You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు: ఇద్దరే దోషులు... మరో ఇద్దరు నిర్దోషులు... ఉరే తగిన శిక్ష అంటున్న బాధితులు
పదకొండేళ్ల కిందట హైదరాబాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్లలో నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనల్లో 42 మంది చనిపోయారు. దాదాపు 300 మంది గాయపడ్డారు.
ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. మొదటి ముద్దాయి అనిక్ షఫిఖ్ సయ్యద్, రెండో ముద్దాయి మొహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను దోషులుగా ప్రకటించింది. వీరికి శిక్షలను సోమవారం ఖరారు చేయనుంది.
ఈ పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ సంస్థ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి ఎండీ సిద్దిఖ్ ఇస్సార్ అహ్మద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనిక్ షఫిఖ్ సయ్యద్, ఫారుఖ్ షర్ఫుద్దీన్ తార్కష్లను ముంబయి పోలీసులు మొదట అరెస్టు చేశారు.
ఇందులో ఫారూఖ్ షర్ఫుద్దీన్, మొహమ్మద్ సాదిక్ ఇష్రత్ షేక్లు నిరపరాధులని ఎన్ఐఏ కోర్టు ప్రకటించింది.
పీడీ యాక్ట్ కింద ముంబయి పోలీసుల నుంచి వీరిని ఆక్టోపస్ విభాగం, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేశారు.
చార్జ్షీట్లో ఐఎంకు చెందిన అనీఖ్, రియాజ్ భత్కల్, అక్బర్, ఇక్బాల్ భత్కల్, అమీర్ రజా ఖాన్, ఫారూఖ్ తర్ఖాష్, సాదిక్ షేక్లను నిందితులుగా పేర్కొన్నారు.
ఆ రోజు ఏం జరిగింది?
ఆగస్టు 25, 2007 రాత్రి 7.45 నిమిషాలు..
ట్యాంక్బండ్లోని లుంబినీపార్క్లో హైదరాబాద్ చరిత్ర దాని విశిష్టతలను వివరిస్తూ లేజర్ షో సాగుతోంది.
ఎక్కడినుంచో వచ్చిన ప్రేక్షకులంతా భాగ్యనగరం గొప్పతనాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.
కొన్ని క్షణాలకు వారున్న చోట పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు.
ఈ ఘటన నుంచి తేరుకునేలోపే మరికొన్ని నిమిషాల్లోనే కోఠీలోని గోకుల్ చాట్లో పేలుడు జరగడంతో 33 మంది చనిపోయారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మరో 19 బాంబులను గుర్తించి పేలకుండా నిర్వీర్యం చేశారు.
1125 పేజీలతో చార్జిషీట్
జంట పేలుళ్లకు సంబంధించి ఏడుగురి పేర్లతో కూడిన 1125 పేజీలతో మూడు చార్జిషీట్లను పోలీసులు దాఖలు చేశారు.
కేసులో 286 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. మక్కా పేలుళ్ల తరువాత పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టు విచారణలో తేలింది.
ఐఈడీ బాంబుల వినియోగం
ఈ పేలుళ్లకు ఇంప్రువైజ్డ్ ఎక్స్ప్లోజీవ్ డివైస్ (ఐఈడీ)లను ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు.
టిఫిన్ బాక్సుల్లో బాంబులను ఉంచి వాటికి టైమర్లను అమర్చి పేలుళ్లు జరిపినట్టు చెప్పారు.
‘ఇంతకాలం వేచి చూసినా న్యాయం జరగలేదు’
సుదీర్ఘకాలం పాటు న్యాయం కోసం ఎదురు చూశామని, ఇప్పటికి కూడా తమకు న్యాయం జరగలేదని గోకుల్ చాట్ వద్ద జరిగిన పేలుడు బాధితుల్లో ఒకరైన చందర్ నాయక్ అన్నారు. చర్లపల్లి జైలు వద్ద ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ప్రకటించిన తర్వాత ఆయన బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడుతూ.. ‘‘పేలుడులో నా కుడి కన్ను కోల్పోయాను. ఈ తీర్పుతో నేను సంతోషంగా లేను. ఇద్దరు నిందితులు నిరపరాధులని ప్రకటించారు. వాళ్లు నిరపరాధులే అయితే ఇంతకాలం జైలులో ఎందుకు పెట్టారు? ఎంతో కాలం న్యాయం కోసం ఎదురుచూశాను. నాకు రూ.20 వేలు నష్టపరిహారం మాత్రమే దక్కింది. నేనిప్పుడు ఒక కన్ను కోల్పోయాను. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు.
‘వారికి ఉరిశిక్ష వేయాలి’
నిందితులకు ఉరిశిక్ష వేయాలని సోమవారం తాము వాదిస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శేషు రెడ్డి తెలిపారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సురేందర్ మాట్లాడుతూ.. ‘‘ఇండియన్ ముజాహిద్దీన్కు చెందినవాళ్లే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని దర్యాప్తు క్రమంలో తేలింది’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
- జలాలుద్దీన్: అఫ్ఘానిస్తాన్ హక్కానీ మిలిటెంట్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు మృతి
- అర్జెంటీనాలో 60 శాతం వడ్డీ: పెట్టుబడి పెడతారా?
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- ‘పత్రిక ఎడిటర్ని చూసి కారు డ్రైవర్ అనుకున్నారు’
- గ్రౌండ్ రిపోర్ట్: 'ఆమె నిరసనలో పాల్గొనలేదు.. అయినా కాల్చి చంపారు'
- ‘700 ఏళ్ల పిల్లలమర్రి’ చెట్టుకు 'సెలైన్' బాటిళ్లతో చికిత్స
- కృత్రిమ మేధస్సు: కాల్ సెంటర్లలో ఉద్యోగాలు హుష్ కాకేనా?
- కాలేజీలను తిట్టడం సరే, తల్లిదండ్రులుగా మనమేం చేస్తున్నాం?
- హైదరాబాద్: 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'
- కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- మనం ఉన్నది 2018లో కాదు... 1940 లేదా 2075!
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్ను పాకిస్తాన్కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. అక్టోబర్ 31న ఆవిష్కరణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)