You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డీకే అరుణ, జయసుధ: కండువా మారింది, స్వరం మారింది
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో నాయకులు పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో నేతల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి.
తెలంగాణలో గత కొద్ది వారాల్లో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా, డీకే అరుణ బీజేపీ గూటికి చేరారు.
ఇలా పార్టీలు మారుతున్న నేతలు గతంలో ఏమన్నారు? పార్టీ కండువా మార్చిన తర్వాత ఏం చెబుతున్నారు?
డీకే అరుణ
2018 సెప్టెంబర్ 6న తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ...
"బీజేపీ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకుని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. టీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు, కానీ వాళ్లకు వందలో సున్నాలు తీసేస్తే, ఒక్క సీటు కూడా రాదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది" అన్నారు.
2019 మార్చిలో
ఆమె తాజాగా బీజేపీలో చేరారు. అనంతరం, టీవీ9 ఛానల్తో ఆమె మాట్లాడుతూ...
"తెలంగాణలో ఉన్న కొందరు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు. కాంగ్రెస్ ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయన్న ఆశలు పోయాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం. మోదీ మళ్లీ ప్రధాని కావాలి. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా. కార్యకర్తలందర్నీ కలుపుకుని తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు వ్యూహాలు రూపొందిస్తా" అన్నారు.
జయ సుధ
2016 జనవరిలో ఎన్టీఆర్ పార్టీ (టీడీపీ)లో చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జయసుధ అన్నారు.
"హైదరాబాద్ ఉన్నత స్థానానికి ఎదగడానికి కారణం చంద్రబాబే. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలందరికీ సేవ చేయాలన్న ఆలోచనతో ఇందులో చేరాను" అని జయసుధ చెప్పారు.
2019 మార్చిలో
"నన్ను ఎవరు రాజకీయాల్లో పరిచయం చేశారో, తిరిగి అదే వైఎస్సార్ కుటుంబ సభ్యురాలిగా నేను వైసీపీలో చేరాను. జగన్ ఎలా ఆదేశిస్తే దాని ప్రకారం పనిచేస్తా. ఈ ఎన్నికల్లో పార్టీ వంద శాతం గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. పార్టీని ఇంకా బలోపేతం చేసేందు ఇందులో చేరాను" అని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
- జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ: ‘‘ఈ రోజు నుంచి జనసైనికుడిని’’
- పవన్ కల్యాణ్: జనసేన మేనిఫెస్టో ఇదే
- టీడీపీ ఎన్నికల శంఖారావం: ‘కేంద్రం, కేసీఆర్ బెదిరింపులకు భయపడం’
- వైసీపీ లోక్సభ అభ్యర్థులు వీరే
- జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)