ఆధార్ నంబర్ ఇచ్చే ముందు కామన్ సెన్స్ ఉపయోగించమని ప్రభుత్వం ఎందుకు చెబుతోంది... మీ డేటాకు భద్రత లేదా?

    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'హోటళ్లు, సినిమా థియేటర్లలో మీ ఆధార్ కార్డ్ ఫోటో కాపీలు ఇవ్వకండి. అక్కడ ఆధార్‌ను మిస్ యూజ్ చేయొచ్చు.'

కొద్ది రోజుల కిందట బెంగళూరులోని యూఐడీఏఐ కార్యాలయం ప్రజలకు చేసిన సూచన ఇది. ఆ తరువాత ఆ అడ్వైజరీని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ వెనక్కి తీసుకుంది. యూఐడీఏఐ చేసిన సూచనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఐటీశాఖ తెలిపింది.

ఆ అడ్వైజరీని వెనక్కి తీసుకుంటున్న సందర్భంలో ప్రజలకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం, ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే...

  • యూఐడీఏఐ నుంచి లైసెన్స్ పొందిన సంస్థలకు మాత్రమే ఆధార్ ఇవ్వాలి.
  • ఆధార్ నెంబరును ఎవరికైనా ఇచ్చే ముందు కామన్ సెన్స్‌తో వ్యవహరించాలి. విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి.
  • చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే మాస్క్‌డ్ ఆధార్‌ను ఇవ్వాలి.

లైసెన్స్ ఉందో లేదో నేను ఎలా తెలుసుకోవాలి?

ఇప్పుడు ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. మన ఆధార్ వివరాలను ఒక కంపెనీ అడిగితే, ఆ కంపెనీ వద్ద యూఐడీఏఐ జారీ చేసిన లైసెన్స్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. ఒకవేళ సంస్థలు లైసెన్స్ చూపించినా అది అసలైనదేనా లేక నకిలీదా అని ఎలా ధ్రువీకరించుకోవాలో కూడా వెల్లడించలేదు.

ఇక ప్రభుత్వం చెప్పిన మరొక మాట... ఆధార్‌ను షేర్ చేసేటప్పుడు కామన్ సెన్స్ ఉపయోగించమని. విచక్షణ జ్ఞానాన్ని వాడమని. మరి కామన్ సెన్స్ ఉపయోగించడం అంటే ఏమిటి? దాన్ని ప్రభుత్వం నిర్వచించలేదు.

నేను ఆధార్ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా?

ఆధార్‌ దుర్వినియోగం కావొచ్చంటూ అడ్వైజరీ జారీ చేసి, ఆ తరువాత దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు డేటా ప్రైవసీ మీద చర్చ మొదలైంది. డేటా ప్రైవసీ మీద ప్రభుత్వానికే స్పష్టత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

యూఐడీఏఐ 2016, నవంబరు 11న ఒక ట్వీట్ చేసింది. ఆధార్ వంటి గుర్తింపు కార్డుల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆధార్ నెంబర్ కానీ కాపీలను కానీ ఎవరికీ ఇవ్వొద్దని అందులో హెచ్చరించింది.

కానీ 2018 మార్చి 17న చేసిన ట్వీట్‌లో ఆయా సేవలు పొందేందుకు సంబంధిత సంస్థలకు ఆధార్‌ను స్వేచ్ఛగా ఇవ్వొచ్చని యూఐడీఏఐ తెలిపింది.

ఈ రెండు ట్వీట్లు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి.

ఆధార్‌లోని నా వివరాలు ఎంత వరకు భద్రం?

ఆధార్ ప్రైవసీ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది. లైసెన్స్ లేని యూజర్లకు ఆధార్ ఇవ్వొద్దు అని ప్రభుత్వం చెబుతోంది అంటే ప్రైవసీకి సంబంధించిన సమస్య ఉందనే అర్థం చేసుకోవాలి.

ఆధార్ ప్రైవసీ గురించి 2018లో ప్రశ్నలు లేవనెత్తినప్పుడు నాటి ట్రాయ్ చీఫ్ ఆర్ఎస్ శర్మ వాటిని ఖండించారు. తన ఆధార్ నెంబరు ట్విటర్ ద్వారా షేర్ చేసిన ఆయన, తనకు ఎవరు ఎలాంటి నష్టం చేయలేరంటూ చాలెంజ్ చేశారు. కానీ ఆ తరువాత ఆర్‌ఎస్ శర్మ వ్యక్తిగత వివరాలు అంటే మొబైల్ నెంబర్, ఇంటి చిరునామ, పుట్టిన రోజు వంటి వాటిని కొందరు ట్విటర్ యూజర్లు నాడు షేర్ చేశారు.

సోషల్ మీడియాలో ఆధార్ షేర్ చేయడం మంచిది కాదని ఫ్రాన్స్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ బాప్టిస్టే రాబర్ట్ నాడు సూచించారు. 'ఆధార్ నెంబరుతో మీ అడ్రెస్, పుట్టిన రోజు, రెండో మొబైల్ నెంబర్ వంటివి తెలుసుకున్నారు. కాబట్టి పబ్లిక్‌గా ఆధార్ నెంబర్ షేర్ చేయడం మంచిది కాదనే విషయం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటా.' అంటూ రాబర్ట్ ట్వీట్ చేశారు.

చట్ట ప్రకారం అనుమతి ఉన్న సంస్థలకే ఆధార్?

డేటా సెక్యూరిటీ మీద శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఈ ఘటనకు ముందు రోజే విడుదల చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఆధార్ యాక్ట్‌లో సవరణలు చేయడంపై కమిటీ చర్చించింది.

యూఐడీఏఐ ఆమోదించిన ప్రభుత్వ సంస్థలు, చట్ట ప్రకారం అనుమతులు పొందిన సంస్థలకు మాత్రమే ఆధార్‌ను అడిగే హక్కును ఇవ్వాలని కమిటీ సూచించింది.

మొత్తానికి ఎవరు లైసెన్స్ ఉన్న యూజర్? ఒక కంపెనీకి ఆధార్ డేటా పొందే లైసెన్స్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? అందుకున్న మార్గాలు ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)