సుప్రీంకోర్టు: ‘ప్రశాంత్ భూషణ్‌ దోషి, ఆయనది కోర్టు ధిక్కరణే.. శిక్షపై ఈనెల 20న తదుపరి విచారణ’

కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం దోషిగా ప్రకటించింది.

గతంలో ట్విటర్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, ఆయనకు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్‌కు శిక్షపై ఈ నెల 20న వాదనలు వింటామని చెప్పింది.

ఇది కోర్టు ధిక్కరణకు సంబంధించిన తీవ్రమైన విషయం అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు జరిగిన విచారణలో న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

కోర్టు ధిర్కరణ చట్టం 1971 ప్రకారం ప్రశాంత్ భూషణ్‌కు గరిష్ఠంగా ఆరు నెలలు జైలు శిక్ష పడొచ్చు. ఈ చట్టం ప్రకారం ఒకవేళ దోషి క్షమాపణలు చెబితే న్యాయస్థానం ఎలాంటి శిక్ష లేకుండా వదిలిపెట్టొచ్చు.

వివాదం ఏంటి?

ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు వివాదాస్పద ట్వీట్లు న్యాయ వ్యవస్థను అగౌరవపర్చేలా ఉన్నాయని జులై 22వ తేదీన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసు జారీ చేసింది.

ఆలోచించే హక్కు (ఫ్రీడమ్ ఆఫ్ థాట్) కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని ప్రశాంత్ భూషణ్ సమాధానం ఇచ్చారు.

దీనిపై విచారణ కొనసాగింది. ఆ ట్వీట్లు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయని, వాటిని పోస్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్ దోషి అని ఈరోజు సుప్రీంకోర్టు తేల్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఒక మోటారు సైకిల్‌పై ఉన్న ఫొటోను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ భూషణ్ తన అఫిడవిట్‌లో స్పందిస్తూ.. మూడు నెలలకు పైగా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని, ఈ నేపథ్యంలో విచారంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం వృధా అనే వ్యాఖ్యకు వివరణ ఇస్తూ.. ‘అలాంటి ఆలోచనలను బహిరంగంగా వ్యక్తీకరించడం ఇబ్బందిరకంగా అనిపించొచ్చు కానీ అదే వాస్తవం, దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించకూడదు’ అని తెలిపారు.

పెండింగ్‌లో మరో కేసు

ప్రశాంత్ భూషణ్‌పై మరొక కోర్టు ధిక్కరణ కేసుపై ఆగస్టు 17వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది.

2009లో ఈ కేసు నమోదైంది.

ఆ ఏడాది తెహల్కా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. అప్పటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన 16 మంది అవినీతిపరులని ఆరోపించారు.

అయితే, తాను మాట్లాడింది ఆర్థికపరమైన అవినీతి గురించి కాదని, వారి నైతిక ప్రవర్తన సరిగా లేదన్నదే తన ఉద్దేశమని ప్రశాంత్ భూషణ్ తర్వాత సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. లిఖితపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, సుప్రీంకోర్టు ఆ క్షమాపణలను స్వీకరించలేదు.

‘భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’

ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రముఖ రచయిత, చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందించారు.

‘‘ఈ చట్టం ద్వారా సుప్రీంకోర్టు తనను తానే ఓడించుకుంది. గణతంత్రాన్నీ ఓడించింది. భారత ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)