You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కనిపించిన భారతీయ మహిళ
- రచయిత, షుమైలా జాఫ్రీ , అమృత దుర్వే
- హోదా, బీబీసీ న్యూస్
ఆమె భారతదేశం వదిలిపెట్టి వెళ్లి 20 ఏళ్లయింది. ఎక్కడకు వెళ్లారో తెలియదు. కానీ, రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆమె పాకిస్తాన్లో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది.
ముంబయికి చెందిన హమీదా బాను 2002లో ఉద్యోగం కోసం ఒక రిక్రూట్ మెంట్ ఏజెంట్ను సంప్రదించారు. దుబాయి లో వంట పని ఇప్పిస్తానని రిక్రూట్మెంట్ ఏజెంట్ చెప్పడంతో ఆమె దేశం వదిలిపెట్టి వెళ్లారు.
కానీ, ఆమెను దుబాయికి పంపేందుకు బదులు పాకిస్తాన్కు పంపించినట్లు బాను చెప్పారు.
ఆమెను వెతికేందుకు 20 ఏళ్ల పాటు ప్రయత్నించినట్లు ముంబయిలో ఉన్న బాను కుటుంబం చెప్పింది. అయితే, చివరకు ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఆమెను కనిపెట్టగల్గినట్లు చెప్పారు.
ఆమెను వెతికేందుకు సహాయపడిన వ్యక్తులు ఒకరు భారతదేశంలో, మరొకరు పాకిస్తాన్లో ఉంటారు.
భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య రాకపోకలు ఎప్పుడూ కాస్త కష్టంగానే ఉంటాయి.
బాను విషయానికొచ్చేసరికి ఆమె దగ్గర భారత్ కు తిరిగి వచ్చేందుకు తగినన్ని ఆర్ధిక వనరులు లేవు.
కానీ, తన పిల్లల్ని కలవాలన్న కోరిక మాత్రం ఆమెలో బలంగా ఉండేది. చివరకు ఈ ఏడాది జులై లో సోషల్ మీడియా ప్రచారకర్త వాలియుల్లా మారూఫ్ బానును ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు.
ముంబయి కు చెందిన విలేఖరి ఖల్ఫాన్ షేక్ ఆ వీడియోను షేర్ చేశారు. బాను కుటుంబం ఆమెను కనిపెట్టేందుకు ఈ వీడియో సహాయపడింది.
బాను తన కూతురు యాస్మిన్ షేక్ తో వీడియో కాల్లో మాట్లాడేందుకు ఈ ఇద్దరు వ్యక్తులు ఏర్పాట్లు చేశారు.
"ఎలా ఉన్నావు? నన్ను గుర్తు పట్టావా? ఇన్నేళ్లు ఎక్కడున్నావు? అని యాస్మిన్ ఆ వీడియోలో అడుగుతూ కనిపించారు.
"నేనెక్కడున్నాను, ఎలా ఉన్నాను అని అడగకు. నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇక్కడ నేను ఇష్టంతో ఉండలేదు. నాకు మరో మార్గం లేదు" అని బాను సమాధానమిచ్చారు.
బాను ప్రయాణం
బాను భర్త మరణించిన తర్వాత తన నలుగురి పిల్లల బాధ్యత తన పైనే పడిందని బాను చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె దోహా, ఖతార్, దుబాయి, సౌదీ అరేబియాలలో వంట మనిషిగా పని చేసేవారని మారూఫ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆమె దుబాయిలో పని ఇప్పించమని అడుగుతూ 2002లో ఒక రిక్రూట్మెంట్ ఏజెంట్ను కలిశారు. ఆమె అందుకు బదులుగా రూ. 20,000 చెల్లించమని కోరారు.
కానీ, దుబాయి పంపించేందుకు బదులు ఆమెను పాకిస్తాన్లోని హైదరాబాద్ కు తీసుకుని వచ్చినట్లు బాను ఆ ఇంటర్వ్యూ లో చెప్పారు.
అక్కడ ఒక ఇంట్లో ఆమెను మూడు నెలల పాటు బంధించి ఉంచినట్లు చెప్పారు.
కొన్నేళ్ల తర్వాత కరాచీలో ఒక వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆయన కోవిడ్ సమయంలో మరణించారు.
బాను ప్రస్తుతం ఆమె సవతి కుమారుడితో కలిసి ఉంటున్నారు.
గతంలో బాను విదేశాల్లో ఉన్నప్పుడు ఆమెతో తరచుగా మాట్లాడుతూ ఉండేదానినని యాస్మిన్ చెప్పారు. కానీ, 2002లో ఆమె ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఆమె నుంచి ఫోన్ కాల్ రాలేదని చెప్పారు. చివరకు ఈమె విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన ఏజెంట్ ను సంప్రదించినట్లు చెప్పారు.
"మా అమ్మ క్షేమంగానే ఉన్నారని కానీ ఆమె మాతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని చెప్పారు. మా అమ్మ గురించి తిరిగి చాలా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాం. కానీ, ఆ ఏజెంట్ అకస్మాత్తుగా కనిపించడం మానేశారు" అని యాస్మిన్ చెప్పారు.
సోషల్ మీడియా
మారూఫ్ కరాచీలోని ఒక స్థానిక మసీదులో ఇమామ్గా పని చేస్తున్నారు. ఆమె 15 ఏళ్ళ క్రితం ఆ ప్రాంతానికి వచ్చి చిన్న షాపు పెట్టుకున్నప్పుడు ఆమెను మొదటిసారి కలిసినట్లు చెప్పారు.
"నా చిన్నప్పటి నుంచి నేనామెను చూస్తున్నాను. ఆమె ఎప్పుడూ విచారంగా ఉంటారు" అని చెప్పారు.
మారూఫ్ కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్కు అక్రమంగా తరలించిన మహిళలు తమ కుటుంబాల గురించి తెలుసుకోవడానికి సహాయం చేసేందుకు తన సోషల్ మీడియా అకౌంట్ లను ఉపయోగించుకుంటున్నారు.
బాను రెండవ భర్త కూడా మరణించిన తర్వాత తనకు సహాయం చేయమని చెప్పమని మారూఫ్ తల్లిని పదే పడే అడిగేవారు.
ఆమె పరిస్థితి పట్ల జాలి కలిగిందని మారూఫ్ చెప్పారు. కానీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాల వల్ల మారూఫ్ ఆమెకు సహాయం చేసేందుకు ఎప్పుడూ సంశయిస్తూ ఉండేవాడినని చెప్పారు.
"భారతదేశంతో దూరంగా ఉండమని నా స్నేహితులు చెప్పేవారు. ఈ విషయం నన్ను సమస్యల్లోకి నెట్టేస్తుందేమోనని భయం ఉండేది. కానీ, ఆమె పరిస్థితి చూసి ఇక ఆగలేక వీడియోను పోస్ట్ చేశాను" అని చెప్పారు. ఇందుకోసం ఆమె దగ్గర నుంచి ఎటువంటి డబ్బు తీసుకోలేదని చెప్పారు.
ఈ ఇంటర్వ్యూలో బాను తన పిల్లల పేర్లు, చిరునామాను షేర్ చేశారు.
షేక్ ఈ వీడియోను షేర్ చేసినప్పుడు ఆ వీడియోను యాస్మిన్ కొడుకు అమన్ చూశారు.
18 ఏళ్ల అమన్ తన అమ్మమ్మను ఎప్పుడూ కలవలేదు. ఈ అబ్బాయి పుట్టేటప్పటికే ఆమె ముంబయి వదిలి వెళ్లిపోయారు. కానీ, యాస్మిన్ ఆమెను వెంటనే గుర్తు పట్టారు.
పాకిస్తాన్లోని భారతీయ రాయబార కార్యాలయం అధికారులు మారూఫ్ను సంప్రదించి బానుకు సంబంధించిన వివరాలతో దరఖాస్తును సమర్పించమని చెప్పినట్లు తెలిపారు. దరఖాస్తు చేసిన తర్వాత ఆమె స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కానీ, ఇందు కోసం ఎంత సమయం పడుతుందో చెప్పలేమని మారూఫ్ అంటున్నారు.
బాను ఇంటికి తిరిగి వచ్చేందుకు క్షణాలు లెక్కపెట్టుకుంటున్నారు. తన పిల్లల్ని తిరిగి కలుస్తాననే ఆశను ఆమె పూర్తిగా వదిలేసుకున్నారు.
"మా భావోద్వేగం కూడా అలాగే ఉంది" అని యాస్మిన్ అన్నారు.
"మేము 20 ఏళ్ల పాటు ఎదురు చూసాం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేనా వీడియో చూసిన దగ్గర నుంచి నవ్వుతూనే ఉన్నాను. అదొక చెప్పలేని అనుభూతి" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?
- గోదావరి వరద: మునిగిపోయిన ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ టెంట్లు వేసుకుని కొండలపైనే ఎందుకు గడుపుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)