తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకరరెడ్డి.. విశాఖ మేయర్‌గా హరి వెంకట కుమారి

ఉత్కంఠ కలిగించిన అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీ చైర్మన్‌, వైస్‌-చైర్‌ పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ ముగిసింది.

ఈ పురపాలకసంఘంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి చైర్మన్‌గా, పి.సరస్వతి వైస్‌ చైర్‌ పర్సన్‌గా ఎన్నికయ్యారు.

20-18 తేడాతో తెలుగుదేశం పార్టీ తాడిపత్రి మున్సిపాల్టీని దక్కించుకుంది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి మూడోసారి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

మరోవైపు గ్రేటర్‌ విశాఖ మేయర్‌గా విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన గొలగాని వెంకట హరి కుమారి ఎన్నికయ్యారు.

తాడిపత్రిలో రెండు పార్టీల పట్టుదల

తాడిపత్రి మున్సిపాల్టీ సుదీర్ఘ కాలంగా జేసీ బ్రదర్స్‌కు అడ్డాగా ఉంది. 1983 నుంచి రాజకీయంగా ఆ కుటుంబానిదే హవా. జేసీ దివాకర్ రెడ్డి 2009 వరకు వరుసగా ఏడు సార్లు కాంగ్రెస్ నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనేక సందర్భాల్లో గట్టిపోటీ ఎదురైనా ఆయన గట్టెక్కారు.

రాష్ట్ర విభజన తర్వాత జేసీ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అనంతపురం నుంచి పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు.

తాజా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కూటమికే ఆధిక్యం కట్టబెట్టారు. టీడీపీ 18, సీపీఐ ఒక్క సీటు గెలుచుకోగా, టీడీపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి మరో వార్డులో గెలిచారు. స్వతంత్ర కౌన్సిలర్‌, సీపీఐ కౌన్సిలర్‌ టీడీపీకి మద్దతు పలకడంతో టీడీపీ బలం 20కి చేరింది.

ఇక వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోవడంతో వైసీపీ బలం 18కి చేరింది.

ఇరు పార్టీలు మున్సిపాల్టీని దక్కించుకునేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేశాయి. చివరకు టీడీపీని విజయం వరించింది.

విశాఖకు మహిళా మేయర్‌

విశాఖలో మేయర్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరకు గొలగాని హరి వెంకట కుమారి మేయర్‌గా, జియాని శ్రీధర్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

మేయర్ పదవికి వెంకటకుమారి తప్ప ఇంకెవరూ పోటీపడలేదు.

విశాఖ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని మేయర్‌ వెంకట హరి కుమారి అన్నారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

2012తో ముగిసిన మహా విశాఖ నగర పాలక సంస్థలో 9 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ పాలక వర్గం ఏర్పాటైంది.

విశాఖ మున్సిపాల్టీ చరిత్ర

1858లో మున్సిపల్ వలంటరీ అసోసియషన్, ఆ తర్వాత మున్పిపల్ కమిషన్, ఆపై మున్సిపల్ కౌన్సిల్‌గా మారిన విశాఖ 1979లో కార్పోరేషన్ అయ్యింది. 1981లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎం.ఎస్.ఎన్. రెడ్డి పరోక్ష ఎన్నిక పద్ధతిలో మేయర్ అయ్యారు.

ఆ తర్వాత 1987లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో డీవీ సుబ్బారావు మేయర్‌గా ఎన్నికయ్యారు.1992 నుంచి 1995 వరకు మళ్లీ ప్రత్యేక అధికారే పరిపాలన సాగించారు.

1995లో జరిగిన ఎన్నికల్లో సబ్బం హరి మేయరై 2000 సంవత్సరం వరకు ఆ పదవిలో కొనసాగారు. 2000లో జీవీఎంసీ ఎన్నికల్లో రాజాన రమణి మేయర్‌ అయ్యారు. తర్వాత మళ్లీ 2005 నుంచి 2007 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది.

కొన్ని పంచాయితీలను విలీనం చేసి 2005 నవంబర్ 1వ తేదీ నుంచి విశాఖ మున్సిపాలిటీని 72 వార్డులతో గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా (జీవీఎంసీ) మార్చారు. 2007లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. 2012లో పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలోనే ఉంది. ప్రస్తుతం జీవీఎసీం పరిధిలోకి అనకాపల్లి, భీమునిపట్నం పురపాలక సంఘాలతో పాటు కొన్ని పంచాయతీలను కలిపారు.

50 వార్డులతో మొదలైన విశాఖ కార్పొరేషన్‌ ప్రస్థానం 8 జోన్లు, 98 వార్డులకు చేరింది. ప్రస్తుతం 25 లక్షలకు పైగా ఉన్న జనాభాలో 18 లక్షలకుపైగా ఓటర్లున్నారు.

వైసీపీ ఖాతాలోకి మైదుకూరు, నర్సీపట్నం మున్సిపాల్టీలు

నర్సీపట్నం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా వైసీపీకి చెందిన ఆదిలక్ష్మి ఎన్నిక కాగా, వైస్‌చైర్మన్‌గా గొలుసు నరసింహ మూర్తి ఎన్నికయ్యారు.

మైదుకూరు మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. ఎం.చంద్ర చైర్మన్‌గా, షేక్‌ మహబూబ్‌ షరీఫ్‌ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. జనసేన, టీడీపీ తరఫున ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లు ఎన్నిక కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)