మోదీ ఏడాది పాలన: "కఠిన నిర్ణయాలు తీసుకున్నారు; ఏపీకి ప్రత్యేక హోదా ఏదీ"

భారతదేశ ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వ ఏడాది పాలనపై అభిప్రాయం తెలపాలని 'మాటకుమాట' చర్చలో పాఠకులను ఫేస్‌బుక్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగు కోరగా, యూజర్ల నుంచి కామెంట్ల రూపంలో విశేష స్పందన వచ్చింది. స్పందన మిశ్రమంగా ఉంది.

మోదీ ప్రభుత్వ పనితీరును మెచ్చుకొంటూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు, పాలనలో తమకు నచ్చిన, నచ్చని అంశాలను ప్రస్తావిస్తూ మరికొందరు తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. చాలా మంది యూజర్లు భిన్నాభిప్రాయం ఉన్నవారితో విభేదిస్తూ తమ వాదనలు వినిపించారు. చర్చలో పాల్గొన్నారు.

యూజర్ల అభిప్రాయాలు, వ్యాఖ్యల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

అవినీతిని మోదీ నిర్మూలించారని, అయితే ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగం అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సైన్స్, టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఆయన పనితీరు పేలవంగా ఉందని కిశోర్ వనమాల అనే యూజర్ వ్యాఖ్యానించారు.

ఇస్లామిక్ తీవ్రవాదంతో మోదీ ఒంటరి పోరాటం చేస్తున్నారని నారాయణన్ అనే యూజర్ వ్యాఖ్యానించారు.

ఏదిఏమైనా ప్రజలు తమకే మద్దతిస్తారని కాంగ్రెస్ పార్టీ గతంలో భావించిందని, తన ఈ తప్పును 2014లో గుర్తించిందని రామ మోహన రావు అనే యూజర్ చెప్పారు. సామాన్యుల అవసరాల పట్ల మోదీకి ఏ మాత్రం పట్టింపు లేదని, తన వాక్చాతుర్యం, హిందూ సెంటిమెంట్‌తో ఆయన ఎల్లకాలం ఎన్నికల్లో గెలవలేరని చెప్పారు. విపక్షాల్లో ఐక్యత లేకపోవడం మోదీ అదృష్టమని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదనే అర్థంలో షేక్ హస్సేన్ అనే యూజర్ చర్చలో భాగంగా ప్రశ్నించారు.

వలస కార్మికుల కష్టాలు

మోదీ కఠినమైన, చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారని, ఇలాంటి నిర్ణయాలు మరెవరూ తీసుకోలేరని గోపి అని యూజర్ అభిప్రాయపడ్డారు. మోదీ ప్రధానిగా ఉండటం వల్లే భారత్‌లో కోవిడ్19 మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు.

1947లో దేశ విభజన సమయంలో అప్పటి ప్రజలు ఎంతో మంది పిల్లాజెల్లను వెంటబెట్టుకొని నడుస్తూ సరిహద్దులు దాటడాన్ని, గత రెండు నెలలుగా కరోనావైరస్-లాక్‌డౌన్ కారణంగా రవాణా సదుపాయాల్లేక వలస కార్మికులు నడుస్తూ సొంతూళ్లకు వెళ్తుండటాన్ని పోలుస్తూ కొందరు మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఆర్టికల్ 370

మోదీ ప్రభుత్వ పనితీరు అద్భుతమని కుమార్ బాబు అనే యూజర్ అభిప్రాయపడుతూ- ఈ ఏడాది కాలంలో జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని నిర్వీర్యం చేయడం ఒక గొప్ప విజయమని చెప్పారు.

ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడం లాంటి గొప్ప చర్యలు తీసుకొన్నారని, అంతర్జాతీయ సంబంధాలను బాగా నెరపుతున్నారని, మోదీ ఒక అంతర్జాతీయ నాయకుడిగా అవతరించారని లలితేశ్ బండారు అనే మరో యూజర్ అభిప్రాయపడ్డారు. అయితే ఆర్థిక వృద్ధిరేటు పేలవంగా ఉందన్నారు.

ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయడంతో సామాన్య ప్రజలకు ఒరిగేదేముందని విశ్వ వీక్షణం అనే పేరుతో ఉన్న యూజర్ ప్రశ్నించారు.

హామీలు

'గుజరాత్ మోడల్' చూపించి దేశాన్ని మోదీ నిలువునా ముంచారని సలీమ్ నియాజ్ రజ్వీ అనే యూజర్ ఆరోపించారు.

మోదీ పాలన బాగుందని, మూడోసారి కూడా ఆయన్ను ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకొంటున్నారని లక్ష్మినారాయణ అనే యూజర్ చెప్పారు.

మోదీ పాలన ఫర్వాలేదని నరేంద్ర కుమార్ బెహరా అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

మోదీ 2.0 పాలన అద్భుతంగా ఉందని యూజర్ శశి భూషణ్ అభిప్రాయపడ్డారు. హిందుస్థాన్ సంక్షేమానికి మోదీ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకొంటున్నామని చెప్పారు. మోదీ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని, ప్రతి అంశంలో విఫలమైందని, ఇండియాకు కొత్త నాయకత్వం అవసరమని మధుబాబు వ్యాఖ్యానించారు.

మంత్రివర్గ కూర్పు

మోదీ మంత్రివర్గంలో సురేష్ ప్రభు, సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్ లేని లోటు కనిపిస్తోందని యువర్స్ చందు అనే పేరుతో ఉన్న ఓ యూజర్ అభిప్రాయపడ్డారు. మోదీ పాలనలో అంతగా జరిగిందేమీ లేదని, ఇప్పుడు మరింత అధ్వానంగా తయారవుతోందని విమర్శించారు.

నల్లధనం

2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో- తాము అధికారంలోకి వస్తే విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామన్న మోదీ హామీని ప్రస్తావిస్తూ కొందరు యూజర్లు విమర్శలు చేశారు. నల్లధనాన్ని భారత్‌కు రప్పించే విషయంలో ఆరేళ్లైనా మోదీ నుంచి సమాధానం లేదని నూర్ మహమ్మద్ అనే యూజర్ విమర్శించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)