యాహూ ఖాతాలన్నింటిపైనా 2013 హ్యాకింగ్ ప్రభావం

ఫొటో సోర్స్, Reuters
తమ వినియోగదారులకు చెందిన మొత్తం మూడు వందల కోట్ల ఖాతాలు 2013లో జరిగిన హ్యకింగ్ దాడికి గురయ్యాయని ఇంటర్నెట్ సేవల కంపెనీ యాహూ ప్రకటించింది.
2013లో దాదాపు 100 కోట్ల (ఒక బిలియన్) ఖాతాల వివరాలను హ్యాకర్లు చోరీ చేశారని నిరుడు యాహూ వెల్లడించింది. వినియోగదారులంతా తమ ఖాతాల యూజర్ ఐడీలు, పాస్వర్డ్లను మార్చుకోవాలని కోరింది.
అయితే ఆ సైబర్ దాడి గుట్టు విప్పేందుకు నిపుణులు పరిశోధించగా వంద కోట్లే కాదు, మొత్తం ఖాతాలన్నిటిపైనా హ్యాకింగ్ ప్రభావం పడిందని గుర్తించారు. అన్ని ఖాతాలకు చెందిన వివరాలనూ హ్యాకర్లు తస్కరించారని తేల్చారు. అదే విషయాన్ని యాహూ అధికారికంగా వెల్లడించింది.
చోరీకి గురైన సమాచారంలో ఖాతాదారుల పాస్వర్డ్లు, బ్యాంకు ఖాతాలు, పేమెంట్ కార్డుల వివరాలు లేవని తెలిపింది.
ఇది కూడా చదవండి:

ఫొటో సోర్స్, Getty Images
నష్టాల బారిన పడ్డ యాహూ సంస్థను అమెరికన్ టెలికం దిగ్గజం వెరిజోన్ కొనుగోలు చేసింది. ఆ డీల్ ఈ జూన్ 13న పూర్తయింది. అయితే గత సంవత్సరం తొలుత రూ. 31 వేల కోట్లకు (4.8 బిలియన్ డాలర్లు) కొనేందుకు సిద్ధపడిన వెరిజోన్, 2013, 2014లో తమ వినియోగదారుల ఖాతాలు లీకయ్యాయని యాహూ ప్రకటించడంతో డీల్ను 4.5 బిలియన్ డాలర్లకు తగ్గించింది.
తమ వినియోగదారుల ఖాతాల భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని వెరిజోన్ భద్రతా విభాగం ఉన్నతాధికారి చంద్ర మెక్మోహన్ స్పష్టం చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








