అయోధ్యలో రామమందిరానికి భూమిపూజ: రాముడు అందరివాడు - ప్రధాని మోదీ

అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం పూర్తయింది.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ మందిరానికి భూమిపూజ చేసే అవకాశం కల్పించిన రామ మందిర్ ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపారు.

''రాముడు పురుషోత్తముడు, ప్రతి ఒక్కరు ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది

తెలుగులో, తమిళంలో, మలయాళం, బెంగాలీ, కాశ్మీరీ, పంజాబీలతోపాటు అనేక భాషలలో రామాయణాలు వెలువడ్డాయి. భిన్నత్వంలో ఏకత్వానికి శ్రీరాముడు ప్రతీక.

మనం ఏదైనా ఒకపని చేయాలనుకుంటే రాముడి తలచుకుంటాం, ఆయన నుంచి ప్రేరణ పొందుతాం. అదే రాముడి విశిష్టత.

పరస్పర ప్రేమ, సోదరభావంతో అందరూ కలిసి శ్రీరాముడి మందిరాన్ని ఇటుకా ఇటుకా పేర్చి నిర్మించాలి

రాముడి మందిరం భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది, మానవత్వానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది

రాముడి కాలంలో సర్వజన సామరస్యం వెల్లి విరిసింది. దాన్ని నేడూ కొనసాగించాల్సిన అవసరం ఉంది

రాముడి రూపాన్ని మన హృదయాలను నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన మనలోనే ఉన్నారు'' అన్నారు.

‘‘రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు భారతీయులంతా శాంతియుతంగా, గౌరవంగా ప్రవర్తించారు.

నేడు భూమి పూజ రోజున కూడా అదే మర్యాదను పాటిస్తున్నారు. రామమందిరం కోట్లమంది ప్రజల సామూహిక శక్తికి చిహ్నంగా మారుతుంది, భవిష్యత్‌ తరాలకు ప్రేరణ అవుతుంది

రామ్‌లల్లా దశాబ్దాలుగా గుడారాల్లో నివసించారు. ఇప్పుడు విముక్తి పొందారు. కరోనా కాలంలో దేశప్రజలంతా సహనంతో వ్యవహరించాలి. మాస్కులు వేసుకుని, సామాజిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండాలి’’ అన్నారు.

అయితే, ప్రధాని హోదాలో మోదీ ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒక మతానికి సంబంధించిన కార్యక్రమంలో ఎలా పాల్గొంటారన్న ప్రశ్నలు ఇప్పటికే వినిపించగా తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా మోదీపై విమర్శలు చేశారు.

రాముడికి ద్వేషం లేదు: రాహుల్ గాంధీ

భూమి పూజ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, "రాముడిపై అభిమానం ఉన్నవారు ఎప్పుడూ ద్వేషభావంతో ఉండరు’’ అన్నారు.

రాముడు దయాగుణం ఉన్నవాడని.. ఎన్నడూ ఎవరినీ ద్వేషించడని.. అలాగే ఎవరికీ అన్యాయం చేయడని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయోధ్యలో భూమిపూజ నిర్వహించడానికి ముందు ఎంఐఐం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.

బాబ్రీ మసీదు ఉండేది.. ఉంటుంది కూడా అంటూ ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు శివసేన కూడా బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న కరసేవకులను మర్చిపోయినవారు రామద్రోహులేనని వ్యాఖ్యానించింది.

నక్షత్రాల ఆకారంలోని వెండి ఇటుకలతో భూమిపూజ

కాగా భూమి పూజ కోసం నక్షత్ర ఆకారంలో ఉన్న అయిదు వెండి ఇటుకలను ఉపయోగించారు.

హరిద్వార్ నుంచి గంగాజలం, దేశంలోని ఇతర నదుల నుంచి నీటిని తెచ్చి ఈ పూజలలో వినియోగించారు.

భూమి పూజ సందర్భంగా అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

పూజా కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు ప్రధాని మోదీ అయోధ్య చేరుకున్న వెంటనే స్థానికంగా ఉన్న హనుమాన్ గర్హీ ఆలయంలో పూజలు చేశారు.

అనంతరం రామ జన్మభూమి స్థలానికి చేరుకుని రామ్‌లల్లా విగ్రహం ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు.

ఆ తర్వాత హారతి ఇచ్చి, ప్రదక్షిణం చేశారు. అక్కడ పారిజాత మొక్కను నాటారు.

భూమి పూజ సందర్భంగా అయోధ్యలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే రామమందిర భూమి పూజ జరిగే చోటుకు వెళ్లే మార్గంలోని దుకాణాలన్నీ పూల అలంకరణల్లో కనపించాయి.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఈ ట్రస్టును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ ట్రస్టుతోపాటు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా రోజులుగా భూమి పూజ కోసం ఏర్పాట్లలో నిమగ్నమైంది.

మంగళవారం ఉదయం హనుమాన్ గఢీలో పూజతో ఈ కార్యక్రమం మొదలైంది.

అయోధ్య నగరిలోని చాలా మందిరాల్లో రామాయణం వినిపిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో దీపోత్సవం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్థానిక మందిరాల్లో సరయూ నది మట్టితో చేసిన దివ్వెల్లో దీపాలు వెలిగిస్తున్నారు.

ప్రజలు మాత్రం ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం, కార్యక్రమ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

అయోధ్య నగరిలోని మందిరాలు రంగురంగుల కాంతులతో కనిపించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)