దేశంలో కండోమ్‌ల వాడకం ఎందుకు పెరిగింది? - జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ -5) ప్రకారం, భారతదేశంలో గర్భనిరోధక సాధనాల వినియోగం పెరిగింది. వివిధ పద్ధతుల ద్వారా గర్భాన్ని నిరోధించడంలో 13.2% పెరుగుదల కనిపించగా, ఆధునిక పద్ధతుల ద్వారా గర్భనిరోధంలో 8.7% పెరుగుదల కనిపించింది.

ఇక స్త్రీలు వేసెక్టమీ ఆపరేషన్లు, కండోమ్‌ల వాడకం విషయంలో గత సర్వేతో పోల్చితే ఇవి సగటున 1.9శాతం, 3.9శాతం పెరిగాయి.

మరి ఈ గణాంకాలు ఏ చెబుతున్నాయి? కుటుంబ నియంత్రణలో మహిళల మీద భారం తగ్గిందా?

కండోమ్‌లపై అవగాహన బాగా పెరిగిందని కుటుంబ ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారు చెబుతున్నారు. అయితే, ఆపరేషన్లతో పోలిస్తే కండోమ్‌ల వాడకం ఇంకా తక్కువగానే ఉందని వారు అంటున్నారు.

కండోమ్‌ల వాడకం పెరిగింది

పంజాబ్, ఉత్తరాఖండ్, దిల్లీ, గోవా సహా, కొన్ని రాష్ట్రాల్లో కండోమ్ వాడకం సగటున 20శాతం కంటే ఎక్కువ పెరిగింది. అదే సమయంలో, నోటి మందులు, మాత్రలు తీసుకునే మహిళల సంఖ్య అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో పెరిగింది.

స్త్రీల ఆపరేషన్లతో పోలిస్తే కండోమ్‌ల వాడకం ఇప్పటికీ తక్కువేనని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా అభిప్రాయపడ్డారు.

"67% మంది మహిళలు స్టెరిలైజేషన్ చేయించుకుంటున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 169 కోట్ల అబార్షన్లు జరుగుతున్నాయని 2015 గణాంకాలు చెబుతున్నాయి. కండోమ్ మీద అవగాహన పెరిగినప్పటికీ కుటుంబ నియంత్రణ భారం ఇప్పటికీ మహిళలపైనే ఉంది'' అని ఆమె అన్నారు.

దక్షిణాది మహిళల్లో అవగాహన

మహిళా స్టెరిలైజేషన్ విషయంలో దక్షిణ భారతదేశంలోని మహిళలు ముందున్నట్లు ఈ సర్వేలో తేలింది.

''దక్షిణాదిలో జనాభా పరివర్తన చాలాకాలం కిందటే జరిగింది. జననాల రేటు, మరణాల రేటు, ఆర్ధికాభివృద్ధి, మహిళల్లో విద్యలాంటివి దీనిపై ప్రభావం చూపాయి'' అని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 నివేదిక రూపొందించిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్.కె. సింగ్ అన్నారు.

దక్షిణాదిలో చిన్న కుటుంబం అనే విధానాన్ని ఇప్పటికే అవలంబించారు. అయితే ఉత్తర, ఈశాన్య భారతదేశాలు ఇందులో చాలా వెనుకబడి ఉన్నాయి.

పిల్లల మధ్య ఎడాన్ని పాటించాలనుకునే వారు, తమ కుటుంబం ఇంకా సంపూర్ణం కాలేదని భావించేవారు కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సింగ్ అభిప్రాయపడ్డారు.

అలాగే, హెచ్‌ఐవీ ని నియంత్రించే ప్రాజెక్ట్‌లను ఈ సందర్భంలో ప్రస్తావించాలని ఆయన అన్నారు. ఇక మహిళలతో పోలిస్తే, ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు మగవాళ్లకు ఎక్కువగా అందుబాటులో ఉండవు.

తగ్గిన సంతానోత్పత్తి రేటు

భారతదేశంలో సంతానోత్పత్తి రేటు కూడా తగ్గిందని సర్వే గణాంకాలు చూపిస్తున్నాయి. ఆలస్యంగా వివాహం, గర్భ నిరోధక సాధనాలవంటివి సంతానోత్పత్తి రేటు మీద ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

"భారతదేశంలో, 16శాతం మంది వివాహిత స్త్రీలు పిల్లల్నికన్నాక వేసెక్టమీ చేయించుకున్నారు. అందులో 10శాతం మందికి మొదట కొడుకును, 6 శాతం మంది మొదట కూతుర్ని కన్నారు'' అని ఎస్.కె. సింగ్ వెల్లడించారు.

ఏదైనా జంట ఇతర పద్ధతులకు బదులుగా నేరుగా స్టెరిలైజేషన్ చేయాలని నిర్ణయించుకుంటే, వారు చిన్న కుటుంబాన్ని కోరుకుంటున్నారని అర్ధమని ఆయన వివరించారు.

అదే సమయంలో, 12వ తరగతి వరకు చదివిన మహిళల్లో సగటు సంతానోత్పత్తి రేటు 2.2 కాగా, చదువుకోని మహిళల్లో సగటు సంతానోత్పత్తి రేటు 3.7 అని పూనమ్ ముత్రేజా, ఎస్.కె.సింగ్‌ లిద్దరూ అభిప్రాయపడ్డారు.

జనాభా నియంత్రణకు కఠిన చర్యలు?

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జనాభా నియంత్రణపై ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ జనాభా నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ బిల్లులో అనేక నిబంధనలు ఏర్పాటు చేశారు. 'ఇద్దరు పిల్లల విధానం' అమలు పై చర్చ జరిగింది.

జనాభా పెరుగుదల రేటు స్థిరంగా ఉందని పూనమ్ ముత్రేజా అభిప్రాయపడ్డారు. అయితే, భారతదేశ జనాభాలో 70శాతం మంది యువకులేనన్న విషయం గుర్తించాలని కూడా ఆమె చెప్పారు. వీరంతా ఇద్దరు పిల్లల్ని కంటే జనాభా పెరుగుతుందని ఆమె అన్నారు.

ఏ రాష్ట్రమైనా పాలనకు అవసరమైన జనాభా విధానాన్ని తీసుకురావచ్చని, నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఎస్.కె. సింగ్ అన్నారు.

''ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజాప్రాతినిధ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాల నిలిపివేత వంటి కఠినమైన చర్యలు అవసరం లేదు. దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0 ఉంటే, అత్యధిక జనాభా కలిగిన యూపీలో అది 2.4 గా ఉంది. అదే బిహార్‌లో 3.0 రేటు ఉంది" అని ఆయన వెల్లడించారు.

జనాభా పెరుగుదలను కమ్యూనిటీ ఆధారంగా చూడవద్దని పూనమ్ ముత్రేజా అన్నారు.

"కేరళలో హిందువులు, ముస్లింల సంతానోత్పత్తి సమానంగా ఉంది. ఎందుకంటే అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, పరిపాలనలో మెరుగైన సేవలు అందుతున్నాయి. అదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లను పరిశీలిస్తే, అక్కడ కూడా సంతానోత్పత్తి రేటు సమానంగా కనిపిస్తుంది'' అని వెల్లడించారామె.

''ఆర్థిక, అక్షరాస్యతా దృక్కోణంలో చూస్తే, పేద హిందూ, ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు సమానంగా ఉంటుంది. కానీ ముస్లింలు మరీ పేదవారైతే ఆ రేటు పెరుగుతుంది'' అన్నారు ముత్రేజా.

బాలికల విద్య, మెరుగైన ఆరోగ్య సాధనాలు, మహిళా సాధికారత వంటి మెరుగైన కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)