విజయవాడలో 233 కరోనా కేసులు.. అందులో సగం ‘పేకాట, తంబోలా వల్ల వచ్చినవే’

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లాక్ డౌన్ సందర్భంగా కొందరు కాలక్షేపం కోసం ఆడిన చిన్న చిన్న ఆటలు ఎంతో మందిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. సరదాగా ఆడే పేకాట, హౌసీలు పక్కిళ్ల వారితో కూడా ఆడడంతో కరోనా వ్యాపించింది. విజయవాడ నగరంలో ఇలా వైరస్ సోకిన వారు 100 మంది పైనే ఉన్నారని తెలుస్తోంది.

విజయవాడ కృష్ణలంకకు చెందిన ఒక వ్యక్తి వృత్తి రీత్యా లారీ డ్రైవర్. అతను భీమవరం నుంచి చేపల లోడ్ ను కలకత్తా తీసుకువెళ్లి అక్కడి నుంచి కాకినాడ వచ్చి, తిరిగి కాకినాడ నుంచి ఆయిల్ ను ఒక రాయలసీమ పట్టణానికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి విజయవాడ వచ్చాడు. లాక్ డౌన్ కావడంతో ఇంట్లో ఉంటూనే, కాలనీలోని చుట్టుపక్కల వారిని తమ ఇంటికి పిలిచి వారితో సరదాగా కాలక్షేపం కోసం పేకాట ఆడేవారు.

ఆయన భార్య కూడా చుట్టుపక్కల మహిళలను తన ఇంటికి పిలిచి వారితో హౌసీ (తంబోలా) ఆడేవారు. లాక్ డౌన్ లో ఈ కుటుంబం వల్ల ఆ వీధి మొత్తానికి కాలక్షేపం అయిపోంది. దీనికితోడు అదే కాలనీలో మరో చివర, మరో వ్యక్తి, లారీ క్లీనర్ ఉంటారు. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా అందరితో కలసి కాలక్షేపం చేశారు.

కాగా, ఒక రోజు లారీ డ్రైవర్ గా ఉన్న వ్యక్తికి తుమ్ములు, దగ్గు ఉండడంతో వాలంటీరు ద్వారా పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా పాజిటివ్ వచ్చింది. క్రమంగా వార్త చుట్టపక్కల వారికి తెలిసింది. అతనితో కలసి లాక్ డౌన్ ఎంజాయ్ చేసిన విషయం వారికి అప్పుడు గుర్తొచ్చింది. వారంతా స్వచ్ఛందంగా పరీక్షల కోసం ముందుకు వచ్చారు. విషయం వాలంటీరుకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగారు అధికారులు. సదరు వ్యక్తిని కలసిన కుటుంబాల నుంచి ఒక్కొక్కరి చొప్పున పరీక్షలు చేశారు. కొన్ని పాజిటివ్ లు వచ్చాయి. దీంతో ఆ జంటను కలిసిన వారందరినీ పరీక్షలు చేశారు.

ఈ ముగ్గురి కాలక్షేపం ఫలితం, మొత్తం 56 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

వారి కుటుంబ సభ్యులు సుమారు 200 మందిని క్వారంటైన్లో పెట్టారు.

అతని మీద పోలీసు కేసు పెట్టారు.

ఇక విజయవాడలోనే మరో ఘటన జరిగింది. ఇక్కడ కాలక్షేపం కోసం ఆటలేమీ ఆడలేదు కానీ, నిర్లక్ష్యంతో విదేశీ ప్రయాణాన్ని దాచారు ఒక వ్యక్తి.

దుబాయ్ లో హోటల్లో పనిచేసే ఒక వ్యక్తి అక్కడి నుంచి శ్రీలంక, చెన్నైల మీదుగా విజయవాడలోని ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చింది లాక్ డౌన్ కంటే ముందు మార్చి రెండో వారంలో. తన విదేశీ ప్రయాణ వివరాలు చెప్పలేదు. అంతేకాదు, ఆ కుటుంబానికి మాచవరం పరిధిలోని కార్మిక నగర్లో ఒక హోటల్ ఉంది. అందులో పనిచేయడం మొదలుపెట్టాడు. చిన్న హోటల్. ఇరుకైన ప్రదేశం.

ఇతని వల్ల 30 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆ హోటల్లో అతనితో పనిచేసిన వారు, కుటుంబ సభ్యులు, అక్కడ చనువుగా మెలిగిన వారు.. చాలా మంది బాధితులున్నారు.

విజయవాడకు చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పిన సమాచారం ప్రకారం, విజయవాడ మొత్తం కేసుల్లో ఈ ముగ్గురి వల్లే వందకు పైగా పాజిటివ్ లు ఉంటాయి. ప్రస్తుతానికి విజయవాడ పోలీసులు, సరైన కారణం లేకుండా రోడ్డుపై కనిపించిన వారందర్నీ అంబులెన్సులో క్వారంటైన్ కి పంపేస్తున్నారు. ఇప్పటి వరకూ 6,500 టూవీలర్లు సీజ్ చేశారు. ''చిన్న చిన్న చిల్లర కారణాలు చెప్పి రోడ్డు మీదకు వస్తున్నారు. అలాంటి కారణాలతో వచ్చిన వాళ్లందరినీ క్వారంటైన్లో వేసేస్తున్నాం. లేకపోతే మాట వినడం లేదు. ఏదో కార్టూన్లో రాసినట్టు లాఠీలతో కొట్టారు ఆయింట్మెంట్ కోసం వెళ్తున్నాం.. ఇలా ఉంటున్నాయి వారు చెప్పే కారణాలు..'' అని చెప్పుకొచ్చారు ఆ అధికారి.

మే 5వ తేదీ మంగళవారం నాటికి విజయవాడ నగరంలో మొత్తం కేసుల సంఖ్య 233. దేశంలో కరోనావైరస్ కేసులు నమోదైన 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విజయవాడ కంటే తక్కువ కేసులు ఉన్నాయి.

ఇదే తరహాలో తెలంగాణలోని సూర్యాపేటలో కూడా ఒక మహిళ అష్టా చెమ్మా ఆడడంతో ఆమె ద్వారా కొందరికి కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. అయితే ఇది పూర్తిగా తప్పని జిల్లా అధికారులు చెప్పారు. ''అసలు అలాంటిది జరగలేదు. ఎక్కడాలేదు. ఎవరో కావాలని పుట్టించారు. కొన్ని మీడియా సంస్థలు రాసేస్తున్నాయి. అంతకుమించి, ఇలా అష్టా చెమ్మా ఆడడం ద్వారా అయితే ఎవరికీ కరోనా రాలేదు'' అని బీబీసీతో చెప్పారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కృష్ణా రెడ్డి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)