You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోదావరిలో పడవ మునక: 'నేను చనిపోయినా బాగుండేది.. భర్తను, బిడ్డను పోగొట్టుకున్నాను...'
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి నదిలో లాంచీ మునిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారు తమవారి కోసం గుండెలవిసేలా రోదిస్తున్నారు.
తిరుపతికి చెందిన మాధవీలత ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఆమె భర్త, కుమార్తె గల్లంతవడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
''బిడ్డ లేకుండా నేనెలా బతకాలి.. భర్తను, బిడ్డను పోగొట్టుకుని వచ్చాను.. నేనేం పాపం చేశాను, నేను కూడా చనిపోయిఉంటే బాగుండేది'' అంటూ ఇతర కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆమె రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 మధ్య ప్రమాదం జరిగిందని ప్రమాదం నుంచి బయటపడిన హైదరాబాద్కు చెందిన ఓ పర్యటకుడు చెప్పారు.
తాము అయిదుగురు వచ్చామని, తన భార్య, బావమరిది, ఆయన పిల్లలు గల్లంతయ్యారని ఆయన తెలిపారు.
లాంచీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఉక్కపోతగా ఉందని కొందరు లైఫ్ జాకెట్లు తీసేశారని.. ఈలోగా భోజన ఏర్పాట్లూ జరుగుతుండడంతో చాలామంది లైఫ్ జాకెట్లు వేసుకోలేదని ఆయన చెప్పారు.
ప్రస్తుతం రంపచోడవరం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
వరంగల్ నుంచి 14 మంది పర్యటకుల బృందం ఈ బోటులో ప్రయాణించారు. వారిలో అయిదుగురు బయటపడ్డారు. మిగతా 9 మంది గల్లంతయ్యారు.
లాంచీ సాఫీగానే ప్రయాణించిందని.. మధ్యలో ఒక్కసారిగా పక్కకు ఒరిగి మునిగిపోవడం ప్రారంభించందని, దాంతో సుమారు 20 మంది బోటుపైకి ఎక్కేశారని, కొందరు లైఫ్ జాకెట్లతో ఉన్నవారు ఈదుకుంటూ వెళ్లారని.. తమ బృందంలో అందరికీ ఈత వచ్చని, కానీ, అయిదుగురిమే బతికామని, మిగతా 9మంది ఏమయ్యారో తెలియడం లేదని ప్రభాకర్ అనే వరంగల్ పర్యటకుడు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)