India vs England: నాలుగో టీ20లో భారత్ గెలుపు... సిరీస్ సమం

భారత్, ఇంగ్లండ్ జట్ల ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కీలకమైన నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు గెలిచింది. సిరీస్‌ను సమం చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో.. భారత జట్టు 8 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి సమానంగా నిలిచాయి. విజేతను చివరి మ్యాచ్ అయిన ఐదో టీ20 నిర్ణయించనుంది.

అంతకుముందు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇంగ్లండ్ జట్టులో ఎటువంటి మార్పులూ లేకుండా బరిలో దిగింది. భారత జట్టులో రెండు భారీ మార్పులు జరిగాయి. ఇషాన్ కిషన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను, యజువేంద్ర చాహల్ స్థానంలో రాహుల్ చహార్‌ను బరిలోకి దించారు.

భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. 186 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టును భారత బౌలర్లు ఆరంభంలోనే నియంత్రించారు.

మూడో ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ కీలకమైన జోస్ బట్లర్ (9) వికెట్ తీశాడు. అప్పటికి ఇంగ్లండ్ జట్టు పరుగులు కూడా తొమ్మిదే.

ఎనిమిదో ఓవర్‌లో ఇంగ్లండ్ జట్టు స్కోరు 60 పరుగుల వద్ద ఉండగా డావిడ్ మలన్‌కు గూగ్లీ వేసిన రాహుల్ చాహర్ అతడి వికెట్ తీశాడు. మలన్ 15 పరుగుల చేశాడు.

తొమ్మిదో ఓవర్‌లో జేసన్ రాయ్ వికెట్‌ను హార్దిక్ పాండ్యా పడగొట్టాడు. 40 పరుగులు చేసిన రాయ్ సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి ఇంగ్లండ్ జట్టు స్కోరు మూడు వికెట్లకు 66 పరుగులు.

10 ఓవర్లలో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

ఆ తర్వాత బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో జంట స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి ఐదు ఓవర్లలో 60 పరుగులు జోడించారు.

అయితే 15వ ఓవర్‌లో ఇంగ్లండ్ స్కోరు 131 దగ్గర ఉన్నపుడు బెయిర్‌స్టో (25) వికెట్‌ను చాహర్ పడగొట్టాడు.

ప్రమాదకరంగా పరిణమించిన బెన్ స్టోక్స్‌ను శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతికి ఇంటికి పంపించాడు. అదే వరుసలో రెండో బంతికి ఇయాన్ మోర్గన్‌ వికెట్ కూడా శర్దూల్ పడగొట్టాడు.

స్టోక్స్ 23 బంతుల్లో 46 పరుగుల చేశాడు. మోర్గన్ 4 పరుగులు చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ జట్టు స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు.

18వ ఓవర్‌లో శామ్ కరన్ (3 పరుగులు) వికెట్‌ను పాండ్యా కూల్చాడు. చివరి ఓవర్‌లో క్రిస్ జోర్డన్ (12) వికెట్‌ను శార్దూల్ తీశాడు.

అప్పటికి ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

భారత జట్టు 8 పరుగుల తేడాతో గెలిచింది.

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, హార్దిక్ పాండ్యా 2, రాహుల్ చాహర్ 2 చొప్పున వికెట్లు తీశారు.

నిరాస పరచిచన రోహిత్, రాహుల్ కోహ్లీ...

అంకుముందు భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. ఇది T20లో అతడి తొలి అర్థ సెంచరీ.

రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ ఎక్కువ సేపు భాగస్వామ్యాన్ని కొనసాగించలేకపోయారు.

నాలుగో ఓవర్‌లో జట్టు స్కోరు 21 పరుగులుగా ఉన్నపుడు రోహిత్ శర్మ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

జట్టు స్కోరు 63 పరుగుల వద్ద కె.ఎల్.రాహుల్ కూడా బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

రోహిత్ శర్మ 12 పరుగులు, కె.ఎల్.రాహుల్ 14 పరుగులు చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.

మరోవైపు సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతూ అర్థ సెంచరీ చేశాడు. కాసేపటికే 14వ ఓవర్‌లో శామ్ కిరన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 110 పరుగులు. సూర్యకుమార్ 57 పరుగులు చేశాడు.

జట్టు స్కోరు 144 పరుగులకు చేరుకున్నాక 17వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా (11 పరుగులు) అవుటయ్యాడు.

చివరి ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్ (37), వాషింగ్టన్ సుందర్ (4) వికెట్లు పడ్డాయి.

ఇంగ్లండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)