు.

బ్యాటరీలు గడ్డకట్టకుండా ఉండేందుకు వాహనాలను కూడా ఎప్పుడూ ఆన్ లోనే ఉంచుతారు.

భూమిలోపల గడ్టకట్టిన స్థితిలో దొరికే స్ట్రోగనిన్ చేపలను స్థానికులు ఇష్టంగా తింటారు.

అక్కడ ఎవరైనా చనిపోతే ఖననం చేయడం కూడా కష్టం. మంట రగిల్చి భూమిపై పేరుకున్న ఐస్‌ని కొద్ది కొద్దిగా కరిగిస్తూ గొయ్యిని తవ్వడానికి చాలా సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)