CAA - NRC: తమిళనాడులో ముగ్గులతో నిరసనలు.. స్టాలిన్ నివాసం నుంచి కనిమోళి నివాసం వరకు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్ఆర్‌సీ)లు వద్దంటూ నలుగురు మహిళలు నిన్న చెన్నైలో ముగ్గులతో తమ నిరసన తెలిపారు.

బీసెంట్‌ నగర్‌లోని ఎలిటోస్ బీచ్ ప్రాంతంలో వాళ్లు ఈ ముగ్గులు వేశారు. 'సీఏఏ వద్దు.. ఎన్ఆర్‌సీ వద్దు' అంటూ వాటిలో నినాదాలు రాశారు.

దాంతో పోలీసులు నలుగురు మహిళలతో పాటు వారికి సాయం చేసిన ఇద్దరు లాయర్లు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని, గంటన్నర తర్వాత వారిని విడుదల చేశారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీలను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా సోమవారం ఉదయం నుంచి ముగ్గులతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

'సీఏఏ వద్దు.. ఎన్ఆర్‌సీ వద్దు' అనే నినాదాలతో ముగ్గులు వేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ముగ్గులతో నిరసన తెలపడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.

డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ నివాసం ముందు సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వద్దంటూ ముగ్గులు వేశారు. ఆయన ఈ ఫొటోలను తన ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ ముగ్గులో 'సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వద్దు' అని తమిళంలో నినాదాలు రాసి ఉన్నాయి.

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కరుణానిధి ఇంటి ముందు కూడా ఇలాగే ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేశారు.

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వద్దంటూ తమ ఇంటి ముందు వేసిన ముగ్గును ఎంపీ కనిమోళి తన ట్విటర్‌లో పోస్టు చేశారు.

వీళ్లతో పాటు చాలామంది డీఎంకే కార్యకర్తలు, సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్న వాళ్లు ఇలాగే తమ ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

సోమవారం ఉదయం ట్విటర్‌ తమిళనాడు ట్రెండ్స్‌లో 'డీఎంకేకోలంప్రొటెస్ట్' హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.

ఈ విషయంలో గెలిచినా.. ఓడినా పోరాటం మాత్రం ఆపకూడదని దట్ నిల్ అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

'వద్దు అంటే వద్దు అనే అర్థం' అంటూ మణి యాత్ర అనే ట్విటర్ యూజర్ సీఏఏ-ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా వేసిన ముగ్గులను ట్విటర్‌లో షేర్ చేశారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీలను రద్దు చేయడంతో పాటు నలుగురు మహిళలు సహా ఏడుగురిపై పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోవాలని స్టాలిన్ సహా కొందరు డీఎంకే నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, సీఏఏ-ఎన్‌ఆర్‌సీలకు అనుకూలంగా చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ పార్టీ మద్దతుదార్లు ట్వీట్లు చేస్తున్నారు. 'ఇండియా సపోర్ట్స్ సీఏఏ' అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.

చారిత్రక తప్పిదాన్ని సరిచేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు అంటూ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ట్వీట్ చేశారు.

సీఏఏ-ఎన్‌ఆర్‌సీలకు అనుకూలంగా ఒంగోలులో చేపట్టిన ర్యాలీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు పాల్గొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం ప్రతిఒక్క మైనారిటీల హక్కులను కాపాడుతుందని, అందరూ దీనికి మద్దతు ఇవ్వాలని అరుణ్ డి శంకర్ మూర్తి అనే యూజర్ ట్వీట్ చేశారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)