You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీర్కు అవసరమైతే స్వయంగా నేనే వెళ్తా - భారత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి
జమ్మూకశ్మీర్లో తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
శ్రీనగర్, బారాముల్లా, అనంత్నాగ్, జమ్మూలకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్కు అనుమతి కూడా మంజూరు చేసింది. అయితే, ఆ ప్రాంతాల్లో ఆజాద్ సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని, బహిరంగ ప్రసంగాలు చేయకూడదని నిర్దేశించింది.
ప్రజలకు ఏ ఇబ్బందులూ లేకుండా స్కూళ్లు, హాస్పిటళ్లు సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచనలు చేసింది.
అవసరమైతే స్వయంగా తానే జమ్మూకశ్మీర్కు వెళ్తానని భారత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి అన్నారు.
జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370కి కేంద్రం చేపట్టిన సవరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ పిటిషన్లపై సెప్టెంబర్ ముగిసేలోగా స్పందనను తెలియజేయాలని కేంద్రానికి, జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేంద్రానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.
ఎండీఎంకే నాయకుడు వైగో ఈ పిటిషన్ను వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 111వ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫరూఖ్ అబ్దుల్లా చెన్నై రావాల్సి ఉందని, ఆయన్ను సంప్రదించలేకపోతున్నామని ఆయన కోర్టు ముందు పేర్కొన్నారు.
జర్నలిస్టు అనురాధా భసీన్ తరఫున ఆమె న్యాయవాది బృందా గ్రోవర్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. కశ్మీర్లో ఆంక్షలు మొదలై 43 రోజులు గడిచాయని, ఇంకా తన క్లయింట్ను నిర్బంధంలో ఉంచడం చట్టవిరుద్ధమని ఆమె వాదించారు.
ఏ చట్టం కింద ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించిందో తెలుసుకోవాలనుకుంటున్నానని బృందా గ్రోవర్ కోర్టును అభ్యర్థించారు.
మీడియాకు ఏ ఆటంకమూ లేకుండా ల్యాండ్లైన్, ఇతర సమాచార ప్రసార సేవలు అందుబాటులోనే ఉన్నాయని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు.
జమ్మూకశ్మీర్లో చాలా దినపత్రికలు, టీవీ ఛానెళ్లు యథావిధిగా నడుస్తున్నాయని ఆయన వివరించారు.
ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో 5.5 లక్షల మంది ఔట్ పేషెంట్ సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్లోని 92% మేర ప్రాంతంలో ఇప్పుడు ఎలాంటి ఆంక్షలూ లేవని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు.
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ఆగస్టు 5న భారత ప్రభుత్వం సవరించింది. అనంతరం ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. ఫోన్, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది.
''ఇప్పుడు 92% ప్రాంతంలో ఆంక్షలేవీ లేవు. ల్యాండ్ లైన్లు పూర్తిగా పనిచేస్తున్నాయి. అన్ని టెలిఫోన్ ఎక్చేంజీలూ నడుస్తున్నాయి. మొబైల్ కనెక్టివిటీ పరిధిని కూడా విస్తరిస్తున్నాం'' అని రవీశ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ కోసం భారత్తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్
- ఇమ్రాన్ఖాన్ పప్పులో కాలేశారా.. ఆయన చేసిన ట్వీట్లో ఉన్న తప్పేంటి
- జమ్మూకశ్మీర్ పరిస్థితి మెరుగవుతుందా... లేక మరింత దిగజారుతుందా?
- గోదావరిలో పడవ మునక: 'భర్తను, బిడ్డను పోగొట్టుకుని ఎలా బతకాలి...'
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
- పాకిస్తాన్వన్నీ తప్పుడు ఆరోపణలు.. ఐరాస మానవ హక్కుల మండలిలో స్పష్టం చేసిన భారత్
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- కశ్మీర్పై అజిత్ డోభాల్ చెప్పింది ఎంత వరకు నిజం
- ‘ఉద్యోగాల లోటు లేదు, ఉత్తర భారతీయుల్లో వాటికి అర్హులు లేరు’ - కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)