Conocarpus: భారత్, పాకిస్తాన్‌ దేశాలను ఈ మొక్క ఎందుకు భయపెడుతోంది?

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

దేశాలు, ప్రభుత్వాలను కలవరపెట్టిన, పెడుతూనే ఉన్న ఓ మొక్క కథ ఇది. దీని పేరు కోనోకార్పస్.

శంఖు రూపంలో( కోన్ ఆకారం)లో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ‘కోనోకార్పస్’ మొక్కలు లేదా చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను ఆదరించాయి.

భారత్, పాకిస్తాన్, అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఈ మొక్కలను రహదారులు, గార్డెనింగ్, కమ్యునిటీ, అవెన్యూ ప్లాంటేషన్లలో భాగంగా విస్తృతంగా పెంచారు. ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గడం కనిపిస్తోంది.

కోనోకార్పస్ పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోందని వృక్ష, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా కోనోకార్పస్ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది.

గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హరిత వనం’ నర్సరీల్లో కోనోకార్పస్‌ను పెంచవద్దని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేసింది. గతంలో నగర సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ నగర పాలక సంస్థ ‘జీహెచ్ఎంసీ’ పరిధిలో ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచింది. ఇప్పుడు వెనక్కి తగ్గింది.

కోనోకార్పస్ ఎక్కడి నుంచి వచ్చింది?

కోనోకార్పస్ అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరిగుతుంది.

అరబ్, మద్య ప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు, వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడగా పనిచేస్తుందని మొదట్లో ఈ మొక్కలను విస్తృతంగా నాటారు.

"ఏపుగా ఒక కోన్ షేప్‌లో పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీల నిర్వాహకులు, మన ప్లాంటేషన్ ఎక్స్‌పర్ట్ దీన్ని భారతదేశానికి తీసుకువచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీలు ,అర్బన్ ఏరియాల్లో నాటారు. మన ప్రాంతానికి చెందిన మొక్కకాదు కాబట్టి ఇది పర్యావరణ సంబంధ దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అంతే కాకుండా, శ్వాస సంబంద వ్యాధులు, అనేకరకాల ఎలర్జీలకు కోనోకార్పస్ కారణం అవుతుంది’’ అని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ బాటనీ విభాగం ప్రొఫెసర్ ఈ నరసింహ మూర్తి బీబీసీతో చెప్పారు.

తెలంగాణతో పాటూ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కోనోకార్పస్‌పై విస్తృత చర్ఛ సాగింది. మహారాష్ట్రలో ‘పుణె’ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ పార్కులలో కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని చేపట్టొద్దని స్థానిక పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణలో క్షేత్రస్థాయి పర్యటనల్లో, గ్రామపంచాయతీల నర్సరీల్లో పెంచుతున్న కోనోకార్పస్ మొక్కలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హరితహారంలో భాగంగా ఎక్కువగా నాటుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, విదేశీ జాతికి చెందిన ఈ మొక్క వల్ల పర్యావరణ, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అందుకే వీటి పెంపకాన్ని ప్రోత్సహించవద్దని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ కమీషనర్ ఇటీవల జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చారు.

అయితే, వర్షాకాలంలో భాగంగా చేపట్టబోయే ‘తెలంగాణకు హరితహారం’ కోసం ఇప్పటికే ఆయా గ్రామపంచాయతీల నర్సరీల్లో ఈ మొక్కలను భారీగా పెంచారు. గత హరితహారాల్లో భాగంగా వేగంగా, ఎక్కువ పచ్చదనంతో పెరిగే ఈ మొక్కలను భారీ సంఖ్యలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. కాలనీలు, రహదారుల వెంబడి, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల ముందు అందం కోసం విరివిగా వీటిని పెంచారు.

తాజా ఆదేశాలతో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు పునరాలోచనలో పడ్డారు.

"గతంలో మా గ్రామంలో ఎక్కువ సంఖ్యలోనే కోనోకార్పస్ మొక్కలను నాటడం జరిగింది. ప్రస్తుతం మా గ్రామ నర్సరీలో 300కు పైగా ఈ మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉన్నాయి. అయితే తాజా ప్రభుత్వ ఉత్తర్వుతో అయోమయంలో పడ్డాం. దీనిపై ఎలా స్పందించాలన్న అంశంపై జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ఆదేశాలకోసం వేచి చూస్తున్నాం’’ అని పెద్దపల్లి జిల్లా నాగారం గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ బీబీసీతో చెప్పారు.

అరబ్ దేశాలు, ఇరాక్, పాకిస్తాన్ అనుభవాలు

అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో కోనోకార్పస్‌ను ‘దమన్’ అని పిలుస్తారు. పచ్చదనంతో పాటు వాతావరణంలో వేడి నియంత్రిస్తుందని, ఎడారి వాతావరణంలో దుమ్ము, ధూళి, గాలితో పాటు వచ్చే ఇసుకను అడ్డుకుంటుందని ఆ దేశాలు కోనోకార్పస్‌ను పెద్ద సంఖ్యలో పెంచాయి.

అయితే, ఇప్పుడు కువైట్, ఖతార్, యూఏఈ లాంటి దేశాలు నర్సరీల్లో దీని పెంపకం, దిగుమతులను నియంత్రించాయి.

కాంక్రీట్ వనాల మధ్య వేగంగా హరిత వాతావరణం తీసుకొచ్చేందుకు ఈ మొక్క దోహదపడుతుండటం ఆయా దేశాలు దీన్ని ఆదరించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని వృక్షశాస్త్ర ఆచార్యులు ఈ నర్సింహ మూర్తి అభిప్రాయపడ్డారు.

‘’సహజంగా మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేర్లు కలిగి ఉంటాయి. దీంతో, అవి భూగర్భంలో చొచ్చుకుపోయి అండర్ గ్రౌండ్ గుండా వేసిన కమ్యూనికేషన్, తాగునీరు, డ్రైనేజీ పైపులైన్‌లకు నష్టం చేస్తాయి. గోడలు, ఇతర నిర్మాణాలు వీటి వేర్లతో దెబ్బతింటాయి. అదే సందర్భంలో ఈ మొక్క పండ్లు, పుష్పాలు తినేందుకు పనికిరావు. కనీసం పక్షులు గూడు కట్టుకునేందుకు కూడా ఈ చెట్టు పనికి రాదు. కేవలం అందం, ఆకర్షణ తప్ప ఇతర ఉపయోగాలు లేవు. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుంది. అందుకే స్వదేశీ మొక్కలైన చింత, వేప, మర్రి, పొగడ, ఆకాశమల్లె లాంటి చెట్లను నాటాలని వృక్షశాస్త్ర నిపుణులుగా ప్రభుత్వాలను కోరుతున్నాం’’ అని ప్రొఫెసర్ మూర్తి అన్నారు.

ఇరాక్ దేశంలోని ‘మిసాన్ ప్రావిన్స్‌లో కోనోకార్పస్‌తో అక్కడి మౌలిక వసతులకు ఎదురైన పరిస్థితులు, కలిగిన నష్టాలపై ‘యూనివర్సిటీ ఆఫ్ మిసాన్’ 2020లో జరిపిన అధ్యయన ఫలితాల ఆధారంగా ఒక పరిశోధన పత్రం ప్రచురించింది. ఈ మొక్క వల్ల స్థానిక నివాస ప్రాంతాల్లోని వాటర్ పైప్ లైన్, డ్రైనేజీలకు నష్టం వాటిల్లినట్టు అందులో పేర్కొన్నారు.

అయితే, ఈ మొక్క పచ్చదనానికి తోడ్పడుతున్నందున వాటి వేర్లు భూగర్భంలో లోతుగా, దూరంగా చొచ్చుకు పోయి నిర్మాణాలకు నష్టం చేయకుండా ఉండేలా రోజువారిగా నీటిని పట్టాలని, ఈ మొక్కల ఆకుల పెరుగుదలను ప్రూనింగ్ పద్దతిలో నియంత్రించడం వల్ల మొక్కకు అవసరమయ్యే నీటి వినియోగం తగ్గించాలని, నిర్మాణాలకు దూరంగా పెంచాలని ఈ పరిశోధన పత్రంలో సూచనలు చేశారు.

కరాచీలో ‘గాలి నాణ్యత’పై ప్రభావం..

గతంలో పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఈ మొక్కలు పెంచడంపై స్థానిక పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి తమ ఆందోళన వ్యక్తం చేసారు.

కరాచీ యూనివర్సిటీ బాటనీ విభాగం ఆధ్వర్యంలో కోనోకార్పస్‌తో పాటు ఇతర 32 జాతి మొక్కల వల్ల అక్కడి వాతావరణంలో ముఖ్యంగా ‘గాలి నాణ్యత’పై ప్రభావం పడుతోందన్న అంశంపై ఎయిరోబయాలజిస్ట్‌లు పరిశోధనలు నిర్వహించారు. కరాచీలో ఆస్థమా పేషంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకు ఈ మొక్కలే కారణమని అందులో తేలింది. దేశవాళీ చెట్లనే పెంచాలని అక్కడి వృక్షశాస్త్రవేత్తలు సూచించారు.

భారీ ఎత్తున మొక్కలు నాటే హరితహారం లాంటి కార్యక్రమాల్లో దేశవాళీ మొక్కలనే నాటాలని బోటనిస్టులు సూచిస్తున్నారు.

మొక్కలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?

వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నట్టుగా మొక్కలు మనుషుల ఆరోగ్యాలను ప్రభావితం చేయగలుగుతాయా అన్న అంశంపై కరీంనగర్‌‌కు చెందిన శ్వాసకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ ఉడుత చంద్రశేఖర్ బీబీసీతో మాట్లాడారు.

"అన్ని రకాల మొక్కలతో ఇలాంటి అనుభవం ఉండకపోవచ్చు. కొన్ని రకాల మొక్కలు మనుషుల చర్మం, శ్వాసవ్యవస్థలపై ప్రభావితం చూపుతాయన్నది కొన్నిరకాల పరిశోధనల్లో రుజువయింది. సాధారణంగా పార్థీనియం, పొద్దుతిరుగుడు, ఉమ్మెత్త, చామంతి, మందార, గులాబీ మొక్కల పుప్పొడి రేణువులు తాకడం వల్ల కొంతమందికి స్కిన్ అలర్జీ వస్తుంది.

తెలియకుండా వాటి వాసన పీల్చినా శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో కొన్ని రసాయనాలు విడుదలై శ్లేష్మం(మ్యూకస్) పెరిగిపోయి కఫం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. వైద్యపరిభాషలో దీన్ని ‘అలర్జిక్ బ్రాంకైటిస్’, బ్రాంకిల్ హైపర్ రియాక్టివిటీ అని పిలుస్తారు.

కొంతమందిపై కొన్ని రకాల మొక్కలు ప్రభావం చూపుతాయి. ఇదివరకే ఆస్థమా, చర్మసంబంద అలర్జీ ఉన్నవారిపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ రకం అలర్జీలకు చికిత్స ఉంది. అయితే ముందుజాగ్రత్త చర్యగా వాటికి దూరంగా ఉండటం మంచిది" అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)