లఖీంపుర్ ఖీరీ: ‘జీపుతో రైతులను తొక్కించిన వారినెందుకు అరెస్ట్ చేయరు’- ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్న

ఉత్తర్‌ప్రదేశ్ తికునియా ఘటనదిగా చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఈ వీడియోను ట్వీట్ చేశారు.

"నరేంద్ర మోదీ గారు.. మీ ప్రభుత్వం ఎలాంటి ఎఫ్ఐఆర్, ఆదేశాలు లేకుండానే 28 గంటలుగా నన్ను నిర్బంధంలో ఉంచింది. కానీ రైతులను జీపుతో తొక్కించిన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు?" అని ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్నించారు.

ఒక థార్ జీపు రోడ్డు మీదున్న వాళ్లను గుద్దుకుంటూ, వాళ్లపై నుంచి వేగంగా వెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తోంది. జీప్‌లో చాలా మంది కూర్చున్నట్లు కూడా వీడియోలో తెలుస్తోంది. జీప్ వెనుక ఒక ఫార్చునర్ కారు కూడా ఉంది.

ఈ వీడియో తికునియాలో తీసిందని చెబుతున్నారు. అయితే, బీబీసీ ఈ వీడియోను స్వయంగా ధ్రువీకరించలేదు.

మరోవైపు ఈ వీడియో తమ వాదనలను ధ్రువీకరిస్తోందని రైతులు చెబుతున్నారు.

అయితే పోలీసులు ఈ వీడియోను తమ దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంటుంది.

సోమవారం రాత్రి వాట్సాప్, ఫేస్‌బుక్ డౌన్ అవడం వల్ల ఈ వీడియో వైరల్ కాలేదు. కానీ ఉదయం ఈ వీడియో సోషల్ మీడియా అంతటా విస్తృతంగా షేర్ అవుతోంది.

లఖీంపుర్ ఖీరీలో ఇంటర్నెట్‌ సేవలు ఇప్పటికీ నిలిపివేసే ఉన్నాయి.

లఖింపూర్, బహ్రెయిచ్‌లో మృతిచెందిన రైతుల అంత్యక్రియలు

మంగళవారం లఖీంపుర్ పలియాలో 19 ఏళ్ల లవ్‌ప్రీత్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

బీబీసీ సోమవారం లవ్‌ప్రీత్ తండ్రి సత్‌పాల్ సింగ్‌తో మాట్లాడింది.

తన కొడుకు చదువుకోడానికి ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడని ఆయన చెప్పారు. లవ్‌ప్రీత్ లఖీంపుర్‌లోని ఐఈఎల్టీఎస్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు.

మరోవైపు 18 ఏళ్ల గుర్జిందర్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి నాన్‌పారా తీసుకెళ్లారు. గుర్జిందర్ సోదరి ఏడుస్తూ తమకు న్యాయం కావాలని కోరారు.

గుర్జిందర్ ఒక గురుద్వారాలో గ్రంథీగా ఉన్నారని, మతపరమైన పనులు చూసుకునేవారని ఆమె బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)