ఎంజే అక్బర్‌ రాజీనామా: ఆయనపై ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టులు ఎవరు? ఇప్పుడు ఏమంటున్నారు?

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

#MeToo ఉద్యమంలో భాగంగా దాదాపు 20 మంది మహిళా పాత్రికేయులు అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ‘ఏషియన్ ఏజ్‌’తో పాటు ఇతర పత్రికల్లో సంపాదకుడిగా పనిచేసే సమయంలో అక్బర్ తమను లైంగికంగా వేధించినట్లు వాళ్లు ఆరోపించారు.

వీళ్లందరిలో మొదట ఆయన పేరు ప్రస్తావించిన వ్యక్తి ... ప్రియా రమణి. 2017లో వోగ్ పత్రికకు 'టు ది హర్వే వైన్‌స్టీన్స్ ఆఫ్ ది వరల్డ్' శీర్షికతో రాసిన కథనంలో పని చేసే చోట వేధింపులు ఎలా ఉంటాయో వివరించారు. ఆ కథనాన్ని రమణి అక్టోబర్ 8న రీట్వీట్ చేస్తూ, అందులో వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ప్రస్తావించిన వ్యక్తి ఎంజే అక్బర్ అని వెల్లడించారు.

న్యూస్ రూం బయట, లోపల కూడా ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు.

'అక్బర్ రాజీనామాతో మా ఆరోపణలు నిజమైనవే అని రుజువైంది. కోర్టులో కూడా నాకు న్యాయం జరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నా' అని ఆమె ట్వీట్ చేశారు.

ఈ ఆరోపణలన్నింటిపై తాను వ్యక్తిగత హోదాలోనే కోర్టులో పోరాడతానని రాజీనామా చేసిన అనంతరం అక్బర్ తెలిపారు.

సుపర్ణా శర్మ

అక్బర్ రాజీనామా తనతో పాటు మీటూ ఉద్యమానికి కూడా లభించిన పెద్ద విజయం అని ఏషియన్ ఏజ్ రెసిడెంట్ ఎడిటర్ సుపర్ణా శర్మ అన్నారు.

విదేశాల నుంచి తిరిగి రాగానే ఆయన ఈ పని చేసుండాల్సిందని ఆమె బీబీసీతో చెప్పారు. ఒత్తిడి పెరగడంతో ఆయన ఈ పని చేసుంటారని అన్నారు.

అక్బర్‌పై ఆరోపణలు చేసిన మహిళలు... ఒకరిని చూసి మరొకరు ధైర్యం తెచ్చుకున్నారని, ఇది మీటూ ఉద్యమం ఫలితమేనని పేర్కొన్నారు.

'ఇప్పుడు ఈ కేసు ఎంజే అక్బర్ వర్సెస్ ప్రియా రమణి కేసు మాత్రమే కాదు. ఆయన ఆరోపణలు చేసిన మహిళలందరిపైనా పోరాడాలి' అని తెలిపారు.

సవా నఖ్వీ

తాను టెలిగ్రాఫ్ పత్రికలో ట్రెయినీగా పని చేసే సమయంలో, ఉన్నత స్థానంలో ఉన్న అక్బర్ తనను లైంగికంగా వేధించారని మహిళా పాత్రికేయురాలు సభా నఖ్వీ ఆరోపించారు.

అక్బర్ రాజీనామా మహిళల పోరాటానికి దక్కిన విజయమని నఖ్వీ బీబీసీతో చెప్పారు.

'మహా అష్టమి రోజు దుర్గా దేవి రాక్షసుడిని వధించింది' అని ఆమె ట్వీట్ చేశారు.

గజాలా వహాబ్

అక్బర్ రాజీనామాను తాను మొదట నమ్మలేకపోయినట్లు పాత్రికేయురాలు గజాలా వహాబ్ చెప్పారు.

'నేను రెండు మూడు సోర్సుల ద్వారా ఆ విషయాన్ని ధ్రువీకరించుకున్నాను. ఆ వార్త వినగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది'.

'ఇది జరగాల్సిందే. ఇది ఒక్కరి పోరాటం కాదు. 20మంది మహిళలు ఒకరికోసం ఒకరు పోరాడుతున్నారు. మహిళలంతా కలిసి పోరాడితే ఫలితాలు తప్పక వస్తాయని ఈరోజుతో నాకు నమ్మకం కలిగింది' అని గజాలా బీబీసీతో చెప్పారు.

భారత్‌లో మీటూ ఉద్యమం విజయవంతమైందని, దీని వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, ఏ తప్పునీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని వాళ్లు గుర్తిస్తున్నారని గజాలా చెప్పారు.

శుతాపా పాల్

‘అక్బర్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయడం మంచి పరిణామం' అని ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన 'న్యూ క్రాప్' ఎడిటర్ శుతాపా పాల్ అభిప్రాయపడ్డారు.

మీడియా, పాత్రికేయులతో పాటు మొత్తం సమాజానికి ఈ క్రెడిట్ దక్కుతుందని ఆమె చెప్పారు. అక్బర్ రాజీనామాను న్యాయం వైపు మరో ముందడుగుగా ఆమె అభివర్ణించారు.

మాజ్లీ కెంప్

మాజ్లీ కెంప్ అనే విదేశీ పాత్రికేయురాలు కూడా అక్బర్‌పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2007లో ఏషియన్ ఏజ్ పత్రికలో ఇంటెర్న్‌గా పనిచేసే సమయంలో అక్బర్ తనను వేధించారని ఆమె ఆరోపించారు.

ఈమెతో పాటు త్రుషిత పటేల్, కనికా గహ్లోత్, మీనల్ బదేల్, ప్రేరణా బింద్రా, మనీషా పాండే, రమోలా తల్వార్, కనీజా కజారీ, మాలవికా బెనర్జీ, ఏటీ జయంతి, హమీదా పార్కర్, సంజరి ఛటర్జీ, మీనాక్షీ కుమార్, సుజాతా దత్‌ తదితర 20 మంది మహిళలు అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)