You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫొని తుపాను: ఒడిశా, ఉత్తరాంధ్రలకు హెచ్చరిక.. పూరీ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం
- రచయిత, విజయ్
- హోదా, బీబీసీ కోసం
పెను తుపానుగా మారుతున్న ఫొని ఒడిశా తీరం వైపు వేగంగా దూసుకెళుతోంది. మే 3వ తేదీ శుక్రవారం పూరీ సమీపంలోని గోపాల్పూర్-చంద్బలిల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి 430 కి.మీల దూరంలో.. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 430కి.మీల దూరంలో ఈ పెను తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇది మరింత తీవ్ర రూపం దాల్చి ఉత్తర దిశగా కదులుతూ దిశ మార్చుకొని ఒడిశా తీరం వైపు తరలనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
తుపాను కదులుతున్న మార్గంలో గంటకు 170 నుంచి 205 కి.మీల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు ఫొని తుపాను నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాలై ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్లలో సన్నద్ధతా చర్యల కోసం కేంద్రం హోం శాఖ ముందస్తుగా ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్కు రూ.200.25కోట్లు, ఒడిశాకు రూ.340.87కోట్లు, తమిళనాడుకు రూ. 309.37కోట్లు, పశ్చిమబెంగాల్కు రూ. 233.50కోట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
'జాలర్లు అప్రమత్తంగా ఉండాలి'
తుపాన్ల సమయంలో జాలర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రా యూనివర్సిటీలోఓషినోగ్రఫీ ప్రొఫెసర్ రామకృష్ణ హెచ్చరించారు. సముద్రంలో 500 కి.మీ.ల నుంచి 1500 కి.మీ.ల వరకూ ప్రాంతం తుపాను తీవ్రతను బట్టి దాని వ్యాస పరిధిలోకి రావొచ్చని ఆయన అన్నారు.
''తుపాను ఉన్నప్పుడు సముద్రంలో అల్లకల్లోలాలు ఎక్కువగా ఉంటాయి. అలల ఎత్తు పెరుగుతుంది. చిన్నపాటి నావలు తిరగబడిపోతుంటాయి. జాలర్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తుపాను హెచ్చరికలున్నప్పుడు వేటను మానుకోవడమే మంచిది'' అని రామకృష్ణ చెప్పారు.
నదులు సముద్రంలో కలిసే చోట తుపానులు సాధారణంగా తీరం దాటుతుంటాయని, ఆ ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని ఆయన అన్నారు.
అందుకే చిలకా సరస్సు, పులికాట్ సరస్సు, యానాం, దివిసీమ, డెల్టా ప్రాంతాల్లో తుపాన్లు తీరం దాటుతుంటాయని అన్నారు.
ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా బంగాళాఖాతంలోనే రెండు తుఫాన్ల సీజన్లు ఉంటాయని ఆయన వివరించారు. ఏప్రిల్, మే నెలల్లో మొదటి సీజన్, అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండో సీజన్ ఉంటాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- ఈవీఎం వీవీ ప్యాట్ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది
- పల్లెపల్లెకూ బ్రాడ్బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- హోలీకి ముందే Surf Excel వెంటపడుతున్న జనం
- గోడలు, గార్డులు లేని జైలు... పని చేసుకుని బతికే ఖైదీలు
- సూపర్ హీరో సినిమాల సక్సెస్కు కారణాలివేనా
- ‘‘దక్షిణ భారతదేశంలో భారీ ఉగ్రదాడులు’’ అంటూ కర్నాటక పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిన డ్రైవర్ అరెస్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)