IceCream Idli: సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారిన ఇడ్లీ, ఇంతకీ ఇది ఎలా చేశారంటూ నెటిజన్ల ప్రశ్నలు

దక్షిణాదిలో చాలా సాధారణ వంటకమైన ఇడ్లీ చుట్టూ మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇడ్లీ కాలానుగుణంగా రాగి ఇడ్లీ, కొత్తిమీర ఇడ్లీ, మసాలా ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, మినీ ఇడ్లీ, తట్టె ఇడ్లీ, పనస ఆకుల ఇడ్లీ వంటి అనేక రూపాల్లో దొరుకుతోంది.

రుచులు మారినా రూపం మారనట్లు ఎన్ని వందల రకాల ఇడ్లీలు అందుబాటులోకి వచ్చినా ఇడ్లీ ఆకారం మాత్రం మారలేదు.

ఆవిరిపై ఉడికించి వండే ఇడ్లీలు గుండ్రని ఆకారంలో ఉంటాయి. అయితే, ఐస్ క్రీమ్ స్టిక్ ఆకారంలో తయారు చేసిన ఇడ్లీ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ ఫోటోపై ట్విటర్‌లో ఇడ్లీ ప్రియుల మధ్య వాగ్వాదం జరుగుతోంది.

ఇడ్లీని ఐస్‌క్రీమ్ స్టిక్ ఆకారంలో తయారుచేసి దానిని సాంబారులో ముంచినట్లుగా ఆ ఫొటోలో కనిపిస్తోంది.

దక్షిణాదిలో విరివిగా తినే ఇడ్లీని సృజనాత్మకంగా చూపడంపై కొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, కొంత మంది మాత్రం ఇడ్లీ ఆకారాన్ని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫోటో బెంగళూరులో తీసినట్లుగా తెలుస్తోంది.

పారిశ్రామిక వేత్త, మహీంద్ర & మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర కూడా ఈ ఫోటోను ట్వీట్ చేశారు.

సృజనాత్మకంగా ఇడ్లీని తయారు చేయడం పట్ల తమ అభిప్రాయాలను చెప్పమని ఆయన ఫాలోవర్లను అడుగుతూ, ఫోటోను ట్వీట్ చేశారు.

కొందరు ఈ ట్వీట్‌కు నేరుగా స్పందించారు.

కానీ, ఈ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అసలు ఇడ్లీ ఐస్‌క్రీమ్ స్టిక్‌కు ఎలా అతుక్కుందని ప్రశ్నిస్తూ, "కొత్త వంటకాల ఆవిష్కరణకు బెంగళూరు పర్యాయపదంలా ఉంటుంది" అని విశాల్ అనే ట్విటర్ యూజర్ స్పందించారు.

"ఇప్పటికే సృజనాత్మకత పేరుతో దోశ రూపాన్ని మార్చేశారు. ఇక ఇడ్లీని కూడా మార్చేద్దామనుకుంటున్నారు. దయ చేసి దీనిని వదిలిపెట్టండి" అంటూ ఆశిష్ కుమార్ అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.

"దీనిని సులభంగా సాంబారులో ముంచుకుని తినేయవచ్చు. చేతులు, స్పూన్, ఫోర్క్ వాడే పని లేదు" అని లెఫ్టినెంట్ హోరేషియో ట్వీట్ చేశారు.

కొబ్బరి చట్నీ, సాంబార్ తో కలిపి తినే ఇడ్లీ దక్షిణాదిలో ప్రముఖ వంటకం.

గత ఏడాది యూకేకి చెందిన ఒక వ్యక్తి ఇడ్లీని బోరింగ్ ఆహారం అని వ్యాఖ్యానించడం పట్ల కూడా ట్విటర్‌లో చాలా చర్చ నడిచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)