ఇంజన్ లేకుండానే రైలు 15 కిలోమీటర్లు నడిచింది.. ఎలా!?
- రచయిత, సుబ్రత్ కుమార్ పతి
- హోదా, బీబీసీ ప్రతినిధి
డ్రైవర్లు లేని వాహనాలు వస్తున్నాయని ఈ మధ్య వింటున్నాం. కానీ అసలు ఇంజన్ లేకుండానే ఓ రైలు ఏకంగా పదిహేను కిలోమీటర్లు పరుగు తీసిన కనీవినీ ఎరుగని విచిత్ర సంఘటన ఒడిషాలో జరిగింది.
శనివారం రాత్రి 22 పెట్టెలు ఉన్న ఓ ప్యాసింజర్ రైలు టిట్లాగఢ్ స్టేషన్ నుంచి ఇంజన్ లేకుండానే 15 కి.మీ. దూరం వెళ్లింది.
రాత్రి సుమారు 10 గంటల సమయంలో అహ్మదాబాద్-పూరీ ఎక్స్ప్రెస్ టిట్లాగఢ్ స్టేషన్లో నిలబడి ఉంది. సంబల్పూర్ వెళ్లాల్సిన ఆ రైలు ఇంజన్ను అక్కడ మారుస్తున్నారు.
అయితే ఇంజన్ మార్చడానికి దాన్ని రైలు పెట్టెల నుంచి వేరు చేయగానే, పెట్టెలన్నీ ప్లాట్ఫామ్పై నుంచి కదిలి వెళ్లిపోయాయి. దీంతో ఆ రైలు పెట్టెలు వెళ్లే మార్గంలో రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసి గేట్లన్నిటినీ మూసివేయించారు.

ఫొటో సోర్స్, BBC / SURESH AGRAWAL
సుమారు 15 కి.మీ ప్రయాణించాక రైలును రాత్రి 12 గంటల సమయంలో పట్టాలపై పెద్ద పెద్ద రాళ్లు అడ్డం పెట్టి కెసింగ స్టేషన్లో నిలిపేశారు.
ఈ ఘటనలో ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ తెలిపింది.
ఇలా జరగడానికి కారణం రైలు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన భద్రతాధికారి ఎస్ఎస్ మిశ్రా తెలిపారు.

ఫొటో సోర్స్, BBC / SURESH AGRAWAL
ఇదెలా జరిగింది?
రైల్వే అధికారులు ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
స్వయంగా సంబల్పూర్ డివిజన్ డీఆర్ఎమ్ జయదేవ్ గుప్తా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్కిడ్ బ్రేకులు సరిగా ఉపయోగించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు.
రైల్వేశాఖ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి జ్యోతి ప్రకాశ్ మిశ్రా తెలిపారు.
ఈ సంఘటన అనంతరం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే అభియోగంతో ఇద్దరు డ్రైవర్లు సహా మొత్తం ఏడుగురిని సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









